సీఎం చంద్రబాబు ప్రకటనపై అఖిల పక్షం హర్షం
ABN , Publish Date - Feb 12 , 2025 | 11:16 PM
గిరిజనులకు సంబంధించిన చట్టాలను మరింత పటిష్ఠంగా అమలు చేస్తామని, కూటమి ప్రభుత్వానికి 1/70 చట్టాన్ని సవరించాలనే ఆలోచన లేదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, గిరిజన సంక్షేమ శాఖా మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రకటించడంపై అఖిల పక్షం తరఫున ఏపీ ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిల్లో సురేంద్ర, జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాలదేవ్ హర్షం వ్యక్తం చేశారు.

1/70 చట్టాన్ని సవరించాలనే ఆలోచన లేదని వెల్లడించడంపై ఆనందం
గిరిజన ప్రాంతంలో శత శాతం ఉద్యోగాలు గిరిజనులతోనే భర్తీ చేయాలని డిమాండ్
అరకులోయ, ఫిబ్రవరి 12(ఆంధ్రజ్యోతి): గిరిజనులకు సంబంధించిన చట్టాలను మరింత పటిష్ఠంగా అమలు చేస్తామని, కూటమి ప్రభుత్వానికి 1/70 చట్టాన్ని సవరించాలనే ఆలోచన లేదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, గిరిజన సంక్షేమ శాఖా మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రకటించడంపై అఖిల పక్షం తరఫున ఏపీ ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిల్లో సురేంద్ర, జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాలదేవ్ హర్షం వ్యక్తం చేశారు. గిరిజన సంఘం కార్యాలయంలో బుధవారం వారు విలేకరులతో మాట్లాడుతూ బంద్కు సహకరించిన ఆదివాసీలకు, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, కర్షకులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. భూ బదలాయింపు చటాన్ని మరింత పటిష్ఠంగా అమలు చేయాలని, గిరిజన ప్రాంతంలో శత శాతం ఉద్యోగాలు గిరిజనులతోనే భర్తీ చేయాలన్నారు. ఈ మేరకు రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో చట్టం చేసి అమల్లోకి తేవాలన్నారు. ఆదివాసీ స్పెషల్ డీఎస్సీ ప్రకటించాలని, అనంతగిరి మండలం గుజ్జల, చిట్టింపాడు హైడ్రో ప్రాజెక్టులను రద్దు చేయాలన్నారు. గిరిజన ప్రాంతంలో కాఫీ, మిరియాలు, చింతపండు, అడ్డాకులు, ఇతర అటవీ, వ్యవసాయోత్పత్తుల ఆధారిత పరిశ్రమలను ఏర్పాటు చేసి గిరిజన యువతకు ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పించాలన్నారు. ఈ సమావేశంలో దండకారణ్య విమోచన సమితి జిల్లా ఉపాధ్యక్షుడు ప్రసన్నకుమార్, పెసా కమిటీ ఉపాధ్యక్షుడు ఎం.రమేశ్, ఆదివాసీ గిరిజన సంఘం ప్రతినిధులు పి.రామన్న, కె.రామారావు పాల్గొన్నారు.