మంత్రి లోకేశ్ రాక రేపు
ABN , Publish Date - Jan 04 , 2025 | 12:34 AM
రాష్ట్ర ఐటీ, మానవ వనరుల అభివృద్ధి శాఖా మంత్రి నారా లోకేశ్ ఆదివారం ఉదయం నగరానికి వస్తున్నారు.

విశాఖపట్నం, జనవరి 3 (ఆంధ్రజ్యోతి):
రాష్ట్ర ఐటీ, మానవ వనరుల అభివృద్ధి శాఖా మంత్రి నారా లోకేశ్ ఆదివారం ఉదయం నగరానికి వస్తున్నారు. ఈనెల ఎనిమిదో తేదీన ప్రధాని రానున్న నేపథ్యంలో పర్యటన ఏర్పాట్లపై కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. మధ్యాహ్నం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కూటమి పార్టీల ప్రజా ప్రతినిధులు, నాయకులతో సమన్వయ సమావేశం నిర్వహించి ప్రధాని సభకు జన సమీకరణపై చర్చిస్తారు. అనంతరం విజయవాడ వెళతారు. తిరిగి ఏడో తేదీ రాత్రి నగరానికి వచ్చి ఎనిమిదో తేదీన ఐటీ సదస్సులో పాల్గొంటారు. అనంతరం ప్రధాని సభకు హాజరవుతారు.
----- ----- ----- ----- ----- ----- ----- ----- ----- ----- ----- ----- ----- -----
అనకాపల్లి జిల్లాలో విమానాశ్రయం?
అధికారులతో సమీక్ష సమావేశంలో సీఎం
నక్కపల్లి ప్రాంతంలో ఏర్పాటుకు ప్రతిపాదన
విశాఖపట్నం, జనవరి 3 (ఆంధ్రజ్యోతి):
అనకాపల్లి జిల్లాలో విమానాశ్రయం ఏర్పాటుచేసే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ప్రతి జిల్లాలో విమానాశ్రయం ఉండాలనేది ప్రభుత్వ లక్ష్యం. రాష్ట్రంలో ఎయిర్పోర్టుల విస్తరణ, కొత్త ఎయిర్పోర్టుల నిర్మాణంపై శుక్రవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఉండవల్లిలో సమీక్ష జరిపారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో భారీ స్టీల్ ప్లాంటు, బల్క్ డ్రగ్ పార్కు, అచ్యుతాపురం సమీపాన ఎన్టీపీసీ హైడ్రోజన్ ప్లాంటు ఏర్పాటు కానున్నందున విమానాశ్రయం అవసరం ఉందని ఈ సందర్భంగా చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. భోగాపురంలో విమానాశ్రయం పూర్తయితే విశాఖ విమానాశ్రయంలో కార్యకలాపాలు ఆగిపోయే అవకాశం ఉంది. అప్పుడు అనకాపల్లి జిల్లాకు చెందిన పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు భోగాపురం వెళ్లాల్సి ఉంటుంది. అంత దూరం వెళ్లాల్సిన అవసరం లేకుండా అనకాపల్లి, కాకినాడ, విశాఖపట్నం ప్రజలకు అందుబాటులో ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. కాగా అనకాపల్లి జిల్లా నక్కపల్లి ప్రాంతంలో ఏపీఐఐసీ ఆధీనంలో ఐదు వేల ఎకరాలు ఉంది. మిట్టల్ స్టీల్ ప్లాంటు, బల్క్ డ్రగ్ పార్కుకు కేటాయించగా మిగిలిన భూమిలో విమానాశ్రయం ఏర్పాటయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు. విమానాశ్రయం ఏర్పాటు, స్థల సేకరణపై ఇంకా తమకు ఎటువంటి మార్గదర్శకాలు రాలేదని అనకాపల్లి జిల్లా అధికారులు చెబుతున్నారు.