పదింతల ఫలితాలకు కసరత్తు
ABN , Publish Date - Jan 09 , 2025 | 11:45 PM
ఈ విద్యా సంవత్సరంలో పదో తరగతిలో శత శాతం ఉత్తీర్ణత లక్ష్యంగా గిరిజన సంక్షేమ విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా పదో తరగతి విద్యార్థుల కోసం ఈ నెల ఒకటో తేదీ నుంచి 66 రోజుల పాటు ప్రత్యేక ప్రణాళికను అమలు చేస్తోంది.
ఆశ్రమాల్లో 66 రోజుల ప్రత్యేక ప్రణాళిక
మార్చి 7 వరకు అమలు
సబ్జక్టు టీచర్లు, ఉపాధ్యాయుల ప్రత్యేక శ్రద్ధ
టీడబ్ల్యూ డీడీ, ఏటీడబ్ల్యూలు నిత్యం పర్యవేక్షణ
(పాడేరు- ఆంధ్రజ్యోతి)
ఈ విద్యా సంవత్సరంలో పదో తరగతిలో శత శాతం ఉత్తీర్ణత లక్ష్యంగా గిరిజన సంక్షేమ విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా పదో తరగతి విద్యార్థుల కోసం ఈ నెల ఒకటో తేదీ నుంచి 66 రోజుల పాటు ప్రత్యేక ప్రణాళికను అమలు చేస్తోంది.
ఏజెన్సీ వ్యాప్తంగా ఉన్న 121 ఆశ్రమాలు, ఎనిమిది గురుకులాల్లో సుమారు ఆరు వేల మంది టెన్త్ విద్యార్థులున్నారు. గత ఏడాది 92 శాతం ఉత్తీర్ణత సాధించగా, ఈ ఏడాది శత శాతం ఉత్తీర్ణత లక్ష్యంగా సబ్జక్టు టీచర్లు, ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టిసారిస్తున్నారు. దీంతో విద్యార్థులకు ప్రతి రోజు పరీక్షలు, ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నారు.
66 రోజుల ప్రత్యేక ప్రణాళిక ఇలా..
- జనవరి ఒకటో తేదీ నుంచి సబ్జక్టుల రివిజన్, ప్రతి రోజు ఉదయం, సాయంత్రం వేళల్లో డైలీటెస్ట్ల నిర్వహణ.
- ప్రతి రోజు ఆయా సబ్జక్టులకు సంబంధించి ప్రత్యేకమైన నోట్స్ను రాయించడం.
- డైలీ టెస్ట్లను ఏ రోజుకారోజు మూల్యాంకనం చేసి విద్యార్థుల ప్రగతిని అదే రోజు అందరికీ తెలియజేయడం, వెనుకబాటునకు గురైన విద్యార్థులను గుర్తించి, వారిపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచి, వారి ఉత్తీర్ణతకు అవసరమైన మార్కులు వచ్చేలా ఆయా అంశాలపై తర్ఫీదు ఇవ్వడం. అలాగే విద్యార్థులపై సబ్జక్టు టీచర్లు ప్రత్యేక దృష్టిపెట్టి పరీక్షల సమయానికి వారి పఠనా స్థాయిని పెంచడం.
- డైలీటెస్ట్ల ఆధారంగా విద్యార్థుల ప్రగతిని ఏ, బీ, సీ, డీలుగా విభజించి, డీ గ్రేడులో ఉన్న వారికి సహచర విద్యార్థులతోనే ఆయా సబ్జక్టుల్లో సందేహాలను నివృత్తి చేసి, వారిని బీ, సీ గ్రేడుల్లోకి తీసుకువచ్చేందుకు కృషి చేయడం.
- వార్షిక పరీక్షలపై విద్యార్థులకు భయం పోగొట్టడంతోపాటు డైలీ టెస్ట్ల ద్వారా వారిలో ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించడం.
- 66 రోజుల ప్రత్యేక ప్రణాళిక సమయంలో విద్యార్థులు గైర్హాజరు కాకుండా చూడడంతోపాటు, వారిపై ఉపాధ్యాయులు, అధికారుల నిత్యం పర్యవేక్షణ ఉంటుంది.