Share News

స్వర్ణాంధ్ర.. స్వచ్ఛాంధ్ర

ABN , Publish Date - Feb 15 , 2025 | 01:05 AM

జిల్లాలో శనివారం ‘స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర’ నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వం ఈ కార్యక్రమానికి అధిక ప్రాధాన్యం ఇచ్చింది. ఈ నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా సుమారు 15వేల ఇంకుడు గుంతలకు శంకుస్థాపనలు చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.

స్వర్ణాంధ్ర.. స్వచ్ఛాంధ్ర
జాళ్లపాలెం గ్రామంలో ఇంకుడు గుంత పనులకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలిస్తున్న అధికారులు

నేడు జిల్లావ్యాప్తంగా 15వేల ఇంకుడు గుంతల పనులు ప్రారంభం

జాళ్లపాలెంలో పాల్గొననున్న మంత్రి స్వామి

ఒంగోలు కలెక్టరేట్‌, పిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో శనివారం ‘స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర’ నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వం ఈ కార్యక్రమానికి అధిక ప్రాధాన్యం ఇచ్చింది. ఈ నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా సుమారు 15వేల ఇంకుడు గుంతలకు శంకుస్థాపనలు చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఉదయం 8గంటలకు కొండపి మండలం పెదకండ్లగుంట పంచాయతీ పరిధిలోని జాళ్లపాలెంలో కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియాతో కలిసి సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డాక్టర్‌ డీఎస్‌బీవీ స్వామి పనులను ప్రారంభిం చనున్నారు. అందుకు అవసరమైన ఏర్పాట్లను సంబంధిత అధికారులు చేశారు. వీటిని శుక్రవారం డీపీవో గొట్టిపాటి వెంకటనాయుడు, కొండపి ఎంపీడీవో రామాంజనేయులు పరిశీలించారు. జిల్లావ్యాప్తం గా ఆయా నియోజకవర్గాల్లో స్థానిక శాసనసభ్యులు, ఇన్‌చార్జిలతో పాటు అధికారులు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.


స్వర్ణాంధ్రలో జిల్లా వెనుకబాటు

స్వచ్ఛాంధ్రలో జిల్లా వెనుకబడింది. 14 ఇండికేటర్స్‌ ఆధారంగా జిల్లాలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శుక్రవారం ర్యాంకులు ప్రకటించారు. మొత్తం 200 పాయింట్లతో ఎన్‌టీఆర్‌ జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. 127 పాయింట్లతో విశాఖ రెండో స్థానంలో, 125 పాయింట్లతో తూర్పు గోదావరి జిల్లా 3వస్థానంలో ఉంది. ప్రకాశం జిల్లా 99 పాయింట్లతో 22వస్థానంలో నిలిచింది. స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్రలో భాగంగా పట్టణాభివృద్ధి శాఖ, పంచాయతీరాజ్‌శాఖ చేపట్టిన కార్యక్రమాలపై సంబంధిత అధికారులు ముఖ్యమంత్రికి నివేదిక ఇచ్చారు. మొత్తం 14 ఇండికేటర్స్‌కు సంబంధించి నిర్దేశించిన లక్ష్యాల్లో జిల్లా వెనుకబడి ఉంది. పట్టణాభివృద్ధిశాఖ పరిధిలో డోర్‌ టూ డోర్‌ కలెక్షన్‌కు 15 పాయింట్లు, సోర్స్‌ సెగ్రిగేషన్‌కు 35 పాయింట్లు, సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌కు 20 పాయింట్లు, లెగసీ వేస్ట్‌ క్లియరెన్స్‌కు 10 పాయింట్లు, లిక్విడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌కు 20 పాయింట్లు ఇచ్చారు. పంచాయతీరాజ్‌ శాఖలో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి 15 పాయింట్లు, పబ్లిక్‌ టాయిలెట్లకు 10 పాయింట్లు, కమ్యూనిటీ సోక్‌ పిట్స్‌కు 10 పాయింట్లు, నూరుశాతం డోర్‌ టు డోర్‌ చెత్త కలెక్షన్‌కు 10 పాయింట్లు, ఓడీఎఫ్‌ ప్లస్‌ మోడల్‌కు 10 పాయింట్ల చొప్పున కేటాయించారు. ఇలా మొత్తం 200 పాయింట్ల ఆధారంగా జిల్లాల ప్రోగ్రస్‌పై ర్యాంకులు ఇచ్చారు. అలా స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్రలో జిల్లా 22వ స్థానంలో నిలిచింది.

Updated Date - Feb 15 , 2025 | 01:05 AM