ఓటు ప్రాముఖ్యతపై అవగాహన అవసరం
ABN , Publish Date - Jan 25 , 2025 | 11:10 PM
ప్రజాస్వామ్యంలో ఓటుహక్కు ప్రాముఖ్యతపై పౌరులకు అవగాహన ఉండాలని జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎంజేఅభిషేక్గౌడ అన్నారు.

జాయింట్ కలెక్టర్ డాక్టర ఎంజే.అభిషేక్ గౌడ
అంబేడ్కర్ కూడలిలో మానవహారం
పాడేరు, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): ప్రజాస్వామ్యంలో ఓటుహక్కు ప్రాముఖ్యతపై పౌరులకు అవగాహన ఉండాలని జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎంజేఅభిషేక్గౌడ అన్నారు. 15వ జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా శనివారం ఓటుహక్కుపై అవగాహన ర్యాలీని, అంబేడ్కర్ కూడలి వద్ద మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ అభిషేక్గౌడ్ మాట్లాడుతూ.. ఓటు హక్కు ఎంతో విలువైనదని, దాని గురించి ప్రతి ఒక్కరూ అవగాహన ఏర్పరచుకోవాలన్నారు. అలాగే 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు. గత ఎన్నికల్లో 70 శాతం మంది ఓటుహక్కును వినియోగించుకున్నారన్నారు. ఐటీడీఏ పీవో వి.అభిషేక్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యానికి పునాది ఓటు హక్కు అని అన్నారు. గత 15 సంవత్సరాల కృషికి ఫలితంగా 2024 ఎన్నికలలో చక్కని ఓటు వినియోగం కనపడిందన్నారు. అలాగే ఏజెన్సీలోని 20 వేల మంది ఆదిమ జాతి గిరిజనులు ఓటర్లుగా నమోదు చేయడం జరిగిందని, మారుమూల గ్రామాలైన గిన్నెలకోట, ఇంజరి, జామిగుడ గ్రామాల్లో ఓటుహక్కును సద్వినియోగం చేసుకున్నారు. సంక్రాంతి పండుగలా జాతీయ ఓటరు దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం నిర్వహించుకుంటున్నామన్నారు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ శౌర్యమన్ పటేల్, జిల్లా రెవెన్యూ అధికారి కె.పద్మలత, జీసీసీ డైరెక్టర్ బొర్రా నాగరాజు, రెడ్క్రాస్ సొసైటీ జిల్లా కార్యదర్శి జి.గౌరీశంకరావు, స్థానిక తహసీల్దార్ వి.త్రినాఽథరావునాయుడు, కలెక్టరేట్ సూపరింటెండెంట్ తిరుమలరావు, ఉద్యోగులు, విద్యార్థులు పాల్గొన్నారు.