Minister N. Manohar : తెల్ల రేషన్ కార్డులపై సర్వే చేయాలి
ABN , Publish Date - Mar 05 , 2025 | 04:29 AM
పేదలకు సంక్షేమ పథకాలు అందించాలనే లక్ష్యంతోనే ప్రభుత్వం రేషన్ కార్డులు అందిస్తున్నదని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు.

కుటుంబాలు 1.5 కోట్లు.. కార్డులు 1.42 కోట్లు
ఇదెలా సాధ్యం?: బీజేపీ ఎమ్మెల్యేలు
అమరావతి, మార్చి 4(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని పేదలకు సంక్షేమ పథకాలు అందించాలనే లక్ష్యంతోనే ప్రభుత్వం రేషన్ కార్డులు అందిస్తున్నదని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యేలు విష్ణుకుమార్రాజు, ఈశ్వరరావు, పార్థసారథి, సుజనాచౌదరి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. తొలుత ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో కోటి 50లక్షల కుటుంబాలు ఉంటే దాదాపు కోటి 42 లక్షల కుటుంబాలకు తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయని, ఈ లెక్కన 8 లక్షల కుటుంబాలు మాత్రమే మధ్య, పైతరగతి వాళ్లు అన్న విషయం తెలుస్తోందన్నారు. తెల్ల రేషన్ కార్డులపై సర్వే చేసి, అర్హులైనవారికే కార్డులు ఇవ్వాలని విష్ణుకుమార్రాజు కోరారు. మంత్రి మనోహర్ సమాధానమిస్తూ.. రాష్ట్రంలోని దాదాపు 91 శాతం మంది ప్రజలకు రేషన్ కార్డులు ఉన్నాయన్నారు. ప్రస్తుతం ఈకేవైసీ నిర్వహిస్తున్నందున కొత్త కార్డుల పంపిణీ, ఉన్న కార్డుల విభజన చేయడం లేదన్నారు.