Liquor Scam: మద్యం ముడుపులతో ఓట్ల కొనుగోలు
ABN , Publish Date - Jun 05 , 2025 | 05:01 AM
మద్యం స్కామ్పై ఇప్పటిదాకా నెలకొన్న బలమైన అనుమానాలివి! ఇది అక్షరాలా నిజమని నిరూపించే తిరుగులేని ఆధారాలను ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) సేకరించింది. ఎన్నికల ముందు ఇద్దరు వైసీపీ ఎంపీ అభ్యర్థులకు హైదరాబాద్ నుంచి ముడుపుల మూటలు చేరవేసినట్లు తేల్చింది.
ఓట్లకు కోట్లు..
వైసీపీ ఎంపీ అభ్యర్థులకు లిక్కర్ కమీషన్ సొమ్ములు
‘సిట్’ దర్యాప్తులో వెలుగులోకి కీలక విషయాలు
ఇద్దరు అభ్యర్థులకు ముడుపులపై కీలక ఆధారాలు
హైదరాబాద్ నుంచి సూర్యాపేట దాకా తరలింపు
అక్కడి నుంచి కార్లలో మార్చి.. నియోజకవర్గాలకు
తెచ్చి ఇచ్చింది.. రాజ్ కసిరెడ్డి డ్రైవర్, సహాయకుడు
తీసుకున్నది ఒక ఎంపీ అభ్యర్థి గన్మ్యాన్, మరో
అభ్యర్థి డ్రైవర్.. వారి నుంచి వివరాలు రాబట్టిన సిట్
ఈసీకి పట్టుబడ్డ రూ.8 కోట్లు ఈ ఖాతాలోవే
ఆ ఇద్దరు నేతలనూ విచారణకు పిలిచే అవకాశం
(అమరావతి - ఆంధ్రజ్యోతి)
ముడుపులు రాబట్టాలి... మళ్లీ గెలవాలి! లిక్కర్ కిక్కులో వచ్చిన సొమ్ములను ఎన్నికల ఖర్చులకు వాడాలి!... మద్యం స్కామ్పై ఇప్పటిదాకా నెలకొన్న బలమైన అనుమానాలివి! ఇది అక్షరాలా నిజమని నిరూపించే తిరుగులేని ఆధారాలను ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) సేకరించింది. ఎన్నికల ముందు ఇద్దరు వైసీపీ ఎంపీ అభ్యర్థులకు హైదరాబాద్ నుంచి ముడుపుల మూటలు చేరవేసినట్లు తేల్చింది. ఆ ఇద్దరు... అంతకుముందు ఎమ్మెల్యేగా ఉండి 2024 ఎన్నికల్లో వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన వారొకరు... సిట్టింగ్ ఎంపీగా ఉండి, మరోసారి ఎంపీగా బరిలో నిలిచిన వారొకరు! వీరిద్దరికీ డబ్బులు చేరిన ‘దారుల’ను సిట్ గుర్తించింది. హైదరాబాద్ నుంచి డబ్బుల సంచులు తీసుకొచ్చిన వారిలో కొందరిని ‘సిట్’ అధికారులు ప్రశ్నించి కీలక సమాచారాన్ని రాబట్టారు. ఒక ఎంపీ అభ్యర్థి తరఫున ఆయన గన్మ్యాన్, మరో అభ్యర్థి కోసం ఆయన డ్రైవర్ ‘ఫండ్’ అందుకున్నట్లు నిర్ధారించుకున్నారు. అప్పటికే ఎంపీగా ఉన్న ఒక అభ్యర్థి స్వయంగా వాహనంలో వెళ్లి ముడుపులు తీసుకున్నట్లు తెలిసింది. ఈ డబ్బులు ఇచ్చింది మరెవరో కాదు! లిక్కర్ స్కామ్లో కీలక నిందితుడు రాజ్ కసిరెడ్డి డ్రైవర్, వ్యక్తిగత సహాయకుడే! ఇందులో గన్మ్యాన్ పేరు... గిరి. ఆయనది శ్రీకాకుళం జిల్లా. ఆయనతోపాటు మరో ఎంపీ అభ్యర్థి డ్రైవర్, రాజ్ కసిరెడ్డి డ్రైవర్ శ్రీకాంత్, సహాయకుడు రజనీకాంత్ను కూడా ‘సిట్’ అధికారులు ప్రశ్నించారు. తాము తరచూ హైదరాబాద్ నుంచి సూర్యాపేట వరకూ అట్టపెట్టెలు, సంచుల్లో డబ్బు తీసుకొచ్చి... ‘ఇవ్వాల్సిన వాళ్లకు ఇచ్చి’ వెనక్కి వెళ్లిపోయినట్లు అంగీకరించినట్లు తెలిసింది. డబ్బులు పుచ్చుకున్న గన్మ్యాన్ గిరి, మరో అభ్యర్థి డ్రైవర్తోపాటు... రాజ్ కసిరెడ్డి డ్రైవర్ను సిట్ అధికారులు ఇటీవల ప్రశ్నించినట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం... ‘‘నన్ను వాహనానికి రక్షణగా మాత్రమే పంపించారు. డబ్బులు తెచ్చిన మాట వాస్తవం. కానీ... ఎంతుందో నాకు తెలియదు’’ అని గన్మ్యాన్ గిరి చెప్పారు. మరో ఎంపీ అభ్యర్థి డ్రైవర్... రాజ్ కసిరెడ్డి డ్రైవర్ నుంచి రూ.3.50 కోట్లు అందినట్లు అంగీకరించారు. తెలంగాణలోని సూర్యాపేటలో ఈ ముడుపులు చేతులు మారినట్లు వెల్లడైంది. కోర్టు అనుమతితో ఆ ఇద్దరు వైసీపీ నేతలను కూడా విచారించే అవకాశం ఉంది.
