ఎక్కడున్నారు?
ABN , Publish Date - Feb 19 , 2025 | 02:35 AM
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మిస్సింగ్ సిటిజన్ సర్వే జిల్లాలో ముమ్మరంగా సాగుతోంది. మండల పరిషత్ అధికారులు అన్ని గ్రామాల్లో ఈ ప్రక్రియను నిర్వహిస్తున్నారు. జిల్లా, మండలస్థాయి అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. సచివాలయాల ద్వారా ప్రభుత్వ లబ్ధి పొందిన వారితోపాటు ఉద్యోగులుగా పనిచేస్తున్న వారి వివరాలు వివిధ కారణాలతో డేటాబేస్లో నమోదు కాలేదు.
మిస్సింగ్ సిటిజన్స్పై యంత్రాంగం సర్వే
కొందరు అనర్హులకు పథకాల లబ్ధి
వారిని గుర్తిస్తున్న సచివాలయ ఉద్యోగులు
డేటాబేస్లో లేని వారి వివరాలు నమోదు
ప్రతి పౌరుడి సమాచారం నిక్షిప్తం
నాగులుప్పలపాడు మండలంలోని గ్రామ సచివాలయ డేటాబేస్లో నమోదు కాని వారందరినీ సర్వే ద్వారా గుర్తిస్తున్నారు. వారిని హౌస్హోల్డ్ మ్యాపింగ్ చేసే పనిలో సచివాలయ సిబ్బంది నిమగ్నమయ్యారు. మండల పరిధిలో 6,735 మంది నమోదుకానట్లు గుర్తించారు. 308 మంది వేరొక ప్రాంతంలో నివసిస్తున్నట్లు తేలింది. 919 మందిని కొత్తగా హౌస్హోల్డ్ మ్యాపింగ్లో నమోదు చేశారు. 2,524 మంది రాష్ట్రంలో కాకుండా బయట ప్రాంతాల్లో నివసిస్తున్నట్లు గుర్తించారు. 94 మంది వివరాలు ఇప్పటికీ తెలియలేదు. 958మంది మరణించినట్లు గుర్తించారు. మిగిలిన వారి వివరాలను సర్వే చేయాల్సి ఉందని ఎంపీడీవో మహాలక్ష్మి తెలిపారు.
దర్శి మండలంలో ఎంపీడీవో కృష్ణమూర్తి ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. ఇప్పటివరకు 3,400 మంది మిస్సింగ్ సిటిజన్స్ను గుర్తించారు. కొంతమంది బతుకు దెరువు కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లారు. అడ్డదారిలో ప్రభుత్వ పథకాల లబ్ధిని పొందుతున్న వారిని గుర్తించి వారి పేర్లు తొలగించేందుకు, అర్హులైన వారి పేర్లు నమోదు చేసేందుకు వీలుగా ఈ సర్వే నిర్వహిస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మిస్సింగ్ సిటిజన్ సర్వే జిల్లాలో ముమ్మరంగా సాగుతోంది. మండల పరిషత్ అధికారులు అన్ని గ్రామాల్లో ఈ ప్రక్రియను నిర్వహిస్తున్నారు. జిల్లా, మండలస్థాయి అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. సచివాలయాల ద్వారా ప్రభుత్వ లబ్ధి పొందిన వారితోపాటు ఉద్యోగులుగా పనిచేస్తున్న వారి వివరాలు వివిధ కారణాలతో డేటాబేస్లో నమోదు కాలేదు. అలాగే ఇతర ప్రాంతాల్లో జీవనం సాగిస్తున్న వారి వివరాలను సచివాలయ సిబ్బంది మిస్సింగ్ సిటిజన్ సర్వే ద్వారా డేటాబేస్లో పొందుపరుస్తున్నారు. తద్వారా అర్హులకు పథకాల లబ్ధి అందడంతోపాటు అనర్హులను తొలగించే అవకాశం ఉంది. అలాగే ప్రతి పౌరుడి వివరాలు ప్రభుత్వ సైట్లో అందుబాటులో ఉంటాయి.
