Share News

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

ABN , Publish Date - Jan 20 , 2025 | 11:28 PM

జలంత్రకోట కూడలి వద్ద జాతీయ రహదారిపై సోమవారం వేకువజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో సోంపేట మండలం బారువ గ్రామానికి చెందిన హరీష్‌కుమార్‌ పాణిగ్రాహి(31) మృతి చెందగా, అనిల్‌ కుమార్‌ పాణిగ్రాహి తీవ్రంగా గాయపడ్డాడు.

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
నుజ్జునుజ్జయిన కారు (ఇన్‌సెట్‌లో) హరీష్‌ కుమార్‌ (ఫైల్‌)

కంచిలి/సోంపేట, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): జలంత్రకోట కూడలి వద్ద జాతీయ రహదారిపై సోమవారం వేకువజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో సోంపేట మండలం బారువ గ్రామానికి చెందిన హరీష్‌కుమార్‌ పాణిగ్రాహి(31) మృతి చెందగా, అనిల్‌ కుమార్‌ పాణిగ్రాహి తీవ్రంగా గాయప డ్డాడు. కంచిలి పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. హరీష్‌ కుమార్‌ తన స్నేహితుడికి తీసుకువచ్చేందుకు ఆదివారం రాత్రి ఒంటి గంట సమయంలో కారులో వరుసకు సోదరుడైన అనిల్‌ కుమార్‌తో కలిసి పలాస రైల్వే స్టేషన్‌కు వెళ్లాడు. అక్కడి నుంచి ముగ్గురూ కలిసి కంచిలి వెళ్లి.. తన స్నేహితుడ్ని కంచిలిలో దిగబెట్టి సోమవారం ఉదయం 5గంటల ప్రాంతంలో తిరిగి స్వగ్రామానికి బయలుదేరారు. కంచిలి గ్రామం నుంచి జాతీయ రహదారిపైకి వచ్చిన హరీష్‌ పొగమంచు వల్ల రహదారిని గుర్తించలేక బారువ వైపు రాంగ్‌ రూట్‌లోకి వెళ్లిపోయాడు. ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న లారీని గమనించక బలంగా ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో వాహనం నడుపుతున్న హరీష్‌ అక్కడికక్కడే మృతి చెందగా.. అనిల్‌ తీవ్రంగా గాయ పడ్డాడు. అతడిని హైవే ఆంబులెన్స్‌లో సోంపేట సామాజిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందించగా.. పరిస్థితి విషమంగా ఉండడంతో శ్రీకాకుళం ఆసుపత్రికి.. అక్కడి నుంచి విశాఖలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. కాగా హరీష్‌కి తల్లి రోజా, సోదరి, సోదరుడు ఉన్నారు. తండ్రి చిన్నప్పుడే ఇల్లు విడిచి వెళ్లిపోయాడు. హరీష్‌ హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. సంక్రాంతి సందర్భంగా పది రోజుల కిందట స్వగ్రామానికి వచ్చాడు. సోమవారం హైదరాబాద్‌ వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకోగా.. ఈ క్రమంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో గ్రామంలో విషాధచాయలు అలముకున్నాయి. ఎస్‌ఐ పి.పారినాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Jan 20 , 2025 | 11:28 PM