ఇంకా జగన్ జపమే..
ABN , Publish Date - Feb 23 , 2025 | 12:24 AM
ప్రభుత్వం మారినా అనకాపల్లి పట్టణంలో జీవీఎంసీ సచివాలయ సిబ్బంది మాజీ సీఎం జగన్ జపం వీడలేదు.

కూటమి ప్రభుత్వం వచ్చినా మారని అధికారుల తీరు
26వ సచివాలయం బోర్డుపై తొలగని మాజీ సీఎం ఫొటో
అనకాపల్లి, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం మారినా అనకాపల్లి పట్టణంలో జీవీఎంసీ సచివాలయ సిబ్బంది మాజీ సీఎం జగన్ జపం వీడలేదు. స్థానిక గవరపాలెంలోని మరిడిమాంబ ఆలయానికి సమీపంలో 25, 26వ వార్డుల పరిధిలోని సచివాలయానికి వైసీపీ పాలనలో ఏర్పాటు చేసిన జగన్ ఫొటోతో ఉన్న బోర్డునే కొనసాగిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రామ, వార్డు సచివాలయాలపై జగన్ ఫొటోను తొలగించాలని, రాజకీయ నాయకుల ఫొటోలు అవసరం లేదంటూ స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసింది. కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టి ఎనిమిది నెలలు కావస్తున్నా జీవీఎంసీ సచివాలయ సిబ్బంది పాత బోర్డును తొలగించలేదు. కొద్ది రోజుల్లో ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ శాసన మండలి ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున రాజకీయ పార్టీల నాయకుల ఫొటోలు తొలగించాలని ఎన్నికల కమిషన్ స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసింది. అయినా జీవీఎంసీ సచివాలయ సిబ్బంది స్పందించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.