ఎవరిపై వేటు పడుతుందో?
ABN , Publish Date - Feb 13 , 2025 | 02:04 AM
జిల్లా నీటి యాజమాన్య సంస్థ(డ్వామా)లో పనిచేస్తున్న ఉద్యోగులు తీవ్ర ఆందోళనలో కనిపిస్తున్నారు. ఎవరిపై వేటు పడుతుందోనని అధిక శాతం మంది ఉద్యోగులు, క్షేత్ర స్థాయిలో పనిచేసే సిబ్బంది వణికిపోతున్నారు.

డ్వామా ఉద్యోగుల్లో అలజడి
ఒంగోలు, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి): జిల్లా నీటి యాజమాన్య సంస్థ(డ్వామా)లో పనిచేస్తున్న ఉద్యోగులు తీవ్ర ఆందోళనలో కనిపిస్తున్నారు. ఎవరిపై వేటు పడుతుందోనని అధిక శాతం మంది ఉద్యోగులు, క్షేత్ర స్థాయిలో పనిచేసే సిబ్బంది వణికిపోతున్నారు. డ్వామా పీడీగా కె.శీనారెడ్డి పనిచేసిన కాలంలో భారీగా అవినీతి, అక్రమాలు, అవకతవకలు చోటుచేసుకున్నాయని నిర్ధారించి ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అన్సారియా ప్రభుత్వానికి సిఫార్సు చేసిన విషయం విదితమే. అలాగే 70మందికిపైగా డ్వామా ఉద్యోగులపై చర్యలకు ప్రస్తుత పీడీని ఆదేశిస్తూ మంగళవారం ఉత్తర్వులు ఇచ్చారు. దీనిపై అందరిలోనూ విస్తృతంగా చర్చ సాగుతోంది. శీనారెడ్డి అండ చూసుకొని చెలరేగిపోయిన వారిపై వేటు తప్పదన్న భావన అధిక శాతం మంది వ్యక్తం చేస్తున్నారు. ఎవరెవరిపై చర్యలు ఉంటాయన్న దానిపై చర్చ నడుస్తోంది. కలెక్టర్ అదేశాలతో బాధ్యులపై చర్యలకు డ్వామా పీడీ జోసఫ్కుమార్ చర్యలు తీసుకోవాల్సి ఉంది. కలెక్టర్ ఇచ్చిన ఉత్తర్వులు పరిశీలించి తదనుగుణంగా పైళ్లు తయారు చేసి చర్యలు తీసుకునేందుకు కొంత సమయం పట్టే అవకాశం ఉంది. తమకు వేటు తప్పదన్న ఆందోళన ఉన్న కొందరు ఉద్యోగులు తప్పించుకునేందుకు మార్గాలు అన్వేషిస్తున్నట్లు తెలుస్తోంది.