Dogs attack దివ్యాంగ చిన్నారిపై కుక్కలు దాడి
ABN , Publish Date - Feb 17 , 2025 | 12:08 AM
మేజరు పంచా యతీ పరిధి ఆలబోయినపేట, మంగళకాలనీ సమీపంలో కుక్కల దాడిలో అదే కాలనీకి చెందిన ఎనిమిదేళ్ల దివ్యాంగ చిన్నారి సెనగలు శ్యామల తీవ్రంగా గాయపడింది.

తీవ్రంగా గాయపడిన శ్యామల
పొందూరు, ఫిబ్రవరి 16(ఆంధ్రజ్యోతి): మేజరు పంచా యతీ పరిధి ఆలబోయినపేట, మంగళకాలనీ సమీపంలో కుక్కల దాడిలో అదే కాలనీకి చెందిన ఎనిమిదేళ్ల దివ్యాంగ చిన్నారి సెనగలు శ్యామల తీవ్రంగా గాయపడింది. మూగ, చెవిటితో బాధపడుతున్న శ్యామల స్నేహితులతో కలిసి కాలనీకి సమీపంలోని వివాహ విందుకు వెళ్లివస్తుండగా వెనుక నుంచి ఆరు కుక్కలు ఒక్కసారిగా వారిపై దాడికి ప్రయత్నించాయి. దీన్ని గమనించిన మిగిలిన పిల్లలు భయపడిపారిపోగా కుక్కల అరుపులు వినిపించని శ్యామల అక్కడే ఉండిపోయింది. దీంతో ఆ కుక్కలు ఒక్కసారిగా శ్యామలపై దాడిచేయడంతో తీవ్రంగా గాయపడింది. అటు గా వస్తున్న కొంత మంది కుక్కలను తరిమి చిన్నారిని కాపాడారు. గాయ పడిన శ్యామలను కుటుంబసభ్యులు పొందూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. కుక్కలదాడులు రోజురోజుకు పెరిగిపోతుండడంతో తమ పిల్లలను పాఠ శాలకు, బయటకు పంపించడానికే పిల్లల తల్లిదండ్రులు భయపడిపోతున్నారు. పంచాయతీ అధికారులు కుక్కల సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.