ప్రారంభమైన పరిశీలన
ABN , Publish Date - Jan 07 , 2025 | 01:08 AM
జిల్లాలో మంచానికి, వీల్చైర్కు పరిమితమై నెలవారీ రూ.15వేల పింఛన్ పొందుతున్న లబ్ధిదారుల అర్హతను పరీక్షించేందుకు సోమ వారం నుంచి వెరిఫికేషన్ ప్రారంభమైంది. ముగ్గురు వైద్యులు, ఒక డిజిటల్ అసిస్టెంట్తో కూడిన ఐదు బృందాలు ఐదు మండలాల్లో ఈ ప్రక్రియను ప్రారంభించాయి.

మంచానికి, వీల్చైర్కే పరిమితమైన పింఛన్ లబ్ధిదారుల ఇళ్లకు వైద్య బృందాలు
తొలిరోజు 74 మందికి పరీక్షలు
ఒంగోలు నగరం, జనవరి 6 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో మంచానికి, వీల్చైర్కు పరిమితమై నెలవారీ రూ.15వేల పింఛన్ పొందుతున్న లబ్ధిదారుల అర్హతను పరీక్షించేందుకు సోమ వారం నుంచి వెరిఫికేషన్ ప్రారంభమైంది. ముగ్గురు వైద్యులు, ఒక డిజిటల్ అసిస్టెంట్తో కూడిన ఐదు బృందాలు ఐదు మండలాల్లో ఈ ప్రక్రియను ప్రారంభించాయి. ఆరోగ్య పింఛన్ పొందుతున్న లబ్ధిదారుడి ఇంటి వద్దకే వెళ్లి పరీక్షలు నిర్వహించాయి. తొలిరోజు అర్ధవీడులో 17, దోర్నాలలో 12, కొండపిలో 74, ఒంగోలు రూరల్లో ఆరుగురు రాచర్లలో 22 మందిని తనిఖీ చేయాల్సి ఉంది. అయితే 74 మందికే పరీక్షలు పూర్తి చేయగలిగారు. సోమవారం ఉదయం ఒంగోలు మండల పరిషత్ కార్యాలయంలో గుంటూరు నుంచి వచ్చిన వైద్యనిపుణులతో వెలుగు ప్రాజెక్టు డైరెక్టర్ రవికుమార్ సమావేశమయ్యారు. ఆరోగ్య పింఛన్లు పొందుతున్న వారిని పరీక్షించే విషయంలో తగిన సూచనలు, సలహాలు అందజేశారు. అర్హులకు ఎలాంటి పరిస్థితుల్లో అన్యాయం జరగకుండా అనర్హులను గుర్తించాలన్నారు.