TTD Ghee Scam: కల్తీ నెయ్యి కేసులో కీలక మలుపు
ABN , Publish Date - Jun 05 , 2025 | 04:56 AM
గత వైసీపీ ప్రభుత్వంలో నాలుగేళ్ల పాటు టీటీడీ చైర్మన్గా పనిచేసిన వైవీ సుబ్బారెడ్డి వ్యక్తిగత సహాయకుడు అప్పన్నను సిట్ అధికారులు విచారిస్తున్నారు. ఈ క్రమంలో టీటీడీలో ఇదివరకూ కీలకంగా వ్యవహరించిన ఇద్దరు ముఖ్యులకు నోటీసులు జారీ చేయనున్నట్టు సమాచారం.
సిట్ ముందుకు వైవీ సుబ్బారెడ్డి పీఏ
టీటీడీ మాజీ చైర్మన్ వ్యవహారాల్లో అప్పన్నదే కీలక పాత్ర
తిరుపతిలో విచారిస్తున్న సీబీఐ అధికారులు
తెర వెనుక ఏమి జరిగింది? ఒప్పందాలపై సమాచారం రాబట్టేందుకు ప్రశ్నలు
త్వరలో ఇద్దరు ముఖ్యులకు నోటీసులు
అదుపులో కోల్కతా పారిశ్రామికవేత్త
తిరుపతి, జూన్ 4(ఆంధ్రజ్యోతి): కల్తీ నెయ్యి కేసులో ఎట్టకేలకు అసలు డొంక కదులుతోంది. గత వైసీపీ ప్రభుత్వంలో నాలుగేళ్ల పాటు టీటీడీ చైర్మన్గా పనిచేసిన వైవీ సుబ్బారెడ్డి వ్యక్తిగత సహాయకుడు అప్పన్నను సిట్ అధికారులు విచారిస్తున్నారు. ఈ క్రమంలో టీటీడీలో ఇదివరకూ కీలకంగా వ్యవహరించిన ఇద్దరు ముఖ్యులకు నోటీసులు జారీ చేయనున్నట్టు సమాచారం. అప్పన్న వద్ద కీలక సమాచారం ఉందని భావించిన సిట్ అధికారులు విచారణకు హాజరు కావాలని ఇటీవల నోటీసు జారీ చేశారు. దీంతో మంగళవారం సాయంత్రం తిరుపతిలోని సిట్ కార్యాలయంలో అధికారుల ఎదుట ఆయన హజరయ్యారు. టీటీడీకి నెయ్యి సరఫరా వ్యవహారంలో తెర వెనుక ఏమి జరిగింది? ఎలాంటి ఒప్పందాలు జరిగాయి? ఎవరికి ఏ ప్రయోజనాలు కలిగాయి? అన్న సమాచారం రాబట్టేందుకు అధికారులు ఆయన్ను ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. సీబీఐకి చెందిన ముగ్గురు డీఎస్పీలు, రాష్ట్ర పోలీసు శాఖకు చెందిన ఒక డీఎస్పీ.. మొత్తం నలుగురు డీఎస్పీల బృందం విచారిస్తోంది. అధికారుల ప్రశ్నలు, అప్పన్న ఇచ్చే సమాధానాలను వీడియో, ఆడియోలతో రికార్డు చేస్తున్నట్టు సమాచారం. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఏర్పాటైన సిట్ ఇప్పటి దాకా జరిపిన దర్యాప్తు అంతా నెయ్యి తయారైన డెయిరీలు, సరఫరా చేసిన డెయిరీలు, వాటి ప్రతినిధులు, వారి సిబ్బంది, సహకరించిన వారి చుట్టూనే తిరిగింది. ఇప్పటి వరకూ అరెస్టయిన ఎనిమిది మందిలో ఆరుగురు డెయిరీలకు సంబంధించిన వ్యక్తులు కాగా.. మిగిలిన ఇద్దరూ టీటీడీ ఉద్యోగులు. గతేడాది నవంబరు 22న సిట్ దర్యాప్తు ప్రారంభించినప్పటి నుంచి కల్తీ నెయ్యి సరఫరా వ్యవహారంలో డెయిరీలు, టీటీడీ ఉద్యోగులను మినహా టీటీడీ పాలకవర్గానికి సంబంధించిన కీలక వ్యక్తులపై దృష్టి పెట్టినట్టు కనిపించలేదు. దర్యాప్తు మొదలైన ఆరు నెలల తర్వాత ఇప్పుడు ఏకంగా టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వ్యక్తిగత సహాయకుడికి నోటీసు జారీ చేసి విచారణకు రప్పించారు.
