రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు
ABN , Publish Date - Jan 16 , 2025 | 10:55 PM
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లోని కలెక్టర్ సమావేశపు హాలులో గురువారం సాయంత్రం రోడ్డు భద్రత కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది.

కలెక్టర్ అన్సారియా ఆదేశం
ఒంగోలు కలెక్టరేట్, జనవరి 16(ఆంధ్రజ్యోతి): రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లోని కలెక్టర్ సమావేశపు హాలులో గురువారం సాయంత్రం రోడ్డు భద్రత కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణ కోసం జిల్లాలోని హైవేలు, రాష్ట్ర రహదారులలో సంయుక్త తనిఖీలు నిర్వహించాలన్నారు. తరుచూ ప్రమాదాలు జరిగే ప్రదేశాలను గుర్తించి ఆయా ప్రాంతాల్లో బారికేడ్లు, స్టాపర్స్, ప్రమాద సంకేత సూచికలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. 2024లో జిల్లా జరిగిన రోడ్డు ప్రమాదాలకు సంబంధించి 872 కేసులు నమోదు కాగా అందులో 389మంది మృతి చెందారని పేర్కొన్నారు. అందువల్ల ప్రయాణికుల భద్రతపై ప్రత్యేకంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. ముఖ్య కూడళ్లు, రద్దీ ప్రదేశాల్లో రహదారుల ఆక్రమణలపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో డీటీసీ ఆర్.సుశీల, డీఎస్పీ సురే్షబాబు, వివిధశాఖల అధికారులు దేవానందం, జమున, వెంకటేశ్వర్లు, బేబీరాణి, సుధాకర్, కిరణ్కుమార్, విద్యాసాగర్, మునిసిపల్ కమిషనర్లు, జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.