Roadshow: ప్రధాని సభ సక్సెస్
ABN , Publish Date - Jan 09 , 2025 | 04:02 AM
కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత తొలిసారి రాష్ట్రానికి వచ్చిన ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఉత్తరాంధ్ర ప్రజలు నీరాజనం పలికారు.
విశాఖపట్నం, జనవరి 8 (ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత తొలిసారి రాష్ట్రానికి వచ్చిన ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఉత్తరాంధ్ర ప్రజలు నీరాజనం పలికారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ఏర్పాటుచేసిన సభా ప్రాంగణంలో గ్యాలరీలు నిండిపోయాయి. ఎదురుగా ఉన్న మరో మైదానం కూడా కిక్కిరిసింది. అయినా.. స్థలం చాలక జనాలు ప్రాంగణం బయట ఉండిపోయారు. సభ సాయంత్రం 5.30 గంటలకు ప్రారంభమైంది. అంతకుముందు ప్రధాని నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఓపెన్టాప్ వాహనంపై నగరంలో రోడ్షో నిర్వహించారు. అదే వాహనంపై సభా వేదిక వద్దకు చేరుకున్నారు. ఈ సమయంలో నేతలపై సభికులు పూలవర్షం కురిపించారు. ప్రధాని ఉత్సాహంగా ఇరువైపులా ఉన్న జనాలకు చేతులు ఊపుతూ సభా వేదిక వెనుక ఉన్న గ్రీన్రూమ్కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ప్రాంగణమంతా మోదీ నామస్మరణతో మార్మోగిపోయింది. సభలో ప్రధాని 12 నిమిషాలే ప్రసంగించారు. ఆయన ప్రసంగాన్ని కేంద్ర మంత్రి రామ్మోహన్నాయుడు అనువదించారు. ప్రసంగం ప్రారంభంలో మోదీ తెలుగులో మాట్లాడారు. ఎక్కడా రాజకీయాల ప్రస్తావన లేకుండా కేవలం అభివృద్ధి, భవిష్యత్తు ప్రణాళికలు, టెక్నాలజీలో ఏపీ గొప్పతనం గురించి మాత్రమే ప్రధాని మాట్లాడారు. రూ. 2 లక్షల కోట్లు విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ప్రసంగ ప్రారంభంలోనే చంద్రబాబు, పవన్కల్యాణ్లను పొగిడిన మోదీ...ఏపీని అన్ని విధాలా ఆదుకుంటామని, అండగా ఉంటామని చెప్పడంతో సభ చప్పట్లతో మార్మోగింది. ప్రధానికి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి శ్రీమహా విష్ణువు చిత్రపటం, అరకు కాఫీని బహూకరించారు.