Nara Lokesh: పెట్టుబడుల కోసం పోటీ పడతాం
ABN , Publish Date - Jul 20 , 2025 | 03:40 AM
వికసిత్ భారత్లో భాగంగా 2047నాటికి 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించాలన్నది ప్రధాని మోదీ ఆకాంక్ష అయితే, అందులో 2.4 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ సాధించాలన్నది ఆంధ్రప్రదేశ్ లక్ష్యమని...
ఆర్థికాభివృద్ధిలో సీఏలూ భాగం కావాలి
జనవరిలో క్వాంటమ్ వ్యాలీ ప్రారంభం
ఐసీఏఐ స్ఫూర్తి మెగా కాన్ఫరెన్స్లో లోకేశ్ వెల్లడి
‘‘కర్ణాటకకు బెంగళూరు ఉంది, తెలంగాణకు హైదరాబాద్, తమిళనాడుకు చెన్నై ఉంది. మరి ఆంధ్రప్రదేశ్కు ఏముందని అడుగుతున్నారు. అలాంటివారికి నా సమాధానం ఒకటే.. మాకు చంద్రబాబు బ్రాండ్ ఉంది. రాష్ట్రానికి అనేక కంపెనీలు వస్తున్నాయంటే ఈ బ్రాండే కారణం అని చెబుతాను.’’
- మంత్రి లోకేశ్
గుంటూరు, జూలై 19 (ఆంధ్రజ్యోతి): వికసిత్ భారత్లో భాగంగా 2047నాటికి 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించాలన్నది ప్రధాని మోదీ ఆకాంక్ష అయితే, అందులో 2.4 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ సాధించాలన్నది ఆంధ్రప్రదేశ్ లక్ష్యమని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ అన్నారు. ఇది కఠినమైనప్పటికీ అసాధ్యం కాదని పేర్కొన్నారు. శనివారం ఐసీఏఐ (ద ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఛార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా) గుంటూరు చాప్టర్ ఆధ్వర్యంలో ‘స్ఫూర్తి’ పేరుతో నిర్వహించిన మెగా సీఏ విద్యార్థుల సమావేశంలో లోకేశ్ కీలకోపన్యాసం చేశారు. దేశ ఆర్థికాభివృద్ధిలో ఏపీ ప్రస్తుత వాటా 4.85 శాతం కాగా, 2047 నాటికి 6.67 శాతానికి ఉండాలన్నది ప్రభుత్వ లక్ష్యమన్నారు. గతంలో 10 నుంచి 12 శాతం వరకు వృద్ధి రేటు సాధించిన మనం, నిర్ణీత లక్ష్యాన్ని చేరుకోవడానికి భవిష్యత్లో 15 శాతం వరకు వృద్ధి రేటు సాధించాల్సి ఉంటుందని వివరించారు. ఈ లక్ష్యసాధనలో చార్టర్డ్ అకౌంటెంట్లు కీలకపాత్ర వహించాల్సి ఉందని పిలుపునిచ్చారు. ప్రతి బ్యాలెన్స్ షీట్ వెనుక ఒక ప్రతిభ కలిగిన మేథస్సు ఉంటుందని, దాని పేరే చార్టర్డ్ అకౌంటెంట్ అని వ్యాఖ్యానించారు. ఐసీఏఐ ద్వారా 10 లక్షల మందికి పైగా సీఏ విద్యను అభ్యసిస్తుండగా, ఏటా 2 లక్షల మంది పరీక్షలు రాస్తున్నారన్నారు. తాను చార్టర్డ్ అకౌంటెంట్ కాకపోయినా స్టాన్ఫర్డ్లో ఎంబీఏ గ్రాడ్యుయేట్గా సీఏ ప్రాధాన్యం గురించి తనకు తెలుసునని ఆయన అన్నారు. కాగా, దక్షిణ ఆసియాలోనే మొట్టమొదటి క్వాంటమ్ వ్యాలీ జనవరిలో అమరావతిలో ప్రారంభం కాబోతున్నదని తెలిపారు.
