పల్లె పండగ పనుల బిల్లుల చెల్లింపులో తీవ్ర జాప్యం
ABN , Publish Date - Feb 24 , 2025 | 11:23 PM
మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా ప్రభుత్వం గ్రామాలలో పల్లె పండగ పేరుతో పెద్ద ఎత్తున సిమెంట్ రోడ్లు, మురుగు కాలువలు, రైతులకు గోకులం షెడ్లను నిర్మించింది. అధికారులు పనులు చేసిన వెంటనే వారం వారం బిల్లులు చెల్లిస్తామని చెప్పడంతో గ్రామాల్లో టీడీపీ నేతలు, కాంట్రాక్టర్లు లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టి శరవేగంగా పనులు చేపట్టారు. పనులు చేసి నెలలు అవుతున్నా నేటికీ బిల్లులు చెల్లించలేదు.

పలు గ్రామాలలో సీసీ రోడ్లు, మురుగు కాలువలు, గోకులం షెడ్ల నిర్మాణం
నెలలు గడుస్తున్నా అందని డబ్బులు
కాంట్రాక్టర్లు లబోదిబో
బల్లికురవ మండలంలో సుమారు రూ.4 కోట్లతో పనులు
బల్లికురవ, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి) : మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా ప్రభుత్వం గ్రామాలలో పల్లె పండగ పేరుతో పెద్ద ఎత్తున సిమెంట్ రోడ్లు, మురుగు కాలువలు, రైతులకు గోకులం షెడ్లను నిర్మించింది. అధికారులు పనులు చేసిన వెంటనే వారం వారం బిల్లులు చెల్లిస్తామని చెప్పడంతో గ్రామాల్లో టీడీపీ నేతలు, కాంట్రాక్టర్లు లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టి శరవేగంగా పనులు చేపట్టారు. పనులు చేసి నెలలు అవుతున్నా నేటికీ బిల్లులు చెల్లించలేదు. దీంతో వారంతా లబోదిబోమంటున్నారు. అధికారులు దగ్గరుండి నాణ్యతతో సిమెంట్ పనులు చేయించారని, వెంటనే బిల్లులు చెల్లించకపోతే నష్టమని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ప్రతి శుక్రవారం బిల్లుల జమ అవుతాయని చెప్పడంతో వారాలు మారుతున్నా బిల్లులు రావడం లేదని అంటున్నారు.
21 పంచాయతీల్లో పనులు
మండలంలోని 21 గ్రామ పంచాయతీకు ప్రభుత్వం గత ఏడాది అక్టోబరులో పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా సీసీ రోడ్లు, కాలువల నిర్మాణాలకు గాను 39 పనులకు సుమారు రూ.4కోట్ల నిధులను ఉపాధి కింద మంజూరు చేసింది. నవంబరులో వేసిన రోడ్లకు కూడా ఇంత వరకు బిల్లులు చెల్లించలేదు. పనులు చేసిన వారు తీవ్ర నైరాశ్యంలో కూరుకుపోయారు. తాము పనులు చేసిన వెంటనే క్వాలిటీ అధికారుల బృందం కూడా వచ్చి తనిఖీలు చేసిందని, అయినా బిల్లులు రాలేదని పనులు చేసిన వారు చెప్తున్నారు. మండలంలో పాడి రైతులకు 17 గోకులం షెడ్లు కూడా మంజూరు కాగా, కొందరు రైతులు పెట్టుబడులు పెట్టి పూర్తి శాతం పనులు చేశారు. వాటికీ ఇంత వరకు నగదు రాలేదు. ప్రభుత్వం వెంటనే చేసిన పనులకు బిల్లులు చెల్లించేలా చర్యలు చేపట్టాలని కాంట్రాక్టర్లు కోరుతున్నారు.