ఆరోగ్యశ్రీకి మహర్దశ
ABN , Publish Date - Feb 09 , 2025 | 10:26 PM
టీడీపీ కూటమి పాలనలో ఆరోగ్యశ్రీకి మహర్దశ పట్టిందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. వైద్య రంగానికి ముఖ్యమంత్రి చంద్రబాబు పెద్దపీట వేశారని పేర్కొన్నారు. చీరాల ఎల్బీఎస్ నగర్లో ఆదివారం ఎమ్మెల్యే కొండయ్యతో కలిసి శ్రీ గోరంట్ల సూపర్ స్పెషాలిటీ 100 పడకల హాస్పిటల్ను మంత్రి ప్రారంభించి మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వం ప్రైవేటు ఆసుపత్రులకు ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించకపోవడంతో పేదలకు వైద్య సేవలు అందలేదని విమర్శించారు.

వైద్య రంగానికి సీఎం చంద్రబాబు పెద్దపీట
వైసీపీ పాలనలో వైద్యం అందక మృత్యుఘోష
హాస్పిటల్ ప్రారంభోత్సవంలో మంత్రి గొట్టిపాటి
చీరాలటౌన్, ఫిబ్రవరి9 (ఆంధ్రజ్యోతి) : టీడీపీ కూటమి పాలనలో ఆరోగ్యశ్రీకి మహర్దశ పట్టిందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. వైద్య రంగానికి ముఖ్యమంత్రి చంద్రబాబు పెద్దపీట వేశారని పేర్కొన్నారు. చీరాల ఎల్బీఎస్ నగర్లో ఆదివారం ఎమ్మెల్యే కొండయ్యతో కలిసి శ్రీ గోరంట్ల సూపర్ స్పెషాలిటీ 100 పడకల హాస్పిటల్ను మంత్రి ప్రారంభించి మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వం ప్రైవేటు ఆసుపత్రులకు ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించకపోవడంతో పేదలకు వైద్య సేవలు అందలేదని విమర్శించారు. ఎంతోమంది మృత్యువాత పడ్డారని చెప్పారు. టీడీపీ కూటమి ప్రభుత్వం అందరికీ అండగా ఉంటుందని, ప్రజా సేవలో సాగుతున్న ప్రైవేటు వైద్య సంస్థలకు మద్దతు ఇస్తుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధునిక ఆలోచనలతో వైద్య రంగంలో ప్రాముఖ్యత కలిగిన ఆరోగ్యశ్రీని ముందంజలో ఉంచుతామన్నారు. జిల్లాలో మునుపెన్నడూ లేనివిధంగా 100 పడకల హాస్పిటల్ నిర్మించి 24 గంటలు సేవలందించాలనే ఆలోచన అభినందనీయమని హాస్పిటల్ ప్రతినిధులు డాక్టర్ గోరంట్ల రాజేష్ దంపతులను, సిబ్బందిని ప్రశంసించారు. ఎమ్మె ల్యే కొండయ్య మాట్లాడుతూ ప్రకాశం, బాపట్ల జిల్లాల అభివృద్ధికి మంత్రి గొట్టిపాటి నిరంతరం శ్రమిస్తున్నారని ప్రశంసించారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.