గతంలో జన్మభూమి, స్వయం సహాయక సంఘాలు, ఈ-గవర్నెన్స్, ఐటీ హబ్లతో రాష్ట్ర చిత్రపటాన్ని మార్చేసిన సీఎం చంద్రబాబు ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీతో ఏపీ రూపురేఖలు మార్చబోతున్నారన్నారు. చంద్రబాబు నుంచి తాను స్ఫూర్తిని పొందుతానని, 75 ఏళ్ల వయసులోను పాతికేళ్ల యువకుడిలా ఆయన పని చేస్తున్నారన్నారు. ‘‘నేటి ప్రపంచంలో ఐక్యూ(ఇంటెలిజెంట్ కోషెంట్), ఈక్యూ(ఎమోషనల్ కోషెంట్) మంచివి. ఇదే సమయంలో టిక్యూ(టెక్ కోషెంట్) కూడా తప్పనిసరి. పదునుగా, నైతికంగా, తాజాగా ఉండండి. సీఎలు పాలనా వ్యవస్థలోకి వస్తే అవినీతిని రూపుమాపడం సులభతరమవుతుంది.’’ అని లోకేశ్ అన్నారు. ఈ సమావేశంలో ఐసీఏఐ వైస్ ప్రెసిడెంట్ డీ ప్రసన్నకుమార్, సదరన్ ఇండియా రీజనల్ కౌన్సిల్ (ఎస్ఐఆర్సీ) వైస్ చైర్మన్ ముప్పాళ్ల సుబ్బారావు, గుంటూరు బ్రాంచి చైర్మన్ ఎన్ రాజశేఖర్ తదితర అధికారులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
బాబు బ్రాండ్ వల్లే ఏపీకి పెట్టుబడులు
ప్రతి సిటీ డిజిటల్ గ్రోత్ ఇంజిన్గా ఎదగాలి: లోకేశ్
రాష్ట్రంలో ప్రతి నగరం డిజిటల్ గ్రోత్ ఇంజిన్గా ఎదగాలని మంత్రి నారా లోకేష్ ఆకాంక్షించారు. సీఎం చంద్రబాబు బ్రాండ్ వల్లే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయన్నారు. ఎక్లాట్ హెల్త్ సొల్యూషన్స్ (ఈసీఎల్ఏటీ) గన్నవరం సమీపంలోని కేసరపల్లి మేధా టవర్లో ఏర్పాటుచేసిన కార్యాలయాన్ని శనివారం లోకేశ్ ప్రారంభించారు. ‘‘జీడి నెల్లూరులో యువగళం పాదయాత్ర చేస్తున్నప్పుడు బడ్డీకొట్టు నడుపుకునే ఓ మహిళను కలిశాను. తన భర్త మద్యానికి బానిసై చనిపోయాడని, ఇద్దరు పిల్లలను కష్టపడి చదివిస్తున్నారని ఆమె చెప్పారు. ప్రభుత్వం ఏం చేయాలని కోరుకుంటున్నారని అడగ్గా, చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు కల్పించాలని ఆమె కోరారు. ఆమె మాటల స్ఫూర్తితోనే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చాం.’’ అని లోకేశ్ వివరించారు. ఈ కార్యక్రమంలో ఎక్లాట్ హెల్త్ సొల్యూషన్స్ సంస్థ వ్యవస్థాపకులు, సీఈవో కార్తీక్ పొల్సాని, సీవోవో ేస్నహ పొల్సాని, ఇండియా వైస్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ గుర్రం, మోహిత్ శ్రీవాస్తవ, విజయవాడ బ్రాంచ్ డీజీఎం సురేశ్రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రభుత్వ బడుల్లో నో వేకెన్సీ పరిస్థితి తేవాలి
Read latest AP News And Telugu News