Smart phone: ఇదంతా స్మార్ట్ఫోన్ మాయ!
ABN , Publish Date - Jan 30 , 2025 | 11:51 PM
Digital Impact స్మార్ట్ ఫోన్లపై రోజురోజుకూ పెద్దలకే కాదు.. పిల్లలకు.. యువతకు మోజు పెరిగిపోతోంది. ప్రస్తుతం ఫోన్ లేకపోతే జీవితమే లేదన్నట్లుగా.. ప్రతి ఒక్కరి పరిస్థితి తయారైంది.

యూట్యూబ్ వీడియోలపైనే మోజు
ప్రాథమిక పఠన స్థాయి అంతంతమాత్రమే
అంక గణితంలోనూ ఆసక్తి లేదాయె
ఇంగ్లీషు చదవడం కాస్త ఫర్వాలేదు
ఆర్థిక విషయాలకూ ఫోన్పైనే ఆధారం
జిల్లాలో 14-18ఏళ్ల లోపు యువత తీరిదీ
‘అసర్’ నివేదిక ద్వారా వెల్లడి
సాంకేతికత పెరుగుతున్న వేళ.. ప్రస్తుతం ప్రతి ఒక్కరికీ స్మార్ట్ఫోన్ వినియోగం వ్యసనంలా మారింది. చిన్నారుల నుంచి పెద్దల వరకూ ఎవరి చేతిలో చూసినా స్మార్ట్ ఫోన్ దర్శనమిస్తోంది. విద్యతోపాటు ఆర్థికపరమైన అంశాలు.. ఇతర ఏ సమాచారం కావాలన్నా.. దానిపైనే ఆధారపడే పరిస్థితి నెలకొంది. ఫలితంగా విద్యార్థులు, యువత చదువులో వెనకబడిపోతున్నారు. ఈ విషయాన్ని ఇటీవల కేంద్ర ప్రభుత్వ సంస్థ ‘అసర్’.. చేసిన సర్వే ద్వారా స్పష్టమైంది.
శ్రీకాకుళం, జనవరి 30(ఆంధ్రజ్యోతి): స్మార్ట్ ఫోన్లపై రోజురోజుకూ పెద్దలకే కాదు.. పిల్లలకు.. యువతకు మోజు పెరిగిపోతోంది. ప్రస్తుతం ఫోన్ లేకపోతే జీవితమే లేదన్నట్లుగా.. ప్రతి ఒక్కరి పరిస్థితి తయారైంది. భవిష్యత్ను గందరగోళంలో నెట్టేసే అంశం ఇది. ఇటీవల కేంద్ర ప్రభుత్వ సంస్థ ‘అసర్’(యాన్యువల్ స్టేటస్ ఎడ్యుకేషన్ రిపోర్ట్).. ఓ సర్వే చేసింది. దేశ వ్యాప్తంగా 26 రాష్ట్రాల్లోని 28 జిల్లాల్లో 1,664 గ్రామాల్లో 30,074 ఇళ్ల వద్దకు వెళ్లి.. 34,745 మంది యువత అభిప్రాయాలను సేకరించింది. మన జిల్లాలోని 60 గ్రామాల్లో 1,047 ఇళ్లకు వెళ్లి.. 1,108 మంది యువతకు సర్వే చేసింది. ఇందులో 14 నుంచి 18 ఏళ్లలోపు వయసున్నవారి విద్యా సమాచారం, గణితం, స్మార్ట్ ఫోన్ వినియోగం, ఇతరత్రా విషయాలపై ఆరా తీసింది. అధిక విషయాల కోసం యువత స్మార్ట్ ఫోన్కే మొగ్గు చూపడం, ఆర్థిక అంశాలకు ఫోన్పైనే ఆధారపడుతున్న విషయం సర్వే నివేదికలో వెల్లడైంది. అధికశాతం మంది ఫోన్ వినియోగానికి మొగ్గు చూపడంతో విద్యాప్రమాణాలు దెబ్బతిన్నట్టు స్పష్టమవుతోంది.
జిల్లాలో ‘అసర్’ నివేదిక ఇలా..
