development అభివృద్ధికి ఆమడ దూరం!
ABN , Publish Date - Jan 27 , 2025 | 01:33 AM
నగరం నడిబొడ్డునే ఉన్న ఆ ప్రాంతం అభివృద్ధికి నోచుకోలేదు. దశాబ్దాల చరిత్ర ఉన్నా.. అక్కడి సమస్యలు మాత్రం పాలకులకు పట్టడం లేదు.
31వ డివిజన్లో సమస్యల తిష్ఠ
కానరాని పక్కా రహదారులు
కాలువలు లేక రోడ్డుపైకి మురుగునీరు
పూడుకుపోయిన చాకలి చెరువు
గంజాయి బ్యాచ్కు అడ్డాగా ఖాళీ స్థలాలు
శ్రీకాకుళం, జనవరి 26(ఆంధ్రజ్యోతి): నగరం నడిబొడ్డునే ఉన్న ఆ ప్రాంతం అభివృద్ధికి నోచుకోలేదు. దశాబ్దాల చరిత్ర ఉన్నా.. అక్కడి సమస్యలు మాత్రం పాలకులకు పట్టడం లేదు. ప్రజా సమస్యలు పరిష్కరించాలని ఏళ్ల తరబడి విన్నవిస్తున్నా.. పట్టించుకునే నాథుడు కరవయ్యాడు. వివరాల్లోకి వెళ్తే.. శ్రీకాకుళం నగరపాలక సంస్థ పరిధిలో 31వ డివిజన్లో అనేక సమస్యలు తిష్టవేశాయి. ఈ డివిజన్ పరిధిలో సాయినగర్ కాలనీ, పట్నాయక్ కాలనీ, దండివీధి ఉన్నాయి. ఈ డివిజన్ ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బందిపడుతున్నారు. ప్రభుత్వం మారి నెలలు గడుస్తోందని.. ఇప్పటికైనా తమ సమస్యలు పరిష్కరించాలని ఆ డివిజన్ ప్రజలు కోరుతున్నారు.
అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా..
జిల్లా పరిషత్కు సమీపాన మహిళా పోలీసు స్టేషన్ వెనుక సాయినగర్ కాలనీ ఉంది. కాలనీ ఎంట్రన్స్లో భారీవిస్తీర్ణంలో ప్రైవేటు స్థలం ఉంది. ఈ ప్రాంతం గంజాయి, మందు బాబులకు అడ్డాగా మారింది. రాత్రి పూట అటుగా రావాలంటే.. మహిళలు, విద్యార్థినులు భయాందోళన చెందుతున్నారు. ఈ ప్రాంతంపై పోలీసులు నిఘా పెట్టాలని కాలనీవాసులు కోరుతున్నారు. అలాగే కాలనీలో ఉన్న చాకలి చెరువు పూడుకుపోయింది. చెరువు నిండా పిచ్చి మొక్కలు పెరగడం, మురుగునీరు చేరడంతో పందులు, పాములకు ఆవాసం మారింది. ఇళ్లల్లోకి విష సర్పాలు చొరబడిన ఘటనలు ఉన్నాయి. కాలనీలో పక్కా రోడ్లు లేవు. కాలువలు లేకపోవడంతో మురుగునీరు రోడ్లుపైనే నిలిచిపోతుంది. నిర్మించకపోవడంతో.. వీల్లేని పరిస్థితిల్లో ఎక్కడికక్కడే నీరు నిలిచిపోతుంది. పందులు మరింతగా గోతులు చేసి అధ్వానంగా మారుస్తున్నాయి. కొంతమంది మున్సిపల్ కొళాయిలకు మోటార్లు అమర్చడంతో దీనివల్ల పూర్తిస్థాయిలో తాగునీరు అందక ఇబ్బందిపడుతున్నారు. వీధి లైట్లు కూడా పూర్తిస్థాయిలో లేకపోవడంతో ఇబ్బందిపడుతున్నారు. డ్రైనేజీ అధ్వానంగా ఉండడంతో దోమలు, పందుల బెడద ఎక్కువగా ఉంది.
పట్నాయక్ కాలనీలో..
