పక్కాగా టెన్త్, ఇంటర్ పరీక్షలు
ABN , Publish Date - Feb 14 , 2025 | 10:44 PM
రానున్న పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు జిల్లా కలెక్టర్ ఏఎస్.దినేశ్కుమార్ తెలిపారు.

జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేశ్కుమార్
పరీక్ష కేంద్రంలోకి ఎలకా్ట్రనిక్ పరికరాలకు అనుమతి లేదు
కిలోమీటరు పరిధిలో నెట్, జెరాక్స్ ఉండకూడదు
సమస్యాత్మక కేంద్రాలలో సీసీ కెమెరాలు
మాస్ కాపీయింగ్కు ఆస్కారం లేకుండా చూడాలి
పాడేరురూరల్, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి): రానున్న పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు జిల్లా కలెక్టర్ ఏఎస్.దినేశ్కుమార్ తెలిపారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన అధికారుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పరీక్షలను ఎటువంటి లోటుపాట్లు లేకుండా నిర్వహించాలని ఆదేశించారు. పరీక్ష కేంద్రాల వద్ద గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని, సమస్యాత్మక పరీక్ష కేంద్రాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, 144 సెక్షన్ అమలు చేయాలని ఆదేశించారు. పరీక్ష కేంద్రానికి కిలోమీటరు పరిధిలో ఇంటర్నెట్, జెరాక్స్ సెంటర్లను మూసి వేయించాలని ఆదేశించారు. పరీక్ష కేంద్రాల్లోకి అభ్యర్థులు, ఇన్విజిలేటర్లు, ఇతర సిబ్బంది ఎలకా్ట్రనిక్ పరికరాలు తీసుకువెళ్లరాదన్నారు. పోలీసులు ముందుగా తనిఖీ చేయాలని ఆదేశించారు. ఎక్కడా మాస్ కాపీయింగ్కు ఆస్కారం లేకుండా చూడాలన్నారు. పరీక్ష కేంద్రాలకు అభ్యర్థులు సకాలంలో చేరాలన్నారు. సమయం మించిన తరువాత వచ్చే అభ్యర్థులను అనుమతించవద్దన్నారు. జిల్లాలో పదో తరగతి పరీక్షలను 11,766 మంది రెగ్యులర్ విద్యార్థులు, ఓపెన్ స్కూల్ ద్వారా 1,297 మంది హాజరవుతున్నారన్నారు. మార్చి 17 నుంచి 31వ తేదీ వరకు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. ఇందుకోసం 71 కేంద్రాల్లో పరీక్షలను నిర్వహిస్తున్నామన్నారు. వీటిలో 18 కేంద్రాలలో ఓపెన్ స్కూల్ పరీక్షలు జరుగుతాయన్నారు. ఇంటర్ మొదటి సంవత్సర పరీక్షలకు 6,518, ఓపెన్ పరీక్షలకు 1,545 మంది, రెండో సంవత్సర పరీక్షలకు 5,335 మంది, ఒకేషనల్ పరీక్షలకు 1,322 మంది హాజరు కానున్నారన్నారు. ఇంటర్ పరీక్షలు మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయన్నారు. పరీక్ష కేంద్రాలలో తాగునీరు, మరుగుదొడ్లు, లైట్లు, ఫ్యాన్లు ఉండేలా అధికారులు చూసుకోవాలన్నారు. డీఈవో, ఇంటర్మీడియట్ కార్యాలయంలో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేయాలన్నారు. బంద్ కారణంగా ఈనెల 11వ తేదీన వాయిదా వేసిన ప్రాక్టికల్ పరీక్షను ఫిబ్రవరి 20వ తేదీన నిర్వహించే విధంగా చర్యలు చేపట్టామన్నారు. ఈ సమావేశంలో డీఆర్వో పద్మలత, డీఈవో బ్రహ్మాజీరావు, టీడబ్ల్యూ డీడీ ఎల్.రజని, డీఐఈవో కె.అప్పలరాము, సహాయ కమిషనర్(పరీక్షలు) శశికుమార్, డీపీవో లవరాజు, డీఎల్పీవో పీఎస్.కుమార్, ఈపీడీసీఎల్ ఈఈ అప్పారావు, ఆర్టీసీ డీఎం టి.ఉమామహేశ్వరరెడ్డి, సీఐ డి.దీనబందు, వైద్య ఆరోగ్య శాఖ, తపాలా శాఖ, తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.