బాలుడిని మింగేసిన నీటికుంట
ABN , Publish Date - Feb 12 , 2025 | 12:05 AM
నాన్నా.. లేరా.. లేచి రారా.. మరి రావా.. నన్ను ఒదిలి వెళ్లిపో యావా అంటూ ఓ చిన్నారిపై పడి ఓ మహిళ చేసిన ఆర్తనాదాలు రాజాం సామాజిక ఆసుపత్రిలో చూపరులను కంటతడి పెట్టించాయి.

రాజాం రూరల్, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): నాన్నా.. లేరా.. లేచి రారా.. మరి రావా.. నన్ను ఒదిలి వెళ్లిపో యావా అంటూ ఓ చిన్నారిపై పడి ఓ మహిళ చేసిన ఆర్తనాదాలు రాజాం సామాజిక ఆసుపత్రిలో చూపరులను కంటతడి పెట్టించాయి. అప్పటివరకూ ఇంట్లోనే ఉన్నాడు. తోటి చిన్నారులంతా ఆటకు వెళ్తే వారివెంటే వెళ్లాడు.. నలుగు రైదుగురు ముందు నడుస్తుంటే.. ఆ చిన్నారి నాలుగడుగుల దూరంలో వారిని అను సరిస్తూ నడుస్తున్నాడు. వెళ్తూ వెళ్తూ మార్గమధ్యంలో ఉన్న నీటికుంటలో ఉన్న ఫళంగా పడిపోయాడు. ఇదేమీ గమనించని ఆ చిన్నారులంతా చెరువుగట్టు వద్దకు వెళ్లారు. కాసేపటి తరువాత తిరిగి వస్తూ మార్గమధ్యంలో నీటికుంటలో పడిఉన్న తన స్నేహితుడిని చూసి గ్రామంలోకి వెళ్లి జరిగిందంతా చెప్పారు. కుటుంబ సభ్యుల తో పాటు గ్రామస్థులు వెళ్లేసరికి శవమై తేలాడు. ఈ హృదయ విదారక ఘటన మండల పరిధిలోని పెనుబాక గ్రామ సమీపం తోటపల్లి కాలువ ప్రాంతంలో మంగళవారం జరిగింది. వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన భవాని, లక్ష్మణల కుమారుడు కుసుమంతరావు (8) రాజాంలోని ఓ ప్రైవేట్ స్కూల్లో రెండో తరగతి చదువుతున్నాడు. మంగళవారం స్కూల్కు వెళ్లకుండా ఇంటివద్దనే గడిపాడు. సాయంత్రం తోటి స్నేహితులతో తోటపల్లి కాలువ సమీపంలో ఆటకు వెళ్లాడు. అందరితో కలిసి వెళ్లకుండా కాస్త వెనుక నడుస్తూ కాలుజారి నేలకుంటలో పడి మృతి చెందాడు. మృతుడి తండ్రి లక్ష్మణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాజాం పొలీసులు కేసు నమోదు చేశారు.