Share News

Liquor Scam Case: మిథున్‌రెడ్డి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా

ABN , Publish Date - May 30 , 2025 | 04:18 AM

మద్యం కుంభకోణంలో వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు రెండు వారాలకు వాయిదా వేశింది. సీఐడీ తరఫున వాదనలు సమర్పించేందుకు సమయం ఇచ్చారు.

 Liquor Scam Case: మిథున్‌రెడ్డి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా

అమరావతి, మే 29(ఆంధ్రజ్యోతి): మద్యం కుంభకోణం వ్యవహారంలో సీఐడీ నమోదుచేసిన కేసులో ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ గురువారం హైకోర్టులో విచారణకు వచ్చింది. సీఐడీ తరఫున సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ్‌ లూథ్రా వాదనలు వినిపిస్తూ.. కుంభకోణంలో పిటిషనర్‌ పాత్రపై సవివరంగా కౌంటర్‌ దాఖలు చేస్తామన్నారు. సోమవారంలోగా కౌంటర్‌ వేస్తామని, ఈ పిటిషన్‌పై వచ్చేవారం విచారణ జరపాలని అభ్యర్థించారు. మిథున్‌రెడ్డి తరఫున సీనియర్‌ న్యాయవాది టీ నిరంజన్‌రెడ్డి స్పందిస్తూ.. ప్రాసిక్యూషన్‌ కౌంటర్‌ వేసిన అనంతరం రిప్లై కౌంటర్‌ వేసేందుకు సమయం ఇవ్వాలని కోరారు. వ్యాజ్యంపై విచారణను రెండు వారాలకు వాయిదా వేయాలని కోరారు. ఇరువైపుల వాదనలు పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌ హరినాథ్‌ కౌంటర్‌ దాఖలు చేసేందుకు ప్రాసిక్యూషన్‌కు సమయమిస్తూ ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణను జూన్‌ 12వ తేదీకి వాయిదా వేశారు.

Updated Date - May 30 , 2025 | 04:20 AM