త్వరలో కీలక వ్యక్తులకూ..
మాజీ సీఎం జగన్కు చిన్నాన్న కావడంతో టీటీడీ చైర్మన్గా నాలుగేళ్ల పాటు వైవీ సుబ్బారెడ్డి తిరుగులేని అధికారం చెలాయించారు. ఆయనకు మొత్తం ఐదుగురు వ్యక్తిగత సహాయకులు ఉన్నట్టు సమాచారం. వారిలో అప్పన్న కీలక వ్యక్తి అని సిట్ గుర్తించింది. వైవీ సుబ్బారెడ్డికి సంబంధించిన అతి ముఖ్యమైన వ్యవహారాలన్నింటినీ ఈయనే చక్కబెట్టేవారని సమాచారం. హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే అప్పన్నకు ఢిల్లీలో కూడా పలువురు ప్రముఖులు, కీలక వ్యక్తులతో విస్తృత పరిచయాలు ఉన్నాయని తెలిసింది. ప్రస్తుతం అప్పన్నను విచారిస్తున్న సిట్ అధికారులు.. ఈ క్రమంలో సేకరిస్తున్న సమాచారం ఆధారంగా టీటీడీలో ఇదివరకూ కీలకంగా వ్యవహరించిన ఇద్దరు ముఖ్యులకు నోటీసులు జారీ చేయనున్నట్టు సమాచారం. తొలుత ఒకరికి, తదుపరి మరొకరికి నోటీసులు జారీ చేసే అవకాశముంది. ఆ కీలక వ్యక్తుల్లో ఒకరిని ప్రస్తుతం సిట్ అదుపులో ఉన్న అప్పన్న సమక్షంలోనే ప్రశ్నించే అవకాశముందని సిట్ వర్గాల ద్వారా తెలిసింది.
సిట్ అదుపులో కోల్కతా పారిశ్రామికవేత్త
కల్తీ నెయ్యి కేసులో తాజాగా సిట్ అధికారులు కోల్కతాకు చెందిన జ్యోతిష్య అనే పారిశ్రామికవేత్తను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ఏ2 నిందితుడు భోలేబాబా డెయిరీ డైరెక్టర్ పొమిల్ జైన్కు ఆయన సన్నిహిత మిత్రుడని సమాచారం. జ్యోతిష్యకు కోల్కతాలో పామాయిల్, ఇతర ఎడిబుల్ ఆయిల్స్ తయారీకి సంబంధించిన ప్లాంట్ ఉందని తెలిసింది. పొమిల్ జైన్కు ఆయనే నెయ్యి తయారీకి అవసరమైన ముడి పదార్థాలను సరఫరా చేసినట్టు సిట్ అధికారులు గుర్తించారు. అయితే ఆ మేరకు రికార్డుల్లో ఆయనకు పొమిల్ జైన్ ఎటువంటి బిల్లులూ చెల్లించినట్టు నమోదు కాలేదని సిట్ బృందం గుర్తించింది. తొలుత విచారణకు హాజరు కావాలంటూ అధికారులు నోటీసులు జారీ చేయగా ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్టు తెలిసింది. దీంతో కోల్కతా వెళ్లిన సిట్ అధికారులు ఆరు రోజుల పాటు అక్కడే మకాం వేసి చివరికి నగర శివారులో అదుపులోకి తీసుకున్నారని సమాచారం. అక్కడి నుంచి తిరుపతి తీసుకొచ్చి విచారిస్తున్నారు. పొమిల్ జైన్తో ఎప్పటి నుంచి పరిచయం ఉంది? ఆయనకు ఏయే ముడి పదార్థాలు సరఫరా చేస్తున్నారు? ఎప్పటి నుంచి సరఫరా చేస్తున్నారు? వంటి అంశాలపై ప్రశ్నిస్తున్నట్టు తెలిసింది. టీటీడీకి నెయ్యి సరఫరా చేస్తున్నారనే విషయమే తనకు తెలియదని, పొమిల్ జైన్ ఇండెంట్ పెట్టడంతో ఆయా ముడి పదార్థాలను సరఫరా చేశానని జ్యోతిష్య వెల్లడించినట్టు సమాచారం.
ఈ వార్తలు కూడా చదవండి..
For AndhraPradesh News And Telugu News