ఒంగోలు, ఫిబ్రవరి 18 (ఆంధ్రజ్యోతి)/నాగులుప్పలపాడు/దర్శి : జిల్లా ప్రజానీకంలోని అనేక మంది ఆచూకీ తెలియడం లేదు. అలాగే ప్రభుత్వ లెక్కల్లోనూ కనిపించడం లేదు. హౌస్హోల్డ్ మ్యాపింగ్ ప్రక్రియలో దాదాపు 2.14 లక్షల మంది సమాచారం లభించలేదు. రాష్ట్రవ్యాప్తంగా ఇంచుమించు 46.93 లక్షల మంది వివరాలు లభించకపోవడంతో ప్రభుత్వం జిల్లాల వారీగా మళ్లీ సర్వే చేసి లెక్కలు తేల్చాలని ఆదేశించింది. దీంతో ప్రస్తుతం సచివాలయ సిబ్బంది ద్వారా హౌస్హోల్డ్ సర్వే చేస్తున్నారు. జిల్లాలో 2011 జనాభా లెక్కల ప్రకారం సుమారు 22.88 లక్షల మంది ఉన్నారు. ఈ పన్నెండేళ్లలో మరో 4 లక్షల మంది వరకు పెరిగినట్లు అంచనా. అలాగే మొత్తం 7.81 లక్షల హౌస్హోల్డ్లు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా గతంలో హౌస్హోల్డ్ మ్యాపింగ్ (ఇంటింటి సర్వే)ను ప్రభుత్వం చేపట్టింది. ప్రతి ఇంటికీ వెళ్లి సచివాలయ సిబ్బంది ఎంతమంది నివాసం ఉంటున్నారు, ఏయే వయస్సులలో, ఎక్కడెక్కడ ఉంటున్నారు, ఏమి చేస్తున్నారన్నది వారికి ఆధార్ నంబర్లు, పాన్ నంబర్లు ఇలా అన్ని వివరాలు సేకరించారు. ఈ తరహా సర్వే గతంలోనే చేశారు.
లక్షల మంది వివరాలు లేవు
జనాభా లెక్కకు, మ్యాపింగ్ సర్వేలో వచ్చిన లెక్కలకు తేడాలు ఉన్నాయి. అలా రాష్ట్రంలో సుమారు 46.93 లక్షల మంది వివరాలు లేకపోవడంతో వారిని మిస్సింగ్ సిటిజన్గా ప్రభుత్వం భావిస్తోంది. అలా జిల్లాలో 2,14,932 మంది ఆచూకీ లభించని వారు ఉన్నారని అంచనా. అంటే అంతమంది సమాచారం ప్రభుత్వ లెక్కల్లో తేలడం లేదు. దీంతో మరోసారి మ్యాపింగ్ సర్వేను అప్డేట్ చేయాలని ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఆదేశించింది. తదనుగుణంగా ప్రస్తుతం మళ్లీ సర్వే సాగుతోంది. అలా జిల్లాలోని 7.81 లక్షల గృహాలలో సుమారు 7.28 లక్షల గృహాల సర్వే పూర్తయినట్లు సమాచారం. గతంలో ఇంటింటికి వెళ్లి మళ్లీ మ్యాపింగ్ చేసి ఉండటంతో సిబ్బంది తమ వద్ద ఉన్న గతంలో చేసిన సర్వే వివరాలను సరిచూస్తున్నారు.
54వేలమంది ఇతర రాష్ట్రాల్లో...
కొత్తగా జన్మించిన, మరణించిన వారితోపాటు ఆధార్ నంబర్ల వివరాలు, వలస వెళ్లినట్లుగా భావించే వారి వివరాలను సరిపోల్చుతున్నారు. ఈ ప్రక్రియలో మిస్సింగ్ జాబితాలో ఉన్న 2.14 లక్షల మందిలో దాదాపు 1.14 లక్షల మంది వివరాలను ఇప్పటి వరకు పరిశీలించినట్లు సమాచారం. ఈ క్రమంలో కొత్తగా 9,589 గృహాలు జాబితాలో చేరగా 34,088 మంది వాటిలో నివాసితులుగా గుర్తించారు. అలాగే 54,144 మంది ఇతర రాష్ర్టాలలో నివాసం ఉంటున్నారు. 19,236 మంది మృతిచెందినట్లు గుర్తించారు. ఇక 7,520 మంది ఎక్కడ ఉంటున్నారన్నది ఆచూకీ లేదు. మరో 91,852 మంది వివరాలను పరిశీలించాల్సి ఉంది. మొత్తం మీద తొలుత నిర్వహించిన హౌస్హోల్డ్ మ్యాపింగ్ సర్వేలో కుటుంబ సభ్యుల వివరాలను సరిగా ఇవ్వకపోవడం, పేర్లు చెప్పినా ఆధార్ నంబర్లు, మొబైల్ నంబర్లు ఇవ్వకపోవడం, ఇచ్చినప్పటికీ వారి పూర్తి వివరాలు నమోదుకు వీలుగా సదరు వ్యక్తులు స్పందించకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడినట్లు తెలుస్తోంది. ప్రస్తుత ప్రభుత్వ ఆదేశాలతో మిస్సింగ్ సిటిజన్ల వివరాలను సిబ్బంది మళ్లీ పరిశీలిస్తున్నారు.