Share News

డోలీ కష్టాలు తీరవా!

ABN , Publish Date - Feb 21 , 2025 | 01:11 AM

ఏజెన్సీలో కోట్లాది రూపాయలు వెచ్చించి రోడ్లు నిర్మిస్తున్నట్టు పాలకులు చెబుతున్నప్పటికీ.. మారుమూల గ్రామాల ఆదివాసీలకు డోలీ మోతల ఇక్కట్లు తొలగడంలేదు. గర్భిణులు, తీవ్రఅనారోగ్యానికి గురైన వారిని ఆస్పత్రికి తీసుకెళ్లాలంటే డోలీ కట్టక తప్పని పరిస్థితి ఏర్పడుతున్నది.

డోలీ కష్టాలు తీరవా!
గర్భిణి కొర్రా శాంతిని డోలిలో మోసుకొస్తున్న కుటుంబ సభ్యులు

జాజులబంధలో గర్భిణికి పురిటి నొప్పులు

గ్రామానికి రోడ్డు లేకపోవడంతో డోలీ కట్టిన కుటుంబ సభ్యులు

ఆరు కిలోమీటర్లు మోసుకుంటూ ఆస్పత్రికి తరలింపు

కొయ్యూరు, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి): ఏజెన్సీలో కోట్లాది రూపాయలు వెచ్చించి రోడ్లు నిర్మిస్తున్నట్టు పాలకులు చెబుతున్నప్పటికీ.. మారుమూల గ్రామాల ఆదివాసీలకు డోలీ మోతల ఇక్కట్లు తొలగడంలేదు. గర్భిణులు, తీవ్రఅనారోగ్యానికి గురైన వారిని ఆస్పత్రికి తీసుకెళ్లాలంటే డోలీ కట్టక తప్పని పరిస్థితి ఏర్పడుతున్నది. మండలంలోని మూలపేట పంచాయతీ జాజులబంధ గ్రామానికి చెందిన నిండు గర్భిణి కొర్ర శాంతికి గురువారంం ఉదయంం పురిటినొప్పులు మొదలయ్యాయి. గ్రామానికి రహదారి సదుపాయం లేకపోవడంతో అంబులెన్స్‌ వచ్చే పరిస్థితి లేదు. కుటుంబ సభ్యులు డోలి కట్టి, ఆరు కిలోమీటర్ల దూరంలోని పిత్రిగెడ్డ వరకు మోసుకొచ్చారు. అక్కడ నుంచి అంబులెన్సులో డౌనూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అనంతరం వైద్యులు సాధారణ ప్రసవం చేయడంతో మగబిడ్డకు జన్మనిచ్చింది. బాలింత, శిశువు ఆరోగ్యంగానే వున్నారని వైద్యులు తెలిపారు. ఈ సందర్భంగా జాజులబంద గిరిజనులు విలేకరులతో మాట్లాడుతూ, తమ గ్రామానికి రహదారి నిర్మాణం కోసం 2023లో ఐటీడీఏ అధికారులు ఉపాధి హామీ పథకం కింద రూ.కోటి మంజూరు చేశారన్నారు. రూ.28 లక్షలు వెచ్చించి నాలుగు కల్వర్టులు నిర్మించి వదిలేశారని, రహదారిని ఇంతవరకు పూర్తి చేయలేదన్నారు. రహదారి నిర్మించి వుంటే తమకు డోలీ కష్టాలు వుండేవి కావని చెప్పారు.

Updated Date - Feb 21 , 2025 | 01:11 AM