Share News

Tortured: చిత్రహింసలకు గురిచేశారు

ABN , Publish Date - Jan 30 , 2025 | 12:19 AM

Tortured: ఆన్‌లైన్‌లో డేటా ఎంట్రీ ఆపరేటర్‌ ఉద్యోగమనే ప్రకటన చూసి వెళ్లారా? అంతే జీవితాన్ని నాశనం చేసుకున్నట్టే. అక్కడికి వెళ్లి బైటకు రావాలంటే బతుకుమీద ఆశలు దాదాపు వదులు కోవాల్సిందే.

Tortured: చిత్రహింసలకు గురిచేశారు
విప్‌ అశోక్‌తో కలిసి మాట్లాడుతున్న మణికంఠ, గ్రామస్థులు

  • ఆన్‌లైన్‌లో ఉద్యోగం ప్రకటనను నమ్మి మోసపోయాను

  • థాయ్‌లాండ్‌ వెళ్లి అక్కడి నుంచి బర్మా తీసుకెళ్లారు

  • అక్కడ నాతో సైబర్‌ నేరాలు చేయించేవారు

  • ప్రభుత్వ విప్‌ ఎదుట ఇచ్చాపురం యువకుడి ఆవేదన

  • రామ్మోహన్‌, అశోక్‌ సహకారంతో బయటపడ్డానని వెల్లడి

కవిటి, జనవరి 29(ఆంధ్రజ్యోతి): ఆన్‌లైన్‌లో డేటా ఎంట్రీ ఆపరేటర్‌ ఉద్యోగమనే ప్రకటన చూసి వెళ్లారా? అంతే జీవితాన్ని నాశనం చేసుకున్నట్టే. అక్కడికి వెళ్లి బైటకు రావాలంటే బతుకుమీద ఆశలు దాదాపు వదులు కోవాల్సిందే. ఇలాంటి ఘటన ఇచ్చాపురంలోని బెల్లుపడకు చెందిన ఒక యువకునికి ఎదురైంది. ఇదే విషయాన్ని బుధవారం రామయ్యపుట్టుగలోని ప్రభుత్వ విప్‌ బి.అశోక్‌ సమక్షంలో విలేకరులకు తన బాధను వెల్లడించాడు. బెల్లుపడకు చెందిన బచ్చు మణికంఠ గత ఏడాది మేనెలలో ఆన్‌లైన్‌ ద్వారా డేటాఎంట్రీ ఆపరేటర్‌ ఉద్యోగానికి ధరఖాస్తు చేసుకోవాలనే ప్రకటన చూశాడు థాయ్‌లాండ్‌లోని ఈ ఉద్యోగానికి ధరఖాస్తు చేసుకున్నాడు. పాసుపోర్టు రెడీ చేసుకుని థాయ్‌లాండ్‌కు వెళ్లి అక్క దిగాడు. వెంటనే సదరు కంపెనీ డ్రైవరునంటూ ఓ వ్యక్తి వచ్చి కారులో తీసుకువెళ్లాడు. అక్కడనుంచి మణికంఠను మరోవ్యక్తికి అప్పగించటంతో వారు బర్మా బోర ్డరు దాటించి మయన్మార్‌ వరకు తీసుకువెళ్లాడు. అక్కడ మయన్మార్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగానున్న రెబల్‌ ఆర్మీ అంటూ వారి చేతికి మణికంఠను అప్పగించాడు. అక్కడున్న కొందరు రెబల్‌ ఆర్మీ ఆధ్వర్యంలో కంపెనీ ఉందని నమ్మించి అక్కడకు వెళ్లాక తన వస్తువులన్నీ తీసుకుని ఓభవనంలోకి తీసుకువెళ్లారు. ఆన్‌లైన్‌లో ఉద్యోగమని చెప్పి ఇతరదేశాల యువకులను ఇక్కడకు రప్పించి ఫ్రాడ్‌కాల్స్‌, క్రిప్టోకరెన్సీ పేరిట సైబర్‌నేరాలు చేయించుకుంటున్నారు. మణికంఠకు ప్రతీరోజూ టార్గెట్‌లు ఇచ్చి ఇరాక్‌, శ్రీలంక, ఇండియా, పాకిస్థాన్‌, బంగ్లాదే ష్‌, దుబాయ్‌ వంటి దే శాల యువకులకు మెసేజ్‌లు చేసి వారి వాట్సప్‌నెంబర్లు తెలుసుకుని వారితో చాటింగ్‌ చేయాలని బెదిరించే వారు. వారి మోసం చేసి సొమ్ములు రాబట్టుకోవడం వీరి పని. ఒక్కోసారి మాట వినని వారిని చిత్రహింసలకు గురిచేసేవారు. కునుకుతీసినా వాటర్‌ప్రెజర్‌తో హింసించటం లేకుంటే విద్యుత్‌ షాక్‌లు ఇవ్వటం, నిల్చోబెట్టి చేతులు పైకిఎత్తి ఉంచి లాక్‌లు వేయటం చేసేవారు. కనీసం తన తల్లిదండ్రులతో మాట్లాడాలన్నా అవకాశం ఇవ్వలేదని మణికంఠ వాపోయాడు. ఈ తరుణంలో మిత్రుడి సాయంతో తన తల్లిదండ్రులు ఎమ్మెల్యే అశోక్‌, కేంద్రమంత్రి రామ్మెహననాయుడును సంప్రదించారని, వారి సహకారంతో ఇటీవల గ్రామానికి చేరుకున్నానని మణికంఠ తెలిపాడు. తనలా ఎవరూ మోసపోకూడదని చెబుతున్నాడు.

అప్రమత్తంగా ఉండాలి

ఉద్యోగాల పేరుతో విదేశాలకు వలస వెళ్లే యువత చాలా అప్రమత్తంగా ఉండాలి. తాము వెళ్లే దేశం, కంపెనీ వివరాలను స్థానికంగా ఆర్డీవో స్థాయి అధికారితో నిర్ధారణ జరిగిన తర్వాతనే అక్కడకు వెళ్లాలి. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తా. ఇచ్ఛాపురం నియోజకవర్గం నుంచి అత్యధికంగా ఉపాధి కోసం విదేశాలకు వెళ్తుంటారు. ఇలాంటి వారు ఏ ఏజెంట్‌, ఇనిస్టిట్యూట్‌ ద్వారా వెళ్తున్నారో సరైన సమాచారం స్థానిక పోలీసులకు ఇవ్వాలి. లేదంటే కొన్నిసార్లు వారు ఎక్కడ ఉన్నారో ఎంబసీలోనూ తెలియదు.

-బెందాళం అశోక్‌, ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే, ఇచ్ఛాపురం

Updated Date - Jan 30 , 2025 | 12:19 AM