Share News

పాలిసెట్‌కు గ్రీన్‌సిగ్నల్‌

ABN , Publish Date - Mar 06 , 2025 | 01:45 AM

ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్‌ కళాశాలల్లో డిప్లమో కోర్సుల్లో ప్రవేశాల కోసం పాలిసెట్‌-2025 నిర్వహణకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఏప్రిల్‌ 30న పరీక్ష జరగనుంది.

పాలిసెట్‌కు గ్రీన్‌సిగ్నల్‌

ఏప్రిల్‌ 30న పరీక్ష

విద్యాశాఖ కార్యదర్శి శశిధర్‌ ఉత్తర్వులు

ఒంగోలు విద్య, మార్చి 5 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్‌ కళాశాలల్లో డిప్లమో కోర్సుల్లో ప్రవేశాల కోసం పాలిసెట్‌-2025 నిర్వహణకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఏప్రిల్‌ 30న పరీక్ష జరగనుంది. పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల్లో కనీసం 1.50 లక్షల మంది పాలిసెట్‌కు దరఖాస్తు చేయడం లక్ష్యంగా నిర్ణయించారు. దరఖాస్తు రిజిస్ట్రేషన్‌ ఫీజు ఓసీ, బీసీలకు రూ.400, ఎస్సీ, ఎస్టీలకు రూ.100గా నిర్ణయించారు. దరఖాస్తులు, పరీక్షల నిర్వహణ ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు రాష్ట్రంలో 69 కోఆర్డినేటింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాలో ఒంగోలు డీఏ ప్రభుత్వ పాలిటెక్నిక్‌, మార్కాపురంలోని శామ్యూల్‌ జార్జి ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ కళాశాలలను కోఆర్డినేషన్‌ సెంటర్లుగా ఎంపిక చేశారు. రిజిస్ట్రేషన్‌ ఫీజును విద్యార్థులు ఆన్‌లైన్‌లో చెల్లించాల్సి ఉంటుంది. పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు రాసిన విద్యార్థులందరూ పాలిసెట్‌ రాసేందుకు అర్హులు.

విద్యార్థులకు ఉచిత శిక్షణ

పాలిసెట్‌కు హాజరయ్యే విద్యార్థు లకు ఒంగోలులోని డీఏ ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రిన్సిపాల్‌ శివప్రసాద్‌ తెలిపారు. ఏప్రిల్‌ 1 నుంచి శిక్షణను ప్రారంభిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఒంగోలు పరిసర ప్రాంతాల విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Updated Date - Mar 06 , 2025 | 01:45 AM