మళ్లీ పెరిగిన కాఫీ ధరలు
ABN , Publish Date - Jan 06 , 2025 | 11:49 PM
కాఫీ గింజలకు మళ్లీ ధరలు పెరిగాయని పాడేరు కేంద్ర కాఫీ బోర్డు సీనియర్ లైజనింగ్ అధికారి ఎస్.రమేశ్ తెలిపారు.

కిలో పార్చిమెంట్ రూ.452, చెర్రీ రూ.260
కేంద్ర కాఫీ బోర్డు ఎస్ఎల్వో రమేశ్
చింతపల్లి, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): కాఫీ గింజలకు మళ్లీ ధరలు పెరిగాయని పాడేరు కేంద్ర కాఫీ బోర్డు సీనియర్ లైజనింగ్ అధికారి ఎస్.రమేశ్ తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ ఏడాది కాఫీ ఉత్పత్తి దిగ్గజాలైన బ్రెజిల్, వియత్నం దేశాల్లో దిగుబడులు భారీగా పతనం కావడంతో దేశ మార్కెట్లో కాఫీకి డిమాండ్ పెరిగిందన్నారు. ఈ ఏడాది అంతర్జాతీయ మార్కెట్లో రికార్డు స్థాయిలో ధరలు పెరిగాయన్నారు. వారం రోజుల క్రితం కర్ణాటక ఇండియన్ కాఫీ ట్రేడింగ్ అసోసియేషన్(ఐసీటీఏ)లో అరబికా పార్చిమెంట్ కిలో రూ.440, చెర్రీ(గుళ్ల) రూ.240 ధర ఉండగా, సోమవారం నాటికి అరబికా పార్చిమెంట్ కిలో రూ.452-460, చెర్రీ కిలో రూ.260-264 ధర లభించిందన్నారు. అలాగే రొబస్ట్రా పార్చిమెంట్ కిలో రూ.376-388, చెర్రీ రూ.218-220 ధర లభిస్తుందన్నారు. కాఫీ ధరలు భారీగా పెరగడంతో గిరిజన రైతులు కాఫీ గింజలను తక్కువ ధరకు విక్రయించుకుని నష్టపోరాదన్నారు. తాజా కాఫీ ధరల కోసం కాఫీ కృషి తరంగా ఉచిత కాల్ సెంటర్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.