Supreme Court: నాటి ఇసుక అక్రమాలపై చర్యలు తీసుకుంటున్నాం
ABN , Publish Date - May 10 , 2025 | 04:32 AM
జగన్ హయాంలో జరిగిన ఇసుక అక్రమ తవ్వకాలపై చర్యలు తీసుకుంటున్నట్టు ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. తుది నివేదిక సమర్పణకు ఇంకొంత సమయం కావాలని అభ్యర్థించగా, కోర్టు విచారణను ఆగస్టు 1కి వాయిదా వేసింది

తుది నివేదికకు ఇంకాస్త సమయమివ్వండి.. ఏపీ వినతికి సుప్రీం సమ్మతి
న్యూఢిల్లీ, మే 9 (ఆంధ్రజ్యోతి): జగన్ హయాంలో జరిగిన ఇసుక అక్రమ తవ్వకాలపై చర్యలు కొనసాగుతున్నాయని సుప్రీంకోర్టుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. తుది నివేదిక అందజేయడానికి మరికాస్త సమయం కావాలని విజ్ఞప్తి చేసింది. గత ప్రభుత్వంలో ఇసుక అక్రమ తవ్వకాలకు సంబంధించి జేపీ వెంచర్స్కు వ్యతిరేకంగా జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ) తీర్పు ఇచ్చింది. ఆ సంస్థకు దాదాపు రూ.18 కోట్ల జరిమానా విధించింది. ఈ తీర్పును జేపీ వెంచర్స్ 2023 మే 15న సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. గత విచారణ సందర్భంగా.. మరోసారి సమగ్ర నివేదిక సమర్పించాలని భావిస్తున్నట్లు ఏపీ సర్కారు కోర్టుకు తెలిపింది.
ఈ క్రమంలో గత నివేదికలోని అంశాలు, తాజాగా తీసుకున్న చర్యలు తదితర అంశాలతో కూడిన సమగ్ర తుది నివేదిక అందించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆ పిటిషన్పై శుక్రవారం జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ ఉజ్జల్ భుయాన్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. గత ప్రభుత్వ హయాంలోని ఇసుక అక్రమ రవాణాపై చర్యలు తీసుకుంటున్నామని.. తుది నివేదిక సమర్పించడానికి ఇంకొంత సమయం కావాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది అభ్యర్థించారు. దానిని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. విచారణను ఆగస్టు 1కి వాయిదా వేసింది.