సంక్షేమ హాస్టళ్లపై ప్రత్యేక శ్రద్ధ
ABN , Publish Date - Feb 01 , 2025 | 01:56 AM
రాష్ట్రంలోని సంక్షేమ హాస్టళ్ల అభివృద్ధి, విద్యార్థులకు మెరుగైన బోధన, వారి ఆరోగ్యంపై రాష్ట్రప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డీఎస్బీవీ స్వామి తెలిపారు. కలెక్టర్ తమీమ్ అన్సారీయాతో కలిసి శుక్రవారం ఒంగోలులోని అంబేడ్కర్ భవన్ సమీపంలోని సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహం (ఆనంద నిలయం)ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.
మెరుగైన బోధన, విద్యార్థుల ఆరోగ్యం కోసం చర్యలు
సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ స్వామి
ఒంగోలులో కలెక్టర్తో కలిసి బాలికల హాస్టల్ తనిఖీ
వార్డెన్ పనితీరుపై ఆగ్రహం
ఒంగోలు, కార్పొరేషన్, జనవరి 31(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని సంక్షేమ హాస్టళ్ల అభివృద్ధి, విద్యార్థులకు మెరుగైన బోధన, వారి ఆరోగ్యంపై రాష్ట్రప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డీఎస్బీవీ స్వామి తెలిపారు. కలెక్టర్ తమీమ్ అన్సారీయాతో కలిసి శుక్రవారం ఒంగోలులోని అంబేడ్కర్ భవన్ సమీపంలోని సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహం (ఆనంద నిలయం)ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హాస్టల్లో జరుగుతున్న మరమ్మతు పనులను పరిశీలించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ సంక్షేమ హాస్టల్స్లో ఉంటున్న విద్యార్థులు మంచిగా చదువుకుని ఉన్నత స్థానాలకు చేరాలన్నదే ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆశయమన్నారు. అందుకోసమే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా హాస్టళ్ల మరమ్మతులకు రూ.143కోట్లు మంజూరు చేశారని మంత్రి తెలిపారు. ఒంగోలులోని ఆనంద నిలయం అభివృద్ధి, మరమ్మతుల కోసం రూ.9.30లక్షలు ఖర్చు చేస్తున్నామని వెల్లడించారు. దీంతోపాటుగా మరో రూ.30లక్షలు వెచ్చించి అదనపు అంతస్తు నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా హాస్టల్లోని వసతిగదులు, మరుగుదొడ్లు, వంటశాలను పరిశీలించారు. విద్యార్థినిలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అలాగే విద్యార్థుల ఆసక్తి మేరకు మెనూలో మార్పులు చేయాలని ఆదేశించారు. కలెక్టర్ తమీమ్ అన్సారియా మాట్లాడుతూ ఆనంద నిలయంలో చేపట్టిన అభివృద్ధి పనులు సగం పూర్తయ్యాయని, మిగిలినవి త్వరలోనే పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే పదో తరగతి విద్యార్థులకు అవసరమైన ఆల్ ఇన్ వన్ గైడులు నాలుగు రోజుల్లోనే పంపిణీ చేస్తామని తెలిపారు. కార్యక్రమంలోసాంఘిక సంక్షేమాధికారి లక్ష్మానాయక్, దివ్యాంగుల సంక్షేమ శాఖ డీడీ జి.అర్చన, ఏపీడబ్ల్యూఎస్ఐడీఎస్ ఈఈ పాలపర్తి భాస్కర్బాబు పాల్గొన్నారు.