విజన్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయాలి
ABN , Publish Date - Feb 21 , 2025 | 11:56 PM
స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా నియోజకవర్గంలోని ఆరు మండలాల అధికారులు పనిచేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖా మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయ్వామి ఆదేశించారు
మంత్రి స్వామి
నాయుడుపాలెంలో అధికారులతో నియోజకవర్గ సమీక్ష
కొండపి, ఫిబ్రవరి 21 (ఆంధ్రజ్యోతి): స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా నియోజకవర్గంలోని ఆరు మండలాల అధికారులు పనిచేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖా మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయ్వామి ఆదేశించారు. శుక్రవారం టంగుటూరు మండలంలోని తూర్పునాయుడుపాలెంలోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన రెవెన్యూ, హౌసింగ్, పంచాయతీరాజ్, వెలుగు, ఎన్ఆర్ఈజీఎ్స, ఎంపీడీవోలతోపాటు ఇతర శాఖల అధికారులతో విడివిడిగా సమీక్ష సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలో గత ప్రభుత్వం హయాంలో జరిగిన ఫ్రీహోల్డ్ ల్యాండ్స్ అక్రమాలు గుర్తించాలని స్వామి తహసీల్దార్లతో జరిగిన సమీక్షలో అన్నారు. రీసర్వే చేస్తున్న గ్రామాల్లో రీసర్వే తప్పులు లేకుండా పారదర్శకంగా, విమర్శలకు తావులేకుండా నిర్వహించాలని ఆరు మండలాల తహసీల్దార్లకు సూచించారు. ఎన్టీఆర్ హౌసింగ్లో పొజిషన్ సర్టిఫికెట్ల కోసం ఇచ్చిన అర్జీలను పరిశీలించి అర్హులైన వారికి న్యాయం చేయాలని చెప్పారు. పంచాయతీరాజ్ ఏఈలతో సమీక్షిస్తూ సీసీరోడ్లు, పల్లె పండుగ కార్యక్రమంలో నియోజకర్గంలోని వివిధ గ్రామాల్లో ప్రారంభమైన సీసీరోడ్లు, సైడు కాల్వల నిర్మాణ పనులపైనా, పంచాయతీరాజ్ శాఖలో జరగాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపైనా సమీక్షించారు. సమీక్షలో ఆరు మండలాల తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
గాయపడిన విద్యార్థికి చికిత్సకు రూ.2లక్షలు మంజూరు
మంత్రి స్వామి పరామర్శించిన మరుసటిరోజే ఎల్వోసీ జారీ
ఒంగోలు కలెక్టరేట్, ఫిబ్రవరి 21 (ఆంధ్రజ్యోతి) : శరీరంపై వేడిపాలు పడి గాయాలైన విద్యార్థి ఎం.మధుమోహన్కు వైద్యచికిత్స కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.2లక్షలు ఎల్వోసీ మంజూరు చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. టంగుటూరులోని మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో గురువారం ఐదో తరగతి చదువుతున్న మధుమోహన్ శరీరం, చేతులపైనా వేడి పాలు పడి గాయాలు కావడంతో వైద్యం కోసం స్థానిక కిమ్స్ వైద్యశాలకు తరలించారు. ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ డీఎ్సబీవీ.స్వామి కిమ్స్ వైద్యశాలలో చికిత్స పొందుతున్న బాలుడిని పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థికి మెరుగైన వైద్య సేవలు అందించాలని, అందుకు అవసరమైన నిధులను సీఎంఆర్ఎఫ్ ద్వారా మంజూరు చేయిస్తానని వైద్యశాల ప్రతినిధులకు తెలిపారు. ఈ విషయాన్ని వెంటనే మంత్రి స్వామి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు శుక్రవారం వైద్యశాలలో చికిత్స పొందుతున్న మధుమోహన్కు వైద్యచికిత్స కోసం సీఎంఆర్ఎఫ్ కింద రూ2లక్షలు మంజూరు చేస్తూ అందుకు అవసరమైన ఎల్వోసీని కిమ్స్ వైద్యశాలకు పంపించారు. దీంతో ఆ విద్యార్థి తల్లిదండ్రులు, బంధువులు కృతజ్ఞతలు తెలిపారు.