పండుగకు వచ్చేదెలా?
ABN , Publish Date - Jan 09 , 2025 | 01:56 AM
సంక్రాంతి ప్రభావంతో రవాణా వ్యవస్థకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. తెలుగు వారు పెద్ద పండుగను సొంతూర్లలో తల్లిదండ్రులు, ఆత్మీయులు, బంధుమిత్రుల మధ్య జరుపుకోవాలని చూస్తారు. ఉద్యోగ, ఉపాధి, చదువుల నిమిత్తం ఎక్కడెక్కడో దూరప్రాంతాల్లోని నగరాలు, పట్టణాల్లో నివసిస్తున్న వారు జిల్లాకు వచ్చేందుకు ప్రయాణ కష్టాలు తప్పడం లేదు.
ముందే నిండిన బస్సుల రిజర్వేషన్
సంక్రాంతికి రవాణా వ్యవస్థకు డిమాండ్
నెల క్రితమే ప్రయాణికుల ప్లానింగ్
ఆర్టీసీ ఆధ్వర్యంలో అదనపు బస్సులు
అయినా ఇంకా అవసరం
రైళ్లలో వెయిటింగ్ లిస్ట్ కూడా కష్టమే
ఒంగోలు కార్పొరేషన్, జనవరి 8 (ఆంధ్రజ్యోతి): సంక్రాంతి ప్రభావంతో రవాణా వ్యవస్థకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. తెలుగు వారు పెద్ద పండుగను సొంతూర్లలో తల్లిదండ్రులు, ఆత్మీయులు, బంధుమిత్రుల మధ్య జరుపుకోవాలని చూస్తారు. ఉద్యోగ, ఉపాధి, చదువుల నిమిత్తం ఎక్కడెక్కడో దూరప్రాంతాల్లోని నగరాలు, పట్టణాల్లో నివసిస్తున్న వారు జిల్లాకు వచ్చేందుకు ప్రయాణ కష్టాలు తప్పడం లేదు. గత పదిహేను రోజుల నుంచి రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు, ప్రైవేటు రవాణా సౌకర్యాలన్నింటిలో రిజర్వేషన్ ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. బుధవారం నుంచి ప్రయాణికుల రద్దీ మరింత పెరిగింది. పైగా ఈనెల 10 నుంచి 19వ తేదీ వరకు విద్యాసంస్థలకు సంక్రాంతి సెలవులు ఇవ్వడంతో వారు ఇంటికి వచ్చేందుకు సిద్ధమయ్యారు. దీంతో అటు ఆర్టీసీ, ఇటు రైల్వేలో రిజర్వేషన్లు ఫుల్ అయ్యాయి. ఇప్పటికే జిల్లా ఆర్టీసీ అధికారులు పండుగను పురస్కరించుకుని264 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయగా, వాటిలో కూడా సీటు దొరికే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో కొందరు ప్రైవేటు ట్రావెల్స్ను ఆశ్రయిస్తున్నారు. ఆర్టీసీ, రైల్వేలో రిజర్వేషన్ లేకపోవడంతో ప్రైవేటు వాహనాల్లో గ్రామాలకు రావాలని భావిస్తున్నారు. ఈనేపథ్యంలో అద్దె కార్లకు డిమాండ్ పెరిగింది. రైళ్లలో రిజర్వేషన్లు లేక, ఆర్టీసీలో ప్రయాణించేందుకు టికెట్లు దొరక్క పండుగకు ఇంటికొచ్చేందుకు ప్రయాణికులు నానా అవస్థలు పడాల్సి వస్తోంది.