మొగిలిగుండాలకు మోక్షం
ABN , Publish Date - Mar 06 , 2025 | 02:22 AM
మొగిలిగుండాల రిజర్వాయర్ నిర్మాణ పనులు కూటమి ప్రభు త్వం రాకతో పునఃప్రారంభమయ్యాయి. మూడేళ్లుగా అడుగు ముందుకు పడని పనులు టీడీపీ దర్శి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి చొరవతో 20 రోజులుగా చురుగ్గా సాగుతున్నాయి.
శరవేగంగా రిజర్వాయర్ పనులు
వైసీపీ హయాంలో బిల్లులు రాక నిలిపివేసిన కాంట్రాక్టర్
కూటమి ప్రభుత్వంలో రూ.1.20 కోట్ల విడుదల
టీడీపీ దర్శి ఇన్చార్జి చొరవతో పునఃప్రారంభం
తాళ్లూరు, మార్చి 5 (ఆంధ్రజ్యోతి) : మొగిలిగుండాల రిజర్వాయర్ నిర్మాణ పనులు కూటమి ప్రభు త్వం రాకతో పునఃప్రారంభమయ్యాయి. మూడేళ్లుగా అడుగు ముందుకు పడని పనులు టీడీపీ దర్శి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి చొరవతో 20 రోజులుగా చురుగ్గా సాగుతున్నాయి. గత వైసీపీ ప్రభుత్వం కాంట్రాక్టర్కు బిల్లులు చెల్లించకపోవడంతో మూడేళ్ల క్రితం అర్ధంతరంగా పనులు నిలిపివేశాడు. తాళ్లూరు, అద్దంకి, చీమకుర్తి, మద్దిపాడు మండలాల్లోని దాదాపు 20గ్రామాలకు చెందిన ప్రజల సాగు, తాగునీటి కోసం దాదాపు 50 ఏళ్ల క్రితం మొగిలిగుండాల రిజర్వాయర్ ప్రతిపాదన తెరపైకి వచ్చింది. గత టీడీపీ హయాంలో అది కార్యరూపం దాల్చింది. అప్పటి మంత్రి శిద్దా రాఘవరావు రూ.10.40 కోట్లు మంజూరు చేయించారు. 2019 మార్చిలో భూమి పూజ చేశారు. ఎన్నికల నియమావళి రావడంతో పనులు ప్రారంభించ లేదు. తదుపరి వైసీపీ ప్రభుత్వం రివర్స్ టెండర్ పేరుతో ఆపనిని రద్దు చేసింది. అనంతరం రిజర్వాయర్ నిర్మాణానికి రూ.7.97కోట్లు, భూసేకరణకు రూ.2.43 కోట్లు కలిపి మొత్తం రూ. 10.40 కోట్లను మంజూరు చేసింది. 2021 సెప్టెంబర్ 2న మరోసారి భూమి పూజ చేశారు.
మూడేళ్లుగా నిలిచిన పనులు
పనులు చేపట్టిన కాంట్రాక్టర్ మూడు నెలలపాటు నిరాటంకంగా కొనసాగించారు. చెరువు కట్ట మొత్తాన్ని చదును చేశారు. తదుపరి వైసీపీ ప్రభుత్వం కాంట్రాక్టర్కు బిల్లులు చెల్లించకపోవడంతో పనులు నిలిపి వెళ్లిపోయాడు. దీంతో మూడేళ్లుగా రిజర్వాయర్ నిర్మాణ పనులు నిలిచిపోయాయి. అనంతరం కాంట్రాక్టర్ యంత్ర సామగ్రిని కూడా అక్కడ నుంచి తీసుకుపోయాడు.
కూటమి ప్రభుత్వం రాకతో పునఃప్రారంభం
కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన మూడు నెలల్లోనే ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి సారించింది. కాంట్రాక్టర్కు బకాయి ఉన్న బిల్లుల్లో రూ.1.20 కోట్లు నిధులు విడుదల చేసింది. దీంతో మిగిలిన పనులు త్వరితగతిన పూర్తి చేయాలని టీడీపీ నియోజకర్గ ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఇరిగేష్ అధికారులు, కాంట్రాక్టర్కు సూచించారు. బిల్లుల చెల్లింపుపై నమ్మకంతో కాంట్రాక్టర్ కూడా ముందుకు వచ్చి పనులు పునఃప్రాంభించారు. ప్రస్తుతం పనులు వేగంగా జరుగుతున్నాయి. జూన్ చివరి నాటికి మొగిలిగుండాల రిజర్వాయర్ పూర్తి చేస్తామని ఇరిగేషన్ ఏఈ సుబ్బారావు తెలిపారు.