Suspension: ముగ్గురు ఐపీఎ్సల సస్పెన్షన్ 6 నెలలు పొడిగింపు
ABN , Publish Date - Mar 13 , 2025 | 03:45 AM
సినీనటి కాదంబరి జెత్వానీని అక్రమంగా బంధించి, తప్పుడు కేసుతో వేధించిన వ్యవహారంలో నిఘా విభాగం మాజీ అధిపతి పీఎ్సఆర్ ఆంజనేయులు, విజయవాడ మాజీ పోలీస్ కమిషనర్ కాంతిరాణా తాతా, మాజీ డీసీపీ విశాల్ గున్నీ సస్పెన్షన్ను ప్రభుత్వం మరో ఆరు నెలలు పొడిగించింది.

ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్ విజయానంద్
నటి జెత్వానీ కేసులో పీఎ్సఆర్, కాంతిరాణా, విశాల్ గున్నీపై వేటు
అమరావతి, మార్చి 12(ఆంధ్రజ్యోతి): సినీనటి కాదంబరి జెత్వానీని అక్రమంగా బంధించి, తప్పుడు కేసుతో వేధించిన వ్యవహారంలో నిఘా విభాగం మాజీ అధిపతి పీఎ్సఆర్ ఆంజనేయులు, విజయవాడ మాజీ పోలీస్ కమిషనర్ కాంతిరాణా తాతా, మాజీ డీసీపీ విశాల్ గున్నీ సస్పెన్షన్ను ప్రభుత్వం మరో ఆరు నెలలు పొడిగించింది. గత వైసీపీ ప్రభుత్వంలో జెత్వానీపై ఇబ్రహీంపట్నంలో తప్పుడు కేసు పెట్టించారు. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ కాకముందే విమానంలో ముంబై వెళ్లిన విశాల్ గున్నీ బృందం ఆమెను బలవంతంగా విజయవాడకు తీసుకొచ్చారు. వైసీపీ నాయకుడు కుక్కల విద్యాసాగర్కు చెందిన భూమిని ఫోర్జరీ పత్రాలతో విక్రయించేందుకు ప్రయత్నించారంటూ ఆమెపై తప్పుడు కేసు నమోదు చేసి వేధింపులకు గురిచేశారు.
జెత్వానీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన విజయవాడ పోలీసులు చేపట్టిన దర్యాప్తులో ఈ ముగ్గురు అధికారుల పాత్రపై ప్రాథమిక ఆధారాలు లభించాయి. అఖిల భారత సర్వీసు నిబంధనలు ఉల్లంఘించారన్న అభియోగాలపై గత ఏడాది సెప్టెంబరు 15న ప్రభుత్వం వారిని సస్పెండ్ చేసింది. కేసు దర్యాప్తు పూర్తికానందున మరిన్ని ఆధారాలు సేకరించే క్రమంలో మరికొన్ని రోజులు వీరిని సస్పెన్షన్లో ఉంచాలని ఈ నెల 6న ప్రభుత్వానికి డీజీపీ ప్రతిపాదన పంపారు. దీంతో సస్పెన్షన్ను పొడిగిస్తూ సీఎస్ విజయానంద్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.