పెళ్లికి ఒప్పుకోనందుకే..
ABN , Publish Date - Feb 03 , 2025 | 12:15 AM
నగరంలోని ఉమెన్స్ కళాశాల ప్రాంగణంలో ఇటీవల ఓ విద్యార్థినిపై జరిగిన దాడి కేసును పోలీసులు ఛేదించారు.

శ్రీకాకుళం క్రైం, ఫిబ్రవరి 2(ఆంధ్రజ్యోతి): నగరంలోని ఉమెన్స్ కళాశాల ప్రాంగణంలో ఇటీవల ఓ విద్యార్థినిపై జరిగిన దాడి కేసును పోలీసులు ఛేదించారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఆదివారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశం లో వెల్లడించారు. ఆ వివరాలిలా ఉన్నాయి.. గత నెల 31న నగరంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో బీఎస్సీ డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న కొరికాన లక్ష్మిపై దాడి జరిగింది. ఈ ఘటనపై ఆమె తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వన్టౌన్ ఎస్ఐ ఎం.హరికృష్ణ కేసు నమోదు చేశారు. ఈ కేసు దర్యాప్తులో సాంకేతిక పరమైన ఆధారాలు సేక రించి, దాడికి పాల్పడిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని అన్నికోణాల్లో విచారించారు. దాడి జరిగిన తర్వాత విద్యార్థిని సెల్ఫోన్ మాయమైంది. టవర్ లొకేషన్ ఆధారంగా ఆ సెల్ఫోన్ను ట్రేస్ చేయగా.. ఏడు రోడ్ల కూడలి సమీపంలో ఉన్న పార్క్ వద్ద పోలీసులు గుర్తించారు. ఈ సెల్ ఫోన్ ఆధారంగా కేసుకు సంబంధించి అనే క విషయాలు బయటపడ్డాయి. హాస్టల్ నుంచి బయటకు వచ్చిన లక్ష్మి ఓ వ్యక్తితో మాట్లాడడాన్ని గుర్తించిన పోలీసులు ఆ దిశగా విచారణ చేప ట్టారు. ఈ క్రమంలో ఆ వ్యక్తి సారవకోట మండలం గోవర్థనపురానికి చెందిన కణితి జగదీష్గా గుర్తించి అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సెల్ లొకేషన్ ఆధారంగా అతడిని పట్టుకుని విచారించగా.. దాడి చేసింది తానేనని అంగీ కరించాడు. అయితే జగదీష్తో లక్ష్మికి ముందే పరిచయం ఉండడం దాడి జరిగిన రోజు జగదీష్తో కలిసి రాత్రి 7.32 గంటల సమయంలో లక్ష్మి కళాశా లకు రావడం, తిరిగి 7.42 గంటల సమయంలో జగదీష్ గాబరా పడుతూ బయటకి వెళ్లడం సీసీ కెమెరాలో రికార్డయింది. దీనిపై జగదీష్ను పోలీసులు విచారించగా.. తాను సినిమాల్లో జూనియర్ ఆర్టిస్ట్గా పని చేస్తు న్నానని, తనను పెళ్లి చేసుకోమని లక్ష్మిని అడుగగా ఒప్పుకోకపోవడంతో ఆమె పై దాడి చేసినట్టు జగదీష్ విచారణలో ఒప్పుకున్నట్లు ఎస్పీ తెలిపారు.
692 కెమెరాలు ఏర్పాటు
మహిళలపై దాడులు నియంత్రించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటు న్నట్టు ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి స్పష్టం చేశారు. జిల్లా వ్యాప్తంగా గత 40 రోజుల్లో 692 కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. మహిళల విషయంలో కథ నాలు రాసే ముందు వారి కుటుంబ సభ్యుల కోసం ఆలోచించాలని సమా జంలో వారి గౌరవాన్ని భంగపరచవద్దని ఎస్పీ కోరారు. ఈ కేసును 48 గంటల్లో ఛేదించిన డీఎస్పీ వివేకానంద, టౌన్ సీఐ పి.పైడపునాయుడు, వన్ టౌన్ ఎస్ఐ ఎం.హరికృష్ణలను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. సమా వేశంలో ఎస్బీ సీఐ ఇమ్మాన్యుయేల్ రాజు తదితరులు పాల్గొన్నారు.