జిల్లాలో 14-18 ఏళ్ల మధ్య విద్యార్థులు, యువతను ‘అసర్’ సర్వే చేసింది. అందులో పదోతరగతి కంటే తక్కువ చదువుకున్నవారు 54.9 శాతం ఉన్నారు. ఇందులో బాలురు 57.5 శాతం, బాలికలు 52.1 శాతం. ఇంటర్మీడియట్లో చేరినవారి సంఖ్య 28 శాతం ఉంది. ఇంటర్లో బాలురు 33.4 శాతం, బాలికలు 28.9 శాతం చేరారు. గ్రాడ్యుయేషన్ కోసం 9.5 శాతం చేరగా.. బాలురు 9.1 శాతం, బాలికలు 9.5శాతం ఉన్నారు. పూర్తిగా చదవని వారు 6.7 శాతం మంది ఉండగా.. ఇందులో 7.8 శాతం బాలురు, 5.5 శాతం బాలికలు ఉన్నారు. ఇక వృత్తి విద్యా కోర్సుల్లో చేరినవారి సంఖ్య పరిశీలిస్తే... యువత 6.3 శాతం ఉండగా, 7.8 శాతం బాలురు, 4.6 శాతం బాలికలు ఉన్నారు.
ప్రాథమిక పఠనం విషయంలో.. 14-16 వయసు గల వారిలో చేసిన సర్వేలో 75.4 శాతం రెండో తరగతి చదివే స్థాయిలోనే ఉన్నారు. అలాగే 17-18 వయసు గలవారిలో 75.8 శాతం మంది రెండో తరగతి చదివేస్థాయిలో ఉన్నారు. ‘ప్రాథమిక అంకగణితం’లో 58.6 శాతం విద్యార్థులు 14-16 ఏళ్ల వారు లెక్కలు చేయగలుగుతున్నారు. 17-18 ఏళ్ల వారు... 57.1 శాతం లెక్కలు చేయగలుగుతున్నారు. అంకెలు, వంద లోపు సంఖ్యలు గుర్తించడం, తీసివేత, భాగాహారం వంటివి చేయగలుగుతున్నట్టు సర్వేలో గుర్తించారు.
ఇంగ్లీషులో వాక్యాలను చదవగలిగేవారిని పరిశీలిస్తే.. 14-16 ఏళ్లలోపు విద్యార్థులు 71.1 శాతం, 17-18ఏళ్ల యువత 76.4 శాతం ఉన్నారు. దినచర్యలో భాగంగా ప్రతిరోజు సమయాన్ని లెక్కించగలిగేవారిలో 14-18 ఏళ్లలోపువారు 64.9 శాతం ఉన్నారు. బరువు, పరిమాణాన్ని కొలవగల సామర్థ్యం 65.1 శాతం మందికి, పొడవు కొలిచే సామర్థ్యం 93.8 శాతం మందికి తెలుసు. ద్రవపదార్థాలను లీటర్లలో కొలిచే విషయం 61.5 శాతం మందికి తెలుసునని సర్వేలో వెల్లడించారు.
కీలక అంశాలపై యువత సామర్థ్యం (శాతంలో)
-----------------------------------------------------------
ఆర్థిక పరమైన అంశాలు 14-16 వయసు 17-18 వయసు
---------------------------------------------------------
లెక్కల నిర్వహణలో 75.6 77.1
డిస్కౌంట్ విషయాలపై 37.3 37.4
లెక్కించి చెల్లింపు విషయాలలో 10.4 12.4
----------------------------------------------------------
స్మార్ట్ ఫోన్ వినియోగం ఇలా (శాతంలో)
---------------------------------------------------------
సొంత మొబైల్ .. 22.2 56.1
సోషల్ మీడియా 96.4 94.3
ప్రొఫైల్ బ్లాక్/రిపోర్ట్ 41.9 59.7
పాస్వర్డ్ మారుస్తున్నవారు 35.2 56.9
వారంలో విద్యకోసం... 78.9 75.6
ఆన్లైన్ సర్వీసులకు 29.8 54.3
ఎంటర్టైన్మెంట్ కోసం.. 81.7 88.5
అలారం సెట్టింగ్కు 82.4 88.3
సమాచారం కోసం నెట్ సెర్చింగ్ 74.6 82.3
గూగుల్ మ్యాప్ శోధన 41.0 58.6
యూట్యూబ్ వీడియోలు చూస్తూ.. 80.0 91.3
వీడియోలు షేరింగ్ 90.7 94.3
డిజిటల్ టాస్క్ కోసం.. 65.2 79.0