పథకం ప్రకారం కానిస్టేబుల్ ద్వారా...
శ్రీకాకుళం జిల్లాకు చెందిన గిరి అనే ఏఆర్ కానిస్టేబుల్ను ఇటీవల సిట్ అధికారులు ప్రశ్నించారు. ఆయన... 2019 వరకు కీలక వైసీపీ ఎమ్మెల్యే వద్ద గన్మ్యాన్గా పని చేశారు. తాజా ఎన్నికల్లో ఆ ఎమ్మెల్యేను జగన్ ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిపారు. టీడీపీ నుంచి ఆర్థికంగా బలమైన అభ్యర్థి బరిలో ఉండటంతో... హైదరాబాద్ నుంచి పలుమార్లు డబ్బులు తెప్పించారు. ప్రతిసారీ ఎంపీ అభ్యర్థి గన్మ్యాన్గా ఉన్న ఏఆర్ కానిస్టేబుల్ గిరి ఆ వాహనంలో ఉన్నట్లు తేలింది. వాహనంలో పోలీసులు ఉంటే... ప్రత్యేకంగా తనిఖీలు ఉండవనే ఆలోచనతోనే ఇలా చేశారు. అయినప్పటికీ... అప్పట్లో ఎన్నికల కమిషన్ రూ.8 కోట్లకు పైగా నగదు పట్టుకుంది. ఆ డబ్బులు ఎవరిచ్చారు?ఎక్కడి నుంచి తీసుకొచ్చారు.? ఎన్నిసార్లు హైదరాబాద్ నుంచి తెచ్చారు? డబ్బులకు రక్షణగా ఎన్నిసార్లు వెళ్లారు? అని ఏఆర్ కానిస్టేబుల్ గిరిని సిట్ అధికారులు సుదీర్ఘంగా ప్రశ్నించారు. పలుమార్లు డబ్బులు తీసుకొచ్చినట్లు గన్మ్యాన్ అంగీకరించారు. అయితే... ఒక్కో విడతలో ఎంత ఇచ్చారనే విషయం తెలిసేది కాదని చెప్పినట్లు సమాచారం.
మూడున్నర కోట్లు తెచ్చాం..
2019లో ఎంపీగా గెలిచి అత్యంత వివాదాస్పదంగా వ్యవహరించి, మళ్లీ ఎంపీగా బరిలో నిలిచిన వైసీపీ నేతకూ రాజ్ కసిరెడ్డి సిబ్బంది ద్వారా డబ్బులు అందాయి. ఎన్నికల సమయంలో తన ఖర్చుల కోసం ఒకసారి సూర్యాపేట వరకు వెళ్లి... రూ.3.50 కోట్లు పుచ్చుకున్నట్లు తెలిసింది. ఎంపీ స్టిక్కర్ ఉన్న వాహనంలో సొంత డ్రైవర్తో తానే స్వయంగా వెళ్లినట్లు ఆధారాలు లభించాయి. ఆ డ్రైవర్ను సిట్ అధికారులు ప్రశ్నించారు. ఆయన తొలుత నోరు విప్పలేదు. తాను ఏం చెప్పినా ప్రాణాలకు ముప్పు వస్తుందని వాపోయారు. నిజం చెబితే ఎలాంటి ఇబ్బంది ఉండదని, రక్షణ కల్పిస్తామని సిట్ అధికారులు భరోసా ఇవ్వడంతో... ఒక రోజు తాను మూడున్నర కోట్లు తెచ్చానని, పలుమార్లు వెళ్లి డబ్బులు తీసుకున్నప్పటికీ ఎంత అనేది తనకు తెలియదని చెప్పినట్లు సమాచారం.
రేపు కోర్టులో మెమో..
ఏఆర్ కానిస్టేబుల్ గిరి, రాజ్ కసిరెడ్డి డ్రైవర్ శ్రీకాంత్, మాజీ ఎంపీ డ్రైవర్ ఇచ్చిన సమాచారం ఆధారంగా శుక్రవారం కోర్టులో సిట్ ఒక మెమో దాఖలు చేయబోతున్నట్లు తెలిసింది. నిందితుల జాబితాలో వైసీపీ ఎంపీ అభ్యర్థులను కూడా చేర్చి విచారణకు పిలిచే అవకాశముంది. ఈ దిశగా ఇప్పటికే సాంకేతిక ఆధారాలన్నీ సేకరించినట్లు సమాచారం.
ఈ వార్తలు కూడా చదవండి..
For AndhraPradesh News And Telugu News