అప్పుడే ఎండల తీవ్రత
ABN , Publish Date - Feb 05 , 2025 | 01:50 AM
జిల్లాలో ఎండల తీవ్రత పెరిగింది. మంచు, చలి ఉధృతంగా ఉండాల్సిన సమయంలో ఉదయం నుంచే మండుతోంది. నాలుగైదు రోజులుగా జిల్లాలోని అత్యధిక ప్రాంతాల్లో 35 నుంచి 36 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
అత్యధిక ప్రాంతాల్లో 35 నుంచి 36 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు
సాధారణం కన్నా నాలుగైదు డిగ్రీలు అధికం
ఒంగోలు, ఫిబ్రవరి 4 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో ఎండల తీవ్రత పెరిగింది. మంచు, చలి ఉధృతంగా ఉండాల్సిన సమయంలో ఉదయం నుంచే మండుతోంది. నాలుగైదు రోజులుగా జిల్లాలోని అత్యధిక ప్రాంతాల్లో 35 నుంచి 36 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అంతకు మించి నాలుగైదు డిగ్రీలు అధికంగా ఉందన్న స్థాయిలో ఎండ తీవ్రత కనిపిస్తోంది. ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు జిల్లా అంతటా వేడి వాతావరణమే కనిపిస్తోంది. రాత్రికి ఉక్కపోత కూడా పెరిగింది. సాధారణంగా ఈ సమయంలో జిల్లాలో 30 నుంచి 32 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. పగటిపూట కూడా చలి వాతావరణమే ఉంటుంది. అర్ధరాత్రి నుంచి చలితో కూడిన మంచుపడుతూ ఉదయం 9 గంటల వరకూ ఆ ప్రభావం ఉంటుంది. అనంతరం కూడా ఎండ పెద్దగా ఉండదు. శివరాత్రి పండుగ వరకు ఈ తరహా వాతావరణం కొనసాగుతుంది. అనంతరం క్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతుంటాయి. అయితే ఈ ఏడాది అందుకు భిన్నంగా కనిపిస్తోంది. శివరాత్రి ఇంకా 20రోజులు ఉండగా అప్పుడే ఎండల తీవ్రత పెరిగింది.
ఈ వేసవిలో ఎండలు అధికమే..
ఈ వేసవిలో ఎండలు అధికంగా ఉంటాయని వాతావరణశాఖ సంకేతాలు ఇస్తుండగా ఆ ప్రభావం ఇప్పటి నుంచే కనిపిస్తోంది. జిల్లాలోని అత్యధిక ప్రాంతాల్లో ప్రత్యేకించి పశ్చిమప్రాంతంలో నాలుగైదు రోజులుగా మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల వరకు 36 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. ఒక రకంగా రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రాంతాలలో జిల్లా ముందు వరుసలో ఉంటుంది. మంగళవారం కూడా అలాగే ఉంది. మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో రాష్ట్రంలోనే అత్యధికంగా మర్రిపూడి మండలం జువ్విగుంటలో 36డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. సాయంత్రం ఐదు గంటలకు కూడా పెద్దారవీడు మండలంలో 35డిగ్రీలకుపైగా ఉంది. తూర్పుప్రాంతంలోనూ క్రమంగా ఎండలు పెరుగుతున్నాయి. ఒంగోలులో మంగళవారం గరిష్ఠ ఉష్ణోగ్రత 35.10 డిగ్రీలుగా ఉంది. ఇక్కడ ఈనెల 1న 31.7 డిగ్రీలు, 2న 32.7, 3వతేదీన 34.3 నమోదైంది. ఇక మంగళవారం ఏకంగా 35 డిగ్రీలు దాటింది. అలా నాలుగైదు రోజుల్లో నాలుగు డిగ్రీలు పెరిగింది. ఈ సమయంలో ఇలాంటి వాతావరణం ఉండటంతో ఇక వేసవిలో ఏ స్థాయిలో ఎండలు ఉంటాయోనన్న ఆందోళన ప్రజల్లో వ్యక్తమవుతోంది.