Pithapuram: అమ్మ అమ్మమ్మలే యశ్విత హంతకులు
ABN , Publish Date - May 13 , 2025 | 04:47 AM
పిఠాపురం పట్టణంలో ఐదు నెలల చిన్నారిని అత్తవారింటికి తీసుకెళ్లకపోవడం, రెండో పెళ్లి చేసుకోవాలనుకున్న కారణంగా కన్నతల్లి మరియు అమ్మమ్మ కలిసి చిన్నారిని గొంతునులిమి హత్య చేసినట్టు పోలీసుల విచారణలో తేలింది. ఇద్దరినీ అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు.
రెండో పెళ్లికి అడ్డుగా ఉందని గొంతు నులిమి బావిలో పడేశారు
పోలీసుల విచారణలో వెల్లడి
పిఠాపురం, మే 12 (ఆంధ్రజ్యోతి): రెండో పెళ్లి చేసుకునేందుకు అడ్డుగా ఉందని ఐదునెలల పసికందును తల్లి సాయంతో హతమార్చింది కన్నతల్లి. కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణంలోని జగ్గయ్యచెరువు కాలనీలో ఈ నెల 6వ తేదీ అర్ధరాత్రి సమయంలో ఐదు నెలల చిన్నారి యశ్వితను గొంతునులిమి హత్య చేసి ఇంటి వెనుక భాగంలో ఉన్న నూతిలో పడవేసిన వైనం తెలిసిందే. ఈ చిన్నారి హత్య కేసులో కన్న తల్లి, అమ్మమ్మే హంతకులుగా తేలింది. చిన్నారిని గొంతు నులిమి హత్య చేసినట్టు విచారణలో వెల్లడి కాగా వారిద్దరినీ అరెస్టు చేసినట్టు పిఠాపురం సీఐ జి.శ్రీనివాస్, పట్టణ ఎస్ఐ మణికుమార్ సోమవారం మీడియాకు వెల్లడించారు.
పసుపులేటి శైలజ, పిఠాపురం మండలం నరసింగపురం గ్రామానికి చెందిన పెదపాటి సతీష్ పెద్దలకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకోగా ఐదు నెలల క్రితం యశ్విత జన్మించింది. పెళ్లయిన నాటి నుంచీ తనను అత్తవారింటికి తీసుకువెళ్లకపోవడం, పాప పుట్టిన తర్వాత భర్త బంధువులు ఎవరూ చూడ్డానికి రాకపోవడం నేపథ్యంలో తన తల్లిదండ్రులు చెప్పినట్టు మేనత్త కొడుకుని వివాహం చేసుకుంటే బాగుండేదని శైలజ భావించింది. ఇందుకు చిన్నారి అడ్డుగా ఉందని, అడ్డు తొలగిస్తే రెండో పెళ్లి చేసుకోవచ్చనే ఉద్దేశంతో శైలజ, తల్లి అన్నవరం కలిసి చిన్నారిని హత్య చేసినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఇద్దరినీ అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసులో ఇతర కుటుంబసభ్యుల పాత్రపై లోతుగా విచారణ జరుపుతున్నామని సీఐ చెప్పారు.
ఇవి కూడా చదవండి..
పాక్ ఎయిర్ బేస్ల ధ్వంసం.. వీడియోలు విడుదల
పాక్ దాడులను సమర్థంగా తిప్పికొట్టాం: ఎయిర్ మార్షల్ ఎ.కె. భార్తీ
For AndhraPradesh News And Telugu News