సుజల స్రవంతి ప్రాజెక్టు కాలువకు 1,850 ఎకరాలు సేకరణ
ABN , Publish Date - Feb 02 , 2025 | 12:17 AM
పోలవరం ప్రాజెక్టు నుంచి భూదేవి చెరువు వద్ద నిర్మించనున్న బాబూ జగ్జీవన్రామ్ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు నీటిని తరలించేందుకు అవసరమైన కాలువను తవ్వేందుకు అనకాపల్లి జిల్లాలోని మూడు మండలాల్లో గల 22 గ్రామాల్లో 1,850 ఎకరాల భూమిని సేకరించామని ప్రాజెక్టు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కొయ్య రమామణి తెలిపారు.
జిల్లాలో 22 గ్రామాల గుండా కాలువ నిర్మాణం
పరిహారం నిధులు విడుదలకాగానే పనులు ప్రారంభం
ప్రాజెక్టు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రమామణి
సబ్బవరం, ఫిబ్రవరి 1(ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు నుంచి భూదేవి చెరువు వద్ద నిర్మించనున్న బాబూ జగ్జీవన్రామ్ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు నీటిని తరలించేందుకు అవసరమైన కాలువను తవ్వేందుకు అనకాపల్లి జిల్లాలోని మూడు మండలాల్లో గల 22 గ్రామాల్లో 1,850 ఎకరాల భూమిని సేకరించామని ప్రాజెక్టు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కొయ్య రమామణి తెలిపారు. శనివారం స్థానిక విలేకరులతో ఆమె మాట్లాడుతూ జిల్లాలో కశింకోట మండలంలో మూడు గ్రామాలు, అనకాపల్లి మండలంలో 9 గ్రామాలు, సబ్బవరం మండలంలో 9 గ్రామాల్లో రైతుల నుంచి భూమిని సేకరించామన్నారు. అధికారులు సేకరించిన భూమిలో 1200 ఎకరాలు జిరాయితీ, 650 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉందన్నారు. మండలంలో వంగలి గ్రామ రైతులు(సుమారు 45 ఎకరాలు) పరిహారం విషయంలో సుముఖంగా లేకపోవడంతో ఆ గ్రామాన్ని మినహాయించి 21 గ్రామాలకు సంబంధించి ప్రిలిమినరీ నోటిఫికేషన్(పీఎన్), డ్రాఫ్ట్ డిక్లరేషన్(డీడీ) పబ్లిష్ చేశామన్నారు. మండలంలోని అంతకాపల్లి గ్రామంలో తమకు ఇచ్చిన సర్వే నంబర్లు అన్నీ జిరాయితీ అని ఉందని, రికార్డుల ప్రకారం సుమారు 30 ఎకరాలకు గాను రైతులకు సుమారు రూ.1000 కోట్లు పరిహారం చెల్లించాల్సి ఉంటుందన్నారు. ప్రభుత్వం రూ.500 కోట్లు డిపాజిట్ చేస్తే రైతులకు చెల్లించి, కాలువ నిర్మాణ పనులు ప్రారంభిస్తామని చెప్పారు. ఈ సమావేశంలో తహసీల్దార్ బి.చిన్నికృష్ణ పాల్గొన్నారు.