చోద్యం హైస్కూల్లో కీచక పీఈటీ
ABN , Publish Date - Feb 15 , 2025 | 12:49 AM
గొలుగొండ మండలం చోద్యంలోని జడ్పీ ఉన్నత పాఠశాల బాలికలపట్ల కాంట్రాక్టు వ్యాయామ ఉపాధ్యాయుడు (పీఈటీ) అసభ్యకరంగా ప్రవర్తించాడు. సుమారు రెండు వారాల క్రితం జరిగిన ఈ సంఘటన గురించి శుక్రవారం ఉదయం సోషల్ మీడియాలో రావడంతో విద్యా శాఖ అధికారులు స్పందించారు. డీఈవో ఆదేశాల మేరకు ఎంఈవోలు చోద్యం పాఠశాలకు వెళ్లి విచారణ జరిపారు. వ్యాయామ ఉపాధ్యాయుడుపై తదుపరి చర్యల నిమిత్తం నివేదికను డీఈవోకు పంపారు. ఇందుకు సంబంధించి ఎంఈవోలు తెలిపిన వివరాలిలా వున్నాయి.

చెన్నైలో ఆటల పోటీలకు వెళ్లినప్పుడు బాలికల పట్ల అభ్యకర ప్రవర్తన
పక్షం రోజుల క్రితం ఘటన
సోషల్ మీడియా ద్వారా ఆలస్యంగా వెలుగులోకి
స్పందించిన విద్యా శాఖ అధికారులు
పాఠశాలలో ఎంఈవోలు విచారణ
బాలికల నుంచి వాంగ్మూలం నమోదు
పీఈటీపై తదుపరి చర్యల కోసం డీఈవోకు నివేదిక
కృష్ణాదేవిపేట, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి): గొలుగొండ మండలం చోద్యంలోని జడ్పీ ఉన్నత పాఠశాల బాలికలపట్ల కాంట్రాక్టు వ్యాయామ ఉపాధ్యాయుడు (పీఈటీ) అసభ్యకరంగా ప్రవర్తించాడు. సుమారు రెండు వారాల క్రితం జరిగిన ఈ సంఘటన గురించి శుక్రవారం ఉదయం సోషల్ మీడియాలో రావడంతో విద్యా శాఖ అధికారులు స్పందించారు. డీఈవో ఆదేశాల మేరకు ఎంఈవోలు చోద్యం పాఠశాలకు వెళ్లి విచారణ జరిపారు. వ్యాయామ ఉపాధ్యాయుడుపై తదుపరి చర్యల నిమిత్తం నివేదికను డీఈవోకు పంపారు. ఇందుకు సంబంధించి ఎంఈవోలు తెలిపిన వివరాలిలా వున్నాయి.
జనవరి 31వ తేదీ నుంచి ఫిబ్రవరి 3వ తేదీ వరకు తమిళనాడులోని చెన్నైలో జరిగిన జాతీయస్ధాయి లంగడీ ఆటల పోటీలకు పీఈటీ కుందూరు నూకరాజు ఆధ్వర్యంలో 11 మంది (ఆరుగురు బాలికలు, ఐదుగురు బాలురు) విద్యార్థులు హాజరయ్యారు. సుదూర ప్రాంతంలో జరిగే ఆటల పోటీలకు బాలికలు వెళుతున్నప్పటికీ హెచ్ఎం శ్రీనివాసరావు ఒక్క మహిళా టీచర్ను కూడా వారి వెంట పంపలేదు. కాగా ఆటల పోటీలకు వెళ్లిన సమయంలో పీఈటీ నూకరాజు, కొంతమంది బాలికలపట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. కానీ ఈ విషయం బయటకు పొక్కలేదు. అయితే శుక్రవారం ఓ వ్యక్తి ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఇది వైరల్గా మారడంతో జిల్లా విద్యా శాఖ అధికారులు స్పందించారు. డీఈవో ఆదేశాల మేరకు ఎంఈవో-1 ఒ.సత్యనారాయణ, ఎంఈవో-2 మూర్తి, ఇతర అధికారులు చోద్యం పాఠశాలకు వెళ్లి విచారణ చేపట్టారు. క్రీడా పోటీలకు వెళ్లి వచ్చిన బాలికలతో విడివిడిగా మాట్లాడి వివరాలు సేకరించారు. అంతేకాక వారి నుంచి లిఖితపూర్వంగా వాంగ్మూలం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎంఈవో సత్యనారాయణ మాట్లాడుతూ, పీఈటీ తమపట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడని ఆరుగురు బాలికలు ఫిర్యాదు చేశారని చెప్పారు. విచారణ నివేదికను డీఈవో అప్పారావునాయుడుకు పంపుతున్నామని, పీఈటీపై తగు చర్యలు తీసుకుంటారని ఆయన చెప్పారు.