Nara Bhuvaneshwari: తలసేమియా బాధితులకు అండగా ఉంటాం
ABN , Publish Date - Jul 20 , 2025 | 04:16 AM
తలసేమియా సమస్యతో బాధపడుతున్న చిన్నారులకు అండగా ఉండేందుకే తలసేమియా రన్ నిర్వహించామని ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ, ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి చెప్పారు.
ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి
విశాఖ బీచ్ రోడ్డులో తలసేమియా రన్ నిర్వహణ
విశాఖపట్నం, జూలై 19(ఆంధ్రజ్యోతి): తలసేమియా సమస్యతో బాధపడుతున్న చిన్నారులకు అండగా ఉండేందుకే తలసేమియా రన్ నిర్వహించామని ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ, ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి చెప్పారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శనివారం మాజీ వెయిట్ లిఫ్టర్ కరణం మల్లీశ్వరి, ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ తమన్తో కలిసి విశాఖ ఆర్కే బీచ్రోడ్డులో ఆమె జెండా ఊపి 10కే, 5కే, 3కే రన్ను ప్రారంభించారు. అనంతరం విజేతలకు ఆమె బహుమతులు అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంకుకు చిన్నారులతో వచ్చిన కొందరు తల్లులు.. బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేయించగలరా? అని అడగడంతో.. వారి కోసం ఏదైనా చేయాలనే నిర్ణయంతో తలసేమియా రన్ నిర్వహిస్తున్నట్టు చెప్పారు. తలసేమియాతో బాధపడుతున్న చిన్నారులకు బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేయించడంతోపాటు ఫిల్టర్స్, ఆరు వేల రూపాయల విలువజేసే మందులు అందిస్తున్నామన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఇప్పటివరకూ ఎనిమిది లక్షల మందికి రక్తాన్ని అందించామని, 15 వేల ఆరోగ్య శిబిరాలు నిర్వహించామని చెప్పారు. కరణం మల్లీశ్వరి మాట్లాడుతూ తలసేమియా బాధిత చిన్నారుల కోసం ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం గొప్ప విషయమన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మాట్లాడుతూ ఇటువంటి గొప్ప కార్యక్రమంలో భాగస్వామిగా నిలవడం ఆనందంగా ఉందన్నారు. అనంతరం మ్యూజికల్ నైట్ నిర్వహించారు. కార్యక్రమంలో హోంమంత్రి వంగలపూడి అనిత, ఎన్టీఆర్ ట్రస్ట్ సీఈవో రాజేంద్రకుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రభుత్వ బడుల్లో నో వేకెన్సీ పరిస్థితి తేవాలి
Read latest AP News And Telugu News