Srisailam Dam: శ్రీశైలం జలాశయం సమీపాన మరో జల విద్యుత్కేంద్రం
ABN , Publish Date - May 23 , 2025 | 05:53 AM
శ్రీశైలం డ్యామ్ ప్లంజ్పూల్ వద్ద ఏర్పడిన గొయ్యి వల్ల నష్టం తక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు. భవిష్యత్లో ప్రమాదాలను నివారించేందుకు మరో జలవిద్యుత్ కేంద్రం నిర్మించాలని సూచించారు.
యాప్రాన్ వద్ద కడితే ‘ప్లంజ్పూల్’ ముప్పుండదు
సీడబ్ల్యూపీఆర్ఎస్ శాస్త్రవేత్తల సూచన
అమరావతి, మే 22 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలం రిజర్వాయరు యాప్రాన్కు సమీపంలో ఇంకో జల విద్యుత్కేంద్రాన్ని నిర్మిస్తే ప్లంజ్పూల్ వద్ద ఏర్పడిన భారీ గొయ్యి వల్ల కలిగే నష్టాన్ని నివారించవచ్చని కేంద్ర జల-విద్యుత్ పరిశోధనా సంస్థ (సీడబ్ల్యూపీఆర్ఎస్) శాస్త్రవేత్తలు తెలిపారు. శ్రీశైలం డ్యాంలో ఏర్పడిన గుంతలు, దెబ్బతిన్న స్టీల్ సిలెండర్లు, గ్యాలరీ లీకేజీలు, యాప్రాన్కు జరిగిన నష్టం, టెయిలెండ్ వద్ద నిర్మించిన ఆనకట్ట, విద్యుత్కేంద్రం కుంగిపోవడం.. ప్లంజ్పూల్ స్థితిగతులపై వారు గత మూడ్రోజుల పాటు అధ్యయనం చేశారు. గురువారం శ్రీభ్రమరాంబికా సమేత మల్లికార్జునస్వామిని దర్శించుకున్నాక పుణేకు పయనమయ్యారు. ప్లంజ్పూల్ వద్ద ఏర్పడిన భారీ గొయ్యి వల్ల నష్టం జరిగే అవకాశాలు తక్కువగా ఉన్నాయంటూనే.. జల విద్యుత్కేంద్రం నిర్మిస్తే నష్టాన్ని నివారించవచ్చని వారు ఈ సందర్భంగా జలవనరుల శాఖకు తెలిపారు. జూన్ మొదటివారంలో మళ్లీ వస్తామని.. ఆలోగా తాము సూచించిన డజను పరీక్షలు నిర్వహించాలని స్పష్టం చేశారు. జియోఫిజికల్ సర్వే కోసం యాప్రాన్కు రంధ్రాలు చేయాలని.. అలా చేసినప్పుడు వచ్చిన శబ్దాల ఆధారంగా దాని పటిష్ఠత తెలుసుకోవచ్చని చెప్పారు. అదేవిధంగా స్పిల్వే చానల్కు ముందు భాగాన నీరు నిలబడకుండా రాతి మట్టాలు ఉండడం డ్యాంకు ఏమాత్రం మంచిది కాదన్నారు. గ్యాలరీల్లోనూ. అండర్ గ్రౌండ్ వాటర్లోనూ పరిశోధనలు చేయాలని.. దీనిద్వారా డ్యాం పునాదుల్లోకి నీరు ఏ మేరకు చేరిందో గుర్తించవచ్చని తెలిపారు. దేశంలోని ఇతర భారీ ప్రాజెక్టులతో పోల్చుకుంటే.. శ్రీశైలం జలాశయం చాలా పటిష్ఠంగా ఉందన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
భారత రాయబార కార్యాలయ సిబ్బందిని బహిష్కరించిన పాక్
For National News And Telugu News