YS Jagan: సేవలు సమాధి చేయడమే విజనా
ABN , Publish Date - Jun 02 , 2025 | 04:33 AM
రేషన్ వాహనాలు నిలిపివేతతో 20 వేల కుటుంబాలకు రేషన్ సేవలలో అడ్డంకులు ఏర్పడ్డాయని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వలంటీర్లను ఎన్నికల సమయంలో ఉపయోగించి, తరువాత వారిని వదిలివేశారని విమర్శించారు.
వలంటీర్లను రోడ్డున పడేశారు: జగన్
అమరావతి, జూన్ 1(ఆంధ్రజ్యోతి): రేషన్ వాహనాలు, వలంటీర్ల వ్యవహారంపై వైసీపీ అధినేత జగన్ ఎక్స్లో స్పందించారు. రేషన్ వాహనాలను నిలిపి వేయడంతో విమర్శలు గుప్పించారు. ‘ప్రజల ఇంటికే అందుతున్న సేవలపై మీకు ఎందుకు కక్ష? మళ్లీ ప్రజలకు రేషన్ కష్టాలు ఎందుకు తెస్తున్నారు? ప్రభుత్వ సేవల డోర్ డెలివరీ విధానాన్ని సమాధి చేయడం విజన్ అవుతుందా? రేషన్ డోర్ డెలివరీని రద్దు చేయడం, పేదలను దోపిడీ చేయడానికి మళ్లీ ద్వారాలు తెరిచినట్లు కాదా? 9,260 రేషన్ వాహనాలపై ఆధారపడ్డ దాదాపు 20వేల మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కుటుంబాలను రోడ్డున పడేయడం ఎంతవరకు సమంజసం?’ అని పేర్కొన్నారు. వలంటీర్లను మోసం చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నెలకు రూ.10 వేలు ఇస్తామంటూ వలంటీర్లను మీవైపు తిప్పుకొని ఎన్నికల్లో వాడుకొని, అధికారంలోకి వచ్చాక పచ్చి అబద్ధాలు ఆడుతూ వారిని రోడ్డుమీద నిలబెట్టారు. వలంటీర్లుగా పనిచేస్తున్న 2.6 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు.’ అని జగన్ ఎక్స్లో పేర్కొన్నారు..