AP Police: హెలీప్యాడ్ కేసులో నేడు విచారణకు తోపుదుర్తి
ABN , Publish Date - May 11 , 2025 | 06:02 AM
హెలీప్యాడ్ కేసులో ప్రధాన నిందితుడు, వైసీపీ నేత తోపుదుర్తి ప్రకాశ్రెడ్డి విచారణకు హాజరుకానున్నారు. ఈ కేసులో మొత్తం 21 మంది వైసీపీ నాయకులను పోలీసులు విచారించారు.
ధర్మవరం/చెన్నేకొత్తపల్లి, మే 10(ఆంధ్రజ్యోతి): కుంటిమద్ది హెలీప్యాడ్ కేసులో ప్రధాన నిందితుడు, వైసీపీ నేత, శ్రీసత్యసాయి జిల్లా రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్రెడ్డి ఆదివారం విచారణకు హాజరవుతున్నారు. విచారణ అధికారి, రామగిరి సీఐ శ్రీధర్కు ఈ మేరకు సమాచారం అందించారు. వైసీపీ అధినేత జగన్ పర్యటన నేపథ్యంలో గత నెల 8న కుంటిమద్ది హెలిప్యాడ్ వద్ద బారికేడ్లను తోసేసి హెలికాప్టర్ను చుట్టుముట్టడం, పోలీసులను తోసేయడం వంటివి జరిగాయి. ఈ వ్యవహారంలో ప్రకాశ్ రెడ్డితోపాటు వంద మందికి పైగా వైసీపీ నేతలపై పోలీసులు గత నెల 10న కేసు నమోదు చేశారు. అరెస్టు భయంతో అజ్ఞాతంలోకి వెళ్లిన తోపుదుర్తి, ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్ను విచారించిన హైకోర్టు.. తోపుదుర్తికి నోటీసులు ఇవ్వాలని, విచారణకు సహకరించకుంటే చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకోవచ్చని ఈ నెల 5న సూచించింది. ఈ క్రమంలో విచారణకు రావాలని ఈ నెల 6న తోపుదుర్తికి పోలీసులు నోటీసులు పంపారు. ఈ క్రమంలో ప్రకాశ్రెడ్డి.. ఈ నెల 7న జిల్లాకు వచ్చారు. దీంతో చెన్నేకొత్తపల్లి ఎస్ఐ సత్యనారాయణ అనంతపురంలోని తోపుదుర్తి ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చారు. ఈ నెల 12లోగా రామగిరి సర్కిల్ కార్యాలయానికి విచారణకు రావాలని నోటీసులో పేర్కొన్నారు. స్పందించిన తోపుదుర్తి, 11న విచారణకు హాజరవుతానని సమాచారం ఇచ్చారు. ఎలాంటి హంగు, ఆర్భాటం లేకుండా ఒక వాహనంలోనే రావాలని ఆయనకు సూచించినట్టు సమాచారం. కాగా, ఇదే కేసులో ఆత్మకూరు మండలంలోని 21 మంది వైసీపీ నాయకులను పోలీసులు శనివారం విచారించారు.