Minister N. Manohar : జగన్ హయాంలో 3 వేల మంది కౌలు రైతుల ఆత్మహత్య
ABN , Publish Date - Feb 23 , 2025 | 05:06 AM
రైతులు ఆత్మహత్య చేసుకుంటే జగన్మోహన్రెడ్డి పట్టించుకున్న పాపాన పోలేదని మంత్రి నాదెండ్ల మనోహర్ విమర్శించారు.

వారి కోసం కూటమి ప్రభుత్వంలో కొత్త చట్టం: మంత్రి నాదెండ్ల
సంగం, ఫిబ్రవరి 22(ఆంధ్రజ్యోతి): గత వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో మూడు వేల మంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకుంటే జగన్మోహన్రెడ్డి పట్టించుకున్న పాపాన పోలేదని మంత్రి నాదెండ్ల మనోహర్ విమర్శించారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెం, సంగంలో శనివారం మంత్రి ఆనం రామనారాయణరెడ్డితో కలిసి ఆయన పర్యటించారు. సంగం పీఏసీఎ్సలో రూ.20.5 కోట్లతో నిర్మించిన గోదాము భవనం, ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంత్రి మనోహర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ‘జగన్ ఓడిపోయిన తరువాత సోషల్ మీడియాలో కూటమి ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారు. కౌలు రైతుల కోసం కూటమి ప్రభుత్వం త్వరలో కొత్త చట్టం తీసుకురానుంది. తేమ శాతం విషయంలో రైతులు, మిల్లర్ల నుంచి ఎదుర్కొనే సమస్యకు ఓ పరిష్కారాన్ని ఎంచుకున్నాం. వచ్చే ఖరీఫ్ సీజన్కు మిల్లర్లు, రైతు సేవా కేంద్రాల్లో తేమ శాతం నిర్ధారించే ఒకే బ్రాండ్ యంత్రాలను తెచ్చి వాటిని తూనిక, కొలతల శాఖ అధికారులే నిర్వహించేలా చర్యలు చేపడుతున్నాం. ధాన్యం ఆరబోసుకునేందుకు రైతులకు రాష్ట్రవ్యాప్తంగా ఉపాధి నిధులతో అందుబాటులో ఉన్న ప్రభుత్వ స్థలాల్లో ప్లాట్ఫారాల ఏర్పాటుకు సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు’ అని మంత్రి తెలిపారు. ఈ పర్యటనలో నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ హజీజ్, టిడ్కో చైర్మన్ అజయ్ కుమార్ పాల్గొన్నారు.