ఈ కాలనీ విస్తీర్ణంలో పెద్దదే. ఇక్కడ అన్ని వర్గాలవారు నివసిస్తున్నారు. ఇక్కడ ఉన్న ఖాళీస్థలాల్లో అధికంగా ప్రైవేటువే ఉన్నాయి. ఆయా స్థలాల్లో పిచ్చిమొక్కలు ఏపుగా పెరిగిపోయాయి. మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు వేకెంట్ ల్యాండ్ కింద పన్నులు వసూలు చేస్తున్నది లేనిది తెలియాల్సి ఉంది. కానీ ఆయా స్థలాలు మినీ చెరువులుగా మారి మురుగునీరు నిల్వతో దుర్గంఽధం వెదజల్లుతుంది. ఇక రోడ్లుకు ఇరువైపులా కొన్నిచోట్ల మాత్రమే కాలువలు ఉన్నాయి. మిగిలిన ప్రాంతాల్లో.. ఇరుకు వీధిల్లో రోడ్డూ నిర్మించలేదు. కాలువలు లేకపోవడంతో ప్రతి ఇంటిముందర.. మురుగునీటి గుంతలు వెలిశాయి. దీంతో దోమల మోత విపరీతంగా ఉంది. అక్కడక్కడా ఉన్న కాలువలను శుభ్రం చేసిన దాఖలాలు లేవు. వీధి కుక్కల బెడద తీవ్రంగా ఉంది. రాత్రిపూట బయటకు రావాలంటే భయపడుతున్నారు. వీధి కుక్కల బెడద లేకుండా చూడాలని కాలనీవాసులు కోరుతున్నారు. అలాగే గత ప్రభుత్వ హయాంలో సీసీ రోడ్లు నిర్మాణానికి కొబ్బరికాయ కొట్టి.. రోడ్డు పనులు చేపట్టకుండా వదిలేశారని.. మౌలిక వసతులు మెరుగుపరచాలని కాలనీ వాసులు కోరుతున్నారు.
‘దండీ’గా ఇబ్బందులు
ఈ ప్రాంతంలో దండిగా ప్రజలు సమస్యలు ఎదుర్కొంటున్నారు. దోమల మోతతో ఇబ్బందులకు గురవుతున్నామని.. కాలువలు లేక.. మురుగునీటి నిల్వ వల్ల వ్యాధులు ప్రబలుతున్నాయని ప్రజలు వాపోతున్నారు. పక్కా రోడ్లు లేక ప్రజల ఇబ్బందిపడుతున్నారు. ఇప్పటికైనా ఇక్కడి సమస్యలను ప్రజాప్రతినిధులు గుర్తించాలని కోరుతున్నారు. డ్రైనేజీ వ్యవస్థను దండివీధి లో సరిదిద్దాలని.. అంతటా మురుగునీటికి ఆటంకం లేకుండా కాలువలను నిర్మించాలని విన్నవిస్తున్నారు. పందులు గుంపులుగా వీధుల్లో తిరుగుతు న్నాయని.. వీధి కుక్కలతో భయాందోళన చెందుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దండివీధిలో సీసీ రోడ్లు నిర్మించి ఇబ్బందుల్లేకుండా చూడాలని ప్రజాప్రతినిధులను, అధికార యంత్రాంగాన్ని స్థానికులు కోరుతున్నారు.
చెరువును అభివృద్ధి చేయాలి
వార్డు పరిధిలోని చాకలి చెరువు ము రుగునీరు చేరిపోవ డంతో పాములు, పందులకు ఆవాసం గా మారింది. ఈ సమస్యపై అధికారులకు విన్నవించాం. చెరువును శుభ్రంచేసి పార్క్గా అభివృద్ధి చేయాలి
- విభూది సూరిబాబు, 31వ డివిజన్
ఇబ్బందులు గుర్తించాలి
ఖాళీస్థలాల్లో జరుగు తున్న అసాంఘిక కార్యకలాపాలపై పోలీ సులు దృష్టిసారించాలి. తాగునీటి కొళాయిల నుంచి సక్రమంగా నీరు వచ్చేలా మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలి. మా ప్రాంతంలో రోడ్లు, కాలువలు నిర్మించాలి. వీధి కుక్కల బెడదను తొలగించాలి.
- జి.చంద్రభూషణం, సాయినగర్ కాలనీ
చెరువుల్లా ఖాళీ స్థలాలు
మా కాలనీలో ఉన్న ఖాళీ స్థలాల్లో మురుగునీ రు చేరి చెరువులను త లపిస్తున్నాయి. కాలనీ లోని కొన్ని వీధుల్లో పక్కా రోడ్లు లేక ఇబ్బందిప డుతున్నాం. గత ప్రభుత్వంలో కొబ్బరి కాయ కొట్టి పనులు చేపట్టలేదు. ఇప్పటికైనా అధికారులు, పాలకులు స్పందించి కాలనీలోని సమస్యలు పరిష్కరించాలి.
- వి.సతీష్, పట్నాయక్ కాలనీ