జీవీఎంసీ కమిషనర్ పి.సంపత్కుమార్ బదిలీ
ABN , Publish Date - Jan 21 , 2025 | 12:57 AM
గ్రేటర్ విశాఖ మునిసిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) కమిషనర్ పి.సంపత్కుమార్ను ప్రభుత్వం బదిలీ చేసింది.
మునిసిపల్ అడ్మినిస్ర్టేషన్ డైరెక్టర్గా పోస్టింగ్
నగర కమిషనర్గా ఇంకా ఎవరినీ నియమించని ప్రభుత్వం
విశాఖపట్నం, జనవరి 20 (ఆంధ్రజ్యోతి):
గ్రేటర్ విశాఖ మునిసిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) కమిషనర్ పి.సంపత్కుమార్ను ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయన్ను మునిసిపల్ అడ్మినిస్ర్టేషన్ డైరెక్టర్ (సీడీఎంఏ)గా నియమిస్తూ ఉత్తర్వులుజారీచేసింది. రాష్ట్రవ్యాప్తంగా 25 మంది ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం శనివారం బదిలీ చేసింది. 2019 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన సంపత్కుమార్ గత ఏడాది జూలై 20న జీవీఎంసీ కమిషనర్గా బాధ్యతలు చేపట్టారు. వివాద రహిత అధికారిగా సంపత్కుమార్ గుర్తింపుపొందారు. నగరంలో వీధి దీపాల సమస్య పరిష్కారంతోపాటు కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపులో అవినీతి జరగకుండా చర్యలు చేపట్టారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్కు అడ్డుకట్ట వేసేందుకు వీలుగా కార్యాచరణ రూపొందించారు. అయితే ఆరు నెలలు కూడా పూర్తికాకుండానే సంపత్కుమార్ను బదిలీ చేయడం చర్చనీయాంశంగా మారింది. సంపత్కుమార్ను బదిలీ చేసిన ప్రభుత్వం ఆయన స్థానంలో ఇంకా ఎవరినీ నియమించకలేదు.
--------------------------------------------------------------------------------
నేడు బీజేపీ జిల్లా అధ్యక్షుడి ప్రకటన
పోటీలో నలుగురు...పరుశురామరాజు, విజయానంద్రెడ్డి, కరణం నరసింగరావు, ఒమ్మి సుజాత
విశాఖపట్నం, జనవరి 20 (ఆంధ్రజ్యోతి):
భారతీయ జనతా పార్టీ విశాఖ జిల్లా నూతన అధ్యక్షుడిని మంగళవారం ప్రకటించనుంది. ఇటీవల విశాఖలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో పలువురి పేర్లను పరిశీలించారు. ఈ పదవికి నలుగురు పోటీ పడుతున్నారు. జిల్లా అధ్యక్ష పదవిని పరుశురామరాజు, విజయానంద్ రెడ్డి, కరణం నరసింగరావు, మహిళా మోర్చా నాయకురాలు ఒమ్మి సుజాత ఆశిస్తున్నారు. వీరిలో ఒకరిని ఎంపిక చేసి మంగళవారం ప్రకటిస్తారు. ప్రస్తుతం బీజేపీ విశాఖ పార్లమెంటు నియోజకవర్గం అధ్యక్షునిగా మేడపాటి రవీంద్రవ్యవహరిస్తున్నారు. ఆయన ఈ పదవిలో ఐదేళ్లుగా కొనసాగుతున్నారు. జిల్లాల పునర్విభజన తరువాత పార్లమెంటును జిల్లాగా తీసుకొని అధ్యక్షులను నియమించారు. రవీంద్రను రెండోసారి కూడా కొనసాగించారు. ఇప్పుడు విశాఖ పార్లమెంటు నియోజకవర్గంలోని ఎస్.కోట నియోజకవర్గాన్ని బీజేపీ విజయనగరం జిల్లాలో కలిపివేసింది. విశాఖ తూర్పు, ఉత్తరం, పశ్చిమ, దక్షిణ, గాజువాక, భీమిలి నియోజకవర్గాలను జిల్లాగా పరిగణించి దానికి అధ్యక్షుడిని నియమిస్తోంది.
రేపటి నుంచి జేఈఈ మెయిన్స్ పరీక్షలు
నగరంలో ఐదు కేంద్రాలు, 6,000 మంది విద్యార్థులు
విశాఖపట్నం, జనవరి 20 (ఆంధ్రజ్యోతి):
దేశంలోని ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించే జేఈఈ మెయిన్స్ పరీక్షలు బుధవారం నుంచి 24వ తేదీ, తిరిగి 28 నుంచి 30వ తేదీ వరకూ జరగనున్నాయి. ఇందుకోసం నగరంలో ఐదు కేంద్రాలు ఏర్పాటుచేశారు. చినముషిడివాడలోని ఐయాన్ డిజిటల్ 1,2, జియో టెక్నాలజీ సెంటర్, షీలానగర్లోని ఐయాన్ డిజిటల్, ఆనందపురం మండలంలోని ఎన్ఎస్ఆర్ఐటీలో ప్రతి రోజు ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం 12, తిరిగి మూడు నుంచి సాయంత్రం ఆరు గంటల వరకూ పరీక్షలు జరుగుతాయి. సుమారు ఆరు వేల మంది ఈ పరీక్షలు రాయనున్నారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఎ) ఏటా రెండు దఫాలు (సెషన్స్) ఈ మెయిన్స్ నిర్వహిస్తుంది. రెండో సెషన్ ఏప్రిల్ తొలి వారంలో జరుగుతాయి.
భీమిలి డీఎల్డీవోగా హరిప్రసాద్
విశాఖపట్నం, జనవరి 20 (ఆంధ్రజ్యోతి):
గత ప్రభుత్వంలో ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్ వద్ద ఓఎస్డీగా పనిచేసిన కె.హరిప్రసాద్ను కీలకమైన భీమిలి డివిజన్ స్థాయి డెవలప్మెంట్ అధికారి (డీఎల్డీవో)గా నియమించారు. విశాఖ పరిసరాల్లో పోస్టింగ్ దక్కాలంటే పలుకుబడి ఉండాలి. అటువంటిది గత ప్రభుత్వంలో మంత్రి వద్ద పనిచేసిన అధికారి నగరానికి ఆనుకుని ఉన్న భీమిలి డీఎల్డీవోగా నియమితులు కావడం చర్చనీయాంశమైంది. ఇక విశాఖపట్నం డ్వామాలో అడిషనల్ పీడీగా ఉన్న ఎం.రోజారాణిని విజయనగరం డీఎల్డీవోగా నియమించారు. ఈ మేరకు శనివారం ఉత్తర్వులు జారీచేశారు.