మాఘ పౌర్ణమి జాతరకు పోదామా!
ABN , Publish Date - Feb 11 , 2025 | 12:37 AM
మాఘ పౌర్ణమి సందర్భంగా మండలంలోని పూడిమడకలో మంగళవారం సాయంత్రం జాతర ప్రారంభం కానున్నది. ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి సుమారు లక్ష మంది భక్తులు వస్తారన్న అంచనాతో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
నేడు పూడిమడక, రేవుపోలవరం సముద్ర తీరాల్లో తీర్థమహోత్సవాలు
వేలాదిగా తరలిరానున్న భక్తులు
నేటి రాత్రంతా జాగారం
రేపు తెల్లవారుజాము నుంచి పుణ్యస్నానాలు
భారీ ఎత్తున ఏర్పాట్లు, పోలీసు బందోబస్తు
అచ్యుతాపురం, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి): మాఘ పౌర్ణమి సందర్భంగా మండలంలోని పూడిమడకలో మంగళవారం సాయంత్రం జాతర ప్రారంభం కానున్నది. ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి సుమారు లక్ష మంది భక్తులు వస్తారన్న అంచనాతో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మంగళవారం రాత్రి భక్తులు జాగారం చేస్తారు. ఈ సందర్భంగా తీరంలో పలు రకాల సాంస్కృతిక, వినోదభరిత కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు. బుధవారం తెల్లవారుజాము నుంచి సముద్రంలో పుణ్యస్నానాలు ఆచరిస్తారు. అనంతరం తీరంలోని ఆలయంలో లక్ష్మి, వేణుగోపాలస్వామి, సుభద్ర, బలరామ సహిత జగన్నాథస్వామిని దర్శించుకుంటారు. వాహనాల కోసం పూడిమడక శివారులోని ఉప్పు గల్లీల వద్ద పార్కింగ్ ఏర్పాటు చేశారు. ఆర్టీసీ అధికారులు అనకాపల్లి నుంచి ప్రత్యేక బస్సులు నడపనున్నారు. కాగా పరవాడ డీఎస్పీ విష్ణుస్వరూప్, మెరైన్ డీఎస్పీ సంహాద్రి నాయుడు, తహసీల్దార్ జనార్దన్, ఎంపీడీఓ ప్రభాకరరావు సోమవారం సాయంత్రం పూడిమడక తీరంలో పర్యటించి జాతర ఏర్పాట్లను పరిశీలించారు. భక్తులు సముద్రంలో ఎక్కువ దూరం వెళ్లకుండా నివారించేందుకు తీరంలో 30 పడవల్ని ఒకదానితో మరొకటి తాళ్లతో కట్టి ఉంచుతున్నామన్నారు. తీరంలో హై మాస్ట్ లైట్లు, మైక్లు, సీసీ కెమెరాలు ఏర్పాటుచేశామన్నారు. తీరంలో 30 మంది గజఈతగాళ్లను అందుబాటులో వుంచుతామని చెప్పారు. ముగ్గురు సీఐలు, పది మంది ఎస్ఐలు, 150 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.
రేవుపోలవరంలో...
ఎస్.రాయవరం, పిబ్రవరి 10(ఆంధ్రజ్యోతి): మాఘ పౌర్ణమి సందర్భంగా మండలంలోని రేవు పోలవరం సముద్ర తీరం వద్ద జరిగే జాతరకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. మాఘ పౌర్ణమి నాడు ఇక్కడ సముద్రతీరంలో పుణ్యస్నానం ఆచరించడానికి వేలాది మంది భక్తులు వస్తుంటారు. అనంతరం సముద్ర తీరం పక్కనే కొండపై ఉన్న లక్ష్మీ మాధవ స్వామిని దర్శించుకుంటారు. బుధవారం మాఘ పౌర్ణమి కావడంతో ముందు రోజు రాత్రి ప్రారంభం కానున్న జాతరకు పలు ప్రాంతాల నుంచి సుమారు 70 వేల మంది భక్తులు తరలివస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తులకు తాగునీటి సదుపాయం, మెడికల్ క్యాంపు, సముద్రంలో స్నానం చేసిన తరువాత మహిళలు దుస్తులు మార్చుకోవడానికి తాత్కాలిక గుడారాలను ఏర్పాటు చేస్తున్నారు. వాహనాలను రేవుపోలవరానికి సమారు కిలో మీటరు దూరంలోనే నిలుపుదల చేస్తారు. నర్సీపట్నం ఆర్టీసీ డిపో అధికారులు ప్రత్యేక బస్సులు నడపనున్నారు. కాగా రేవుపోలవరం జాతర సందర్భంగా నలుగురు సీఐలు, 15 మంది ఎస్ఐలు, 210 మంది పోలీసులతో భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్టు నక్కపల్లి సీఐ రామకృష్ణ తెలిపారు. సముద్ర తీరంలో గజ ఈతగాళ్లను అందుబాటులో వుంచుతున్నామన్నారు. భక్తులకు తాగునీటి కోసం 400 బస్తాల వాటర్ప్యాకెట్లను సిద్ధం చేసినట్టు ఆర్డబ్యూఎస్ ఏఈ కల్యాణ్ చెప్పారు.