అక్షరం.. పరిష్కారం
ABN , Publish Date - Jan 28 , 2025 | 02:10 AM
ప్రభుత్వానికి, ప్రజలకు మఽధ్య వారధిగా ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా నిలిచేందుకు ఏబీఎన్-ఆంధ్రజ్యోతి చేపట్టిన బృహత్తర కార్యక్రమం మంగళవారం ప్రారంభంకానుంది. అక్షరమే అండ.. ప్రజా సమస్యల పరిష్కారమే అజెండాగా ప్రజల పక్షాన చేపట్టిన ప్రజావేదిక చర్చా కార్యక్రమాలు ఒంగోలు నగరం, మార్కాపురం మునిసిపాలిటీల్లో జరగనున్నాయి.
నేడు ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో సమస్యలపై చర్చా వేదికలు
ఒంగోలు, మార్కాపురంలో నిర్వహణ
పాల్గొననున్న ఎమ్మెల్యేలు, మేయర్, మునిసిపల్ చైర్మన్
కమిషనర్లు, ఇతర అధికారులూ హాజరు
(ఆంధ్రజ్యోతి, ఒంగోలు)
ప్రభుత్వానికి, ప్రజలకు మఽధ్య వారధిగా ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా నిలిచేందుకు ఏబీఎన్-ఆంధ్రజ్యోతి చేపట్టిన బృహత్తర కార్యక్రమం మంగళవారం ప్రారంభంకానుంది. అక్షరమే అండ.. ప్రజా సమస్యల పరిష్కారమే అజెండాగా ప్రజల పక్షాన చేపట్టిన ప్రజావేదిక చర్చా కార్యక్రమాలు ఒంగోలు నగరం, మార్కాపురం మునిసిపాలిటీల్లో జరగనున్నాయి. మార్కాపురం మునిసిపాలిటీలో ఉదయం 8గంటలకు ఎనిమిదో డివిజన్లోని గొర్లగొడ్డ పీర్ల మకానం వద్ద ప్రారంభమవుతుంది. 7, 8 డివిజన్లలో ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ముఖ్య అతిథిగా మునిసిపల్ చైర్మన్ బాలమురళీకృష్ణ, కమిషనర్ నారాయణరావు అతిథులుగా హాజరుకానున్నారు. జిల్లాకేంద్రమైన ఒంగోలులోని 37వ డివిజన్లో సాయంత్రం 4.30 గంటలకు మరో కార్యక్రమం జరగనుంది. ఆ డివిజన్లోని చెన్నకేశవస్వామి లేఅవుట్లో ఉన్న ఎన్టీఆర్ పార్క్లో ఏర్పాటు చేస్తున్న ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ముఖ్యఅతిథిగా పాల్గొననున్నారు. అతిథులుగా మేయర్ గంగాడ సుజాత, కమిషనర్ వెంకటేశ్వరరావు హాజరుకానున్నారు. రెండు ప్రాంతాల్లోనూ వీరితోపాటు అటు కార్పొరేషన్, ఇటు మునిసిపాలిటీ పరిధిలో ముఖ్య విభాగాల అధికారులు, సిబ్బంది, విద్యుత్ శాఖ అధికారులు పాల్గొంటారు. చర్చా కార్యక్రమంలో ప్రజలు తెలియజేసే సమస్యల పరిష్కారంపై ప్రజాప్రతినిధులు, అధికారులు అక్కడికక్కడే స్పందిస్తారు. పరిష్కారానికి అనుగుణమైన సమస్యలపై స్పష్టత ఇస్తారు. పరిష్కారానికి నిర్ణీత కాల పరిమితిని ప్రకటిస్తారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాల్సిన అంశాలు ప్రజల నుంచి వ్యక్తమైతే ఆ బాధ్యతను ఎమ్మెల్యే తీసుకుంటారు. ఈ కార్యక్రమ నిర్వహణ కోసం స్థానిక సమస్య లను తెలుసుకునేందుకు ఆయా డివిజన్లలో ఆంధ్రజ్యోతి బృందం పర్యటించగా ప్రజల నంచి పూర్తిస్థాయి స్పందన వచ్చింది, చర్చా కార్యక్రమానికి హాజరై తమ సమస్యలను వివరిస్తామని తెలిపారు. రెండు ప్రాంతాల్లోనూ కొన్ని సమస్యల పరిష్కారానికి ఈ చర్చా కార్యక్రమాల్లో స్పష్టత రావచ్చన్న అభిప్రాయం ప్రజల నుంచి వ్యక్తమైంది. ఒంగోలు 37వ డివిజన్లోని ఎన్టీఆర్ పార్క్ అభివృద్ధి, డ్రైనేజీ సమస్యతోపాటు కొన్ని దీర్ఘకాలిక రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని సమస్యలను అక్కడ ప్రజలు ప్రధానంగా ప్రస్తావించారు. మార్కాపురంలో చెరువు అలుగు కాలువ అభివృద్ధి, మంచినీటి కుళాయిల ఏర్పాటు, రోడ్ల మరమ్మతులు, వీధిలైట్ల సమస్యలు ప్రధానంగా ప్రజలు ఆంధ్రజ్యోతి బృందానికి తెలిపారు. ఆయా డివిజన్లలో కార్పొరేటర్, కౌన్సిలర్లతోపాటు రాజకీయాలకతీతంగా ప్రజలు, ప్రముఖులు హాజరవుతున్న ఈ కార్యక్రమం ప్రజోపయోగకరంగా ముందుకు సాగే అవకాశం కనిపిస్తుంది.