పాడేరు మెయిన్ రోడ్డు విస్తరణ షూరు!
ABN , Publish Date - Feb 21 , 2025 | 10:47 PM
జిల్లా కేంద్రం పాడేరులోని ప్రధాన రహదారుల విస్తరణకు రంగం సిద్ధమైంది. స్థానిక అంబేడ్కర్ సెంటర్ నుంచి విశాఖపట్నం, అరకులోయ, చింతపల్లి మార్గాల వైపు రోడ్డు విస్తరణ జరగనుంది.
కూటమి ప్రభుత్వం గ్రీన్సిగ్నల్
రూ.50 కోట్లు మంజూరుకు సూత్రప్రాయంగా ఆమోదం
చింతపల్లి, అరకులోయ, విశాఖపట్నం వైపు విస్తరణ
రెండు కిలోమీటర్లు విస్తరించాలని నిర్ణయం
చింతపల్లి వైపు నేషనల్ హైవే అఽథారిటీ కి..
అరకులోయ, విశాఖ రూట్లను ఆర్అండ్బీకి అప్పగింత
ఇప్పటికే ఆక్రమణదారులకు నష్టపరిహారం చెల్లింపు
(పాడేరు- ఆంధ్రజ్యోతి)
జిల్లా కేంద్రం పాడేరులోని ప్రధాన రహదారుల విస్తరణకు రంగం సిద్ధమైంది. స్థానిక అంబేడ్కర్ సెంటర్ నుంచి విశాఖపట్నం, అరకులోయ, చింతపల్లి మార్గాల వైపు రోడ్డు విస్తరణ జరగనుంది. విస్తరణ బాధ్యతను చింతపల్లి వైపు మార్గాన్ని నేషనల్ హైవే అఽథారిటీకి కేటాయించగా.. అరకులోయ, విశాఖపట్నం వైపు మార్గాలను రోడ్ల, భవనాల శాఖకు ప్రభుత్వం అప్పగించింది. ఈమేరకు కూటమి ప్రభుత్వ గ్రీన్సిగ్నల్ ఇచ్చింది.
నేషనల్ హైవే అథారిటీతో ఒకవైపు రోడ్డు విస్తరణ
జిల్లా కేంద్రం పాడేరు మెయిన్రోడ్ల విస్తరణ రోడ్ల, భవనాల శాఖ ఆధ్వర్యంలో చేపట్టాలని 2016లోనే ప్రతిపాదించారు. అందుకు గానూ 2018లోనే రూ.47 కోట్లు మంజూరు చేశారు. కాని 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఆ పనిని రద్దు చేసింది. ఆ తర్వాత 2023లో వైసీపీ ప్రభుత్వం సైతం రోడ్డు విస్తరణకు ప్రతిపాదనలు చేసి విఫలమైంది. ప్రస్తుత కలెక్టర్ ఏఎస్.దినేశ్కుమార్ సైతం మెయిన్రోడ్డు విస్తరణకు ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి సమర్పించారు. అయితే ప్రస్తుతం రాజమండ్రి నుంచి విజయనగరం వరకు జాతీయ రహదారి 516ఈ పనులు జరుగుతుండడంతో పాడేరు నుంచి చింతపల్లి వైపు ఉన్న మెయిన్రోడ్డు విస్తరణ పనులను నేషనల్ హైవే అథారిటికే అప్పగించారు. దీంతో ఇప్పటికే రోడ్డు విస్తరణకు అవసరమైన స్థలాల ఎంపిక, ఆక్రమణల గుర్తించి, నష్టపోతున్న వారికి పరిహారం సొమ్మును వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. దీంతో మరో నెల రోజుల్లో పాడేరు అంబేడ్కర్ సెంటర్ నుంచి చింతపల్లి వైపున మెయిన్రోడ్డు విస్తరణ పనులు ప్రారంభం కానున్నాయి. ఇదిలా ఉండగా అంబేడ్కర్ సెంటర్ నుంచి అటు అరకులోయ వైపు, ఇటు విశాఖపట్నం వైపు ఉన్న రోడ్డు విస్తరణకు సైతం రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అనుమతి ఇచ్చింది. ప్రతిపాదనలను ఆమోదించి, రూ.50 కోట్లు మంజూరు చేసేందుకు అంగీకరించింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఆ నిధులు విడుదల అవుతాయని అధికారులు అంటున్నారు.
మెయిన్రోడ్లు విస్తరణ జరిగేదిలా..
పాడేరు మెయిన్రోడ్ల విస్తరణలో భాగంగా స్థానిక అంబేడ్కర్ కూడలిని సెంటర్ పాయింట్గా ఎంపిక చేశారు. అక్కడి నుంచి అరకులోయ వెళ్లే మార్గం, ఇటు విశాఖపట్నం వెళ్లే రోడ్డు, మరో వైపు చింతపల్లి వెళ్లే రహదారి ఉంది. అంబేడ్కర్ సెంటర్ నుంచి ఆయా మార్గాల్లోని మెయిన్ రోడ్డును రెండు కిలోమీటర్ల దూరం వరకు విస్తరించాలని అధికారులు నిర్ణయించారు. అలాగే ప్రస్తుతం పాడేరు నుంచి చింతపల్లి వెళ్లే రోడ్డు 21 అడుగులుండగా, అరకులోయ, విశాఖపట్నం వెళ్లే రోడ్లు 30 అడుగులు చొప్పున వెడల్పున్నాయి. దీంతో మూడు రోడ్లను 54 అడుగులుగా విస్తరించాలని, దానిలో ఇరువైపులా ఆరేసి అడుగుల చొప్పున(మొత్తం 12 అడుగులు) నడకదారి, మధ్యలో 42 అడుగుల తారురోడ్డు వేయాలని అధికారులు నిర్ణయించారు. దీంతో ప్రస్తుతం ఉన్న రోడ్డు మధ్య నుంచి ఇరువైపులా 35 అడుగుల చొప్పున(మొత్తం 70 అడుగులు) స్థల సేకరణ ప్రక్రియ పూర్తి చేశారు.
విస్తరణతో ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం
పాడేరు మెయిన్రోడ్డు విస్తరణతోనే ట్రాపిక్ సమస్యకు చెక్ పెట్టగలమని చాలా కాలంగా అధికారులు భావిస్తున్నారు. ఇన్నాళ్లు రెవెన్యూ డివిజన్ కేంద్రం, ఐటీడీఏ ప్రధాన కేంద్రంగా ఉన్న పాడేరు 2022 ఏప్రిల్ నుంచి జిల్లా కేంద్రం కావడంతో వాహనాల రద్దీ పెరిగింది. అలాగే విశాఖపట్నం నుంచి ఒడిశా రాష్ట్రానికి రాకపోకలు సాగించాలంటే పాడేరు మీదుగా వెళ్లాలి. ఈక్రమంలో పాడేరు పట్టణంలోని ప్రస్తుతం ఉన్న రోడ్లు ఇరుకుగా ఉండడంతో తరచూ ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఈక్రమంలో జిల్లా కేంద్రంలోని మెయిన్ రోడ్లను విస్తరించాలనే ప్రతిపాదన చాలా కాలంగా ఉంది.
వైసీపీ హయాంలో సీఎస్ హామీ ఇచ్చినా..
2023లో అప్పటి జిల్లా కలెక్టర్ సుమిత్కుమార్ అభ్యర్థన మేరకు స్థానిక రోడ్ల విస్తరణకు ప్రత్యేకంగా నిధులు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్.జవహర్రెడ్డి ప్రకటించినప్పటికీ కార్యరూపం దాల్చలేదు. ఉన్నతాధికారుల సూచనలతో మెయిన్రోడ్డు విస్తరణకు అవసరమైన డీటైల్ ప్రాజెక్టు రిపోర్టు రూపొందించడంతోపాటు రూ.30 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదనలు ప్రభుత్వానికి సమర్పించారు. కాని ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఉత్తర్వులు రాలేదు. మెయిన్రోడ్డు విస్తరిస్తామనే ఆలోచనతో అధికారులు అప్పట్లో రోడ్డుకు ఇరుపైపులా ఉన్న ఆక్రమణలు తొలగించారు. కాని వైసీపీ ప్రభుత్వం చొరవ చూపకపోవడంతో మెయిన్రోడ్డు విస్తరణ కార్యరూపం దాల్చలేదు.