Supreme Court: డిప్యూటీ కలెక్టర్కు డిమోషన్
ABN , Publish Date - May 10 , 2025 | 04:24 AM
తహసీల్దార్ హోదాలో ఉన్నప్పుడు కోర్టు ఆదేశాలు లెక్కచేయకుండా మురికివాడల గుడిసెలను తొలగించిన డిప్యూటీ కలెక్టర్ తాతా మోహన్రావును తహసీల్దార్గా డిమోషన్ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. జైలు శిక్షను నివారించేందుకు డిమోషన్ను అంగీకరించినందున శిక్షలో దయ చూపించిందని ధర్మాసనం పేర్కొంది

తహసీల్దార్గా పంపించాలని రాష్ట్ర సర్కారుకు సుప్రీం ఆదేశం
కోర్టు ధిక్కరణ కింద చర్యలు
న్యూఢిల్లీ, మే 9(ఆంధ్రజ్యోతి): ఏపీకి చెందిన డిప్యూటీ కలెక్టర్ తాతా మోహన్రావు పదవిని తహసీల్దార్కు తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. తహసీల్దార్ హోదాలో ఉన్నప్పుడు గుంటూరు జిల్లాలో మురికివాడల్లోని గుడిసెలను బలవంతంగా తొలగించడంపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. తహసీల్దార్గా డిమోట్ చేయడంతోపాటు రూ.లక్ష జరిమానా విధించింది. గుంటూరు తహసీల్దార్గా పనిచేసిన మోహన్రావుకు మురికివాడల్లోని గుడిసెలు తొలగించవద్దని 2013 డిసెంబరు 11న హైకోర్టు ఆదేశించింది. ఆయన ఈ ఆదేశాలను ఉల్లంఘించి 2014లో గుడిసెలు తొలగించారు. దీంతో ప్రస్తుతం డిప్యూటీ కలెక్టర్గా ఉన్న మోహన్రావుకు హైకోర్టు.. ‘కోర్టు ధిక్కరణ’ చర్యల కింద 2 నెలల సాధారణ జైలు శిక్ష విధించింది. హైకోర్టు తీర్పును మోహన్రావు ఈ ఏడాది మార్చి 13న సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. గత విచారణ సందర్భంగానే జైలుకెళ్లకుండా ఉండాలంటే, పిటిషనర్ డిమోషన్కు సిద్ధంగా ఉన్నారా? అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. దీనికి మోహన్రావు నిరాకరించడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఈ క్రమంలో మోహన్రావును ఒప్పించేందుకు సమయం కావాలని న్యాయవాది దేవాశిష్ సమయం కోరడంతో ధర్మాసనం అంగీకరించింది. ఈ పిటిషన్పై శుక్రవారం జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ ఏజీ మాసి్హ ధర్మాసనం విచారించింది. పిటిషనర్ తరఫు న్యాయవాది దేవాశిష్ వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్, అతని కుటుంబం మొత్తం రోడ్డున పడతాయని తెలిపారు. పిటిషనర్కు 11వ, 12వ తరగతి చదువుతున్న పిల్లలు ఉన్నారని, వారి విద్య మధ్యలో ఆగిపోయే ప్రమాదముందని పేర్కొన్నారు. ‘మురికివాడల్లో జీవిస్తున్నవారి నిర్మాణాలను కూల్చివేసి, వారి వస్తువులతో పాటు వారిని రోడ్డుపై పడేసినప్పుడు ఇవన్నీ గుర్తుకు రాలేదా?’’ అని ఈ సందర్భంగా ధర్మాసనం ప్రశ్నించింది. పిటిషనర్ ఎలాంటి క్షమకు అర్హులు కానప్పటికీ, అతని కుటుంబాన్ని బాధపెట్టకూడదని భావిస్తున్నామని జస్టిస్ గవాయ్ వ్యాఖ్యానించారు. డిప్యూటీ కలెక్టర్ 2 నెలల జైలు శిక్ష అనుభవిస్తే, ఉద్యోగాన్ని కోల్పోవాల్సి ఉంటుందన్నారు. అందువల్ల శిక్షలో దయ చూపిస్తున్నామని ధర్మాసనం పేర్కొంది.