రూ.200కోట్లతో నగర అభివృద్ధి
ABN , Publish Date - Feb 06 , 2025 | 02:00 AM
నగర అభివృద్ధి కోసం సుమారు రూ. 200 కోట్లు ఖర్చుచేయను న్నట్లు ఒంగోలు శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్ వెల్లడించారు. మరో ఆరునెలల్లో ఒంగోలు రూపురేఖలు మారుస్తామన్నారు.
ఆరు నెలల్లో ఒంగోలుకు కొత్త రూపు
వైసీపీ నిర్లక్ష్యంతోనే మార్కెట్లో పేరుకుపోయిన అద్దె బకాయిలు
ఒంగోలు కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశంలో ఎమ్మెల్యే దామచర్ల
పేర్నమిట్ట చెరువును ఎస్ఎస్ ట్యాంకుగా మార్చాలి : ఎమ్మెల్యే బీఎన్
ఒంగోలు, కార్పొరేషన్, ఫిబ్రవరి 5 (ఆంధ్రజ్యోతి) : నగర అభివృద్ధి కోసం సుమారు రూ. 200 కోట్లు ఖర్చుచేయను న్నట్లు ఒంగోలు శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్ వెల్లడించారు. మరో ఆరునెలల్లో ఒంగోలు రూపురేఖలు మారుస్తామన్నారు. బుధవారం ఒంగోలు నగరపాలక సంస్థ పాలకవర్గ సమావేశం డిప్యూటీ మేయర్ వేమూరి సూర్య నారాయణ (బుజ్జి) అధ్యక్షతన జరిగింది. ఎమ్మెల్యేలు దామచర్ల, బీఎన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జనార్దన్ మాట్లాడుతూ నగర అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నామని తెలిపారు. నిధుల కొరత ఉన్నప్పటికీ అన్ని డివిజన్లలో సమస్యల పరిష్కారానికి కార్పొరేషన్ ఆధ్వర్యంలో వార్డుకో వారం కార్యక్రమాన్ని నిర్వహిస్తు న్నామన్నారు. స్థానికంగా అప్పటికప్పుడే వీలైనంత వరకు సమస్యలను పరిష్కరిస్తు న్నామని తెలిపారు. నగర అభివృద్ధి కోసం ప్రాఽథమికంగా రూ.126 కోట్లతో అధికారులు అంచనాలు వేశారని పేర్కొన్నారు. ఇంకా చేపట్టాల్సిన మరికొన్ని అభివృద్ధి పనులకు మొత్తం రూ.200 కోట్లు అవసరం ఉందని తెలిపారు. ఇప్పటికే రూ.20 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, ఫిబ్రవరి, మార్చిలోమరో రూ.40 కోట్లకు టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ప్రజల అవసరాలను గుర్తించి, ప్రాధాన్యత ప్రకారం డ్రైన్లు, సీసీ రోడ్లు, విద్యుత్ సమస్యల, పారిశుధ్యం మెరుగు, నగరంలో పార్కులు, సెంటర్ డివైడర్ల అభివృద్ధి చేపట్టినట్లు తెలిపారు. రోడ్ల విస్తరణ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ఊరచెరువులోని కొత్త కూరగాయల మార్కెట్ నుంచి రూ.12 కోట్ల అద్దె వసూలు కావాల్సి ఉందన్నారు. గత ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే ఇంత పెద్దమొత్తంలో బకాయిలు పేరుకుపోయాయని దామచర్ల విమర్శించారు. డ్రైన్ల నిర్మాణంలో ఆక్రమణలు ఉంటే తొలగిస్తారని పేర్కొన్నారు. పారిశుధ్యం మెరుగుతోపాటు ప్రజలకు ప్రతిరోజు తాగునీరు ఇవ్వడానికి అసవరమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అమృత్ -1 కింద రూ.126 కోట్లతో గుండ్లకమ్మ నుంచి పైపులైను వేయగా, సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్లకు నీరు వస్తుందన్నారు. అమృత్-2 మరో రెండేళ్లలో రామతీర్థం నుంచి నీరు తీసుకొచ్చి తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపనున్నట్లు తెలిపారు. సంతనూతలపాడు ఎమ్మెల్యే బీఎన్. విజయ్కుమార్ మాట్లాడుతూ నగర పరిధిలోని పేర్నమిట్ట అభివృద్ధికి కృషిచేస్తున్నానని తెలిపారు. పేర్నమిట్ట చెరువును ఎస్ఎస్ ట్యాంకుగా మార్చాలని కోరారు. అక్కడ పారిశుధ్యం మెరుగుపరచాలన్నారు. అవసరమైన సీసీ రోడ్లు, కాలువలు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు బీఎన్ తెలిపారు. డిప్యూటీ మేయర్ వేమూరి వెంకటసూర్యనారాయణ మాట్లాడుతూ.. ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, అధికారుల సమన్వయంతో కౌన్సిల్ అజెండాలో చర్చించి ఆమోదం పొందిన పనులను త్వరలోనే చేపడతామన్నారు. కమిషనర్ డాక్టర్ కోడూరు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఒంగోలును ప్లాస్టిక్ రహిత నగరంగా మార్చుతామని, ఇందుకు ప్రజలు సహకరించాలని